
మందమర్రి, నేటిధాత్రి:-
సింగరేణి సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి రక్షణలో భాగస్వామ్యం కావాలని రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ డిజి నాగేశ్వరరావు, ఏరియా జిఎం ఏ మనోహర్, బెల్లంపల్లి రీజనల్ సేఫ్టీ ఏజిఎం కేహెచ్ఎన్ గుప్త, ఏరియా రక్షణాధికారి ఏం రవీందర్ లు సూచించారు. సింగరేణి 54వ రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ జి నాగేశ్వరరావు రక్షణ తనిఖీ బృందం శనివారం ఏరియాలోని కాసీపేట 2 గనిని సందర్శించారు. ఈ సందర్భంగా రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ జి నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో అతి తక్కువ ప్రమాదాలు నమోదు అయ్యాయని, దీనికి కృషి చేసిన కార్పొరేట్ సేఫ్టీ జిఎం గురువయ్యకు అభినందనలు తెలిపారు. అనంతరం ఏరియా జిఎం ఏ మనోహర్ మాట్లాడుతూ, రక్షణ కోసం ఉద్యోగులు ఆధునిక సాంకేత పరిజ్ఞానంతో చేసిన రక్షణ పరికరాలను, పనిముట్లను వాడాలని, రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలన్నారు. బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జిఎం కేహెచ్ఎన్ గుప్త మాట్లాడుతూ, భద్రత మన ఇంటి నుండి మొదలు కావాలన్నారు. ఈ సందర్భంగా ఏరియా రెస్క్యూ సిబ్బంది అత్యవసర పరిస్థితిలో సిపిఆర్ చేయు విధానాన్ని ఉద్యోగులకు వివరించారు. అనంతరం గత సంవత్సరం నిర్వహించిన 53వ వార్షిక రక్షణ పక్షోత్సవాల్లో గెలుపొందిన బహుమతులను సంబంధిత ఉద్యోగులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏరియా కమ్యూనికేషన్ సెల్ కళాకారులు హెల్మెట్ ప్రాముఖ్యతను, ట్రామర్ విధులు, విధి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ప్రదర్శించిన లఘు నాటిక వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ అడిషనల్ మేనేజర్, రక్షణ తనిఖీ బృందం కో కన్వీనర్ కే ప్రవీణ్ విక్రమ్, సెంట్రల్ వర్క్ షాప్ ఈ అండ్ ఎం ఎస్ఈ రక్షణ తనిఖీ బృందం సభ్యుడు పి సాయినాథ్, కేకే గ్రూప్ ఏజెంట్ వి రామదాస్, గని మేనేజర్ లక్ష్మీనారాయణ, కేకే గ్రూప్ ఇంజనీర్ రాంప్రసాద్, గని సంక్షేమ అధికారి భార్గవ్, సేఫ్టీ కమిటీ సభ్యులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.