ఈకేవైసీ కోసం రేషన్ కార్డుదారుల తిప్పలు..
పిల్లలకు ఆధార్ లింక్ చేయడానికి రోజంతా క్యూ లైన్ లో పేరెంట్స్.
గ్యాస్ సెంటర్ దగ్గర ఈ కేవైసీ కోసం ఎగబడ్డ జనాలు.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
రేషన్కార్డులోని సభ్యులందరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో మహబూబ్ నగర్ జిల్లాలోని కార్డుదారులంతా అవస్థలు పడుతున్నారు.జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలకేంద్రంలో వేకువజాము నుంచే ఆధార్కేంద్రాల వద్ద కుటుంబసభ్యులతో సహా బారులు తీరుతున్నారు. రోజూ వందల సంఖ్యలో కార్డుదారులు రావడంతో ఆధార్ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. మళ్లీ కరోనా సోకుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈకేవైసీ నమోదు కేంద్రాల వద్ద ఎలాంటి భౌతికదూరం లేకపోవడం గమనార్హం. నవీకరణ కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది కూడా ఈనెల 31లోపు ఈకేవైసీ చేయించుకోవాలని చెబుతుండటంతో అందరూ పరుగులు తీస్తున్నారు.
కార్డులోని సభ్యులు ఈకేవైసీ చేయించుకోని పక్షంలో వచ్చే నెల నుంచి రేషన్ రాదని, అలాగే ప్రభుత్వం విద్యార్థులకు అందించే వివిధ పథకాలకు అనర్హులుగా గుర్తిస్తారని ప్రచారం జరుగుతుండటంతో వందలాది మంది రేషన్ కార్డుదారులు అవస్థలు పడుతున్నారు. ఉదయం నుంచి ఆధార్ కేంద్రం దగ్గర బారులు తీరుతున్నారు. అయితే క్యూ లైన్ లో నిలిచి ఉన్న జనాలకు మాత్రమే టోకెన్లు అందుతుండటంతో మిగిలిన వారు నిరాశతో తిరిగి వెళుతున్నారు.. మరిన్ని ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేసి ఇబ్బందులు తొలగించాలని కార్డుదారులు కోరుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఆధార్ కార్డుతో ఎలక్ట్రానిక్ పద్ధతిన వినియోగదారుల రేషన్ కార్డుల అనుసంధానం (ఈ–కేవైసీ) కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్పష్టం చేశారు. రేషన్ కార్డుల్లోని పేర్ల అనుసంధానం కోసం ఆధార్ సెంటర్లకు పోవాల్సిన పని లేదని, సమీపంలోని వలంటీర్లను, వీఆర్వోలను సంప్రదిస్తే సరిపోతుందని తెలిపారు. వలంటీర్లను, వీఆర్వోలను సంప్రదించిన తర్వాతే ఆధార్ సెంటర్లకు వెళ్లాలని సలహా ఇచ్చారు. కొత్తగా ఆధార్ కార్డు కావాల్సిన వారు, ఇతరత్రా మార్పులు చేర్పులు చేయించుకోదలచిన వారు మాత్రమే ఆధార్ సెంటర్లకు వెళ్లాలన్నారు. ఎవరి రేషన్ కార్డులూ రద్దు కాబోవని, ఆధార్తో అనుసంధానం అయిన రోజు నుంచే బియ్యం తీసుకోవచ్చునని తెలిపారు. కానీ నవాబుపేట మండల ఆధార్ కేంద్రం వద్ద అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని వివిధ గ్రామాల ప్రజలు తెలియజేశారు. బయోమెట్రిక్ / ఫోన్ నెంబర్ లింక్ చేయడానికి 150 రూపాయలు. ఫోన్ నెంబర్ లింకు కొరకు అయితే 100 రూపాయలు జనాల నుంచి వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఒక్క రోజుకు 20 నుంచి 30 టోకెన్లు ఇస్తున్నారని, మినిమం 50 టోకెన్లు ఇవ్వాలని జనాలు కోరుతున్నారు. అధికవసులకు పాల్పడుతున్న వారిపై అధికారుల చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.