ఘనంగా నూతన మండలం, తహశీల్దారు కార్యాలయం ప్రారంభం
ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంగా మంత్రులు దయాకర్ రావు,సత్యవతి రాథోడ్, ఎంపీలు రవిచంద్ర,కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్,జల వనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వి.ప్రకాష్ లకు
అపూర్వ స్వాగతం పలికిన జనం
కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వివిధ గ్రామాల ప్రజలు
తారాసింగ్ బావి తండా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే
అతిథులకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలతో ఇనుగుర్తిని నింపేసిన అభిమానులు
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గ్రామం పండుగ వాతావరణం సంతరించుకున్నది.ప్రజలు తమ 37 ఏళ్ల కల నెరవేరిన సందర్భంగా
ఆదివారం ఆనందోత్సవాల మధ్య పండుగ చేసుకున్నారు. ఇనుగుర్తి మండలం, తహశీల్దారు కార్యాలయం ఘనంగా ప్రారంభమయ్యింది.ఈ సందర్భంగా ఇనుగుర్తికి విచ్చేసిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,లోకసభ సభ్యురాలు మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్,జల వనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వి.ప్రకాష్ లకు స్థానికులు నీరాజనాలు పలికారు.జిల్లాలోని నెల్లికుదురు మండలం తారాసింగ్ బావి తండా వద్దకు వేలాదిమంది తరలివచ్చి అతిథులకు అపూర్వ స్వాగతం పలికారు, అక్కడి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.అటుతర్వాత అతిథులను టాప్ లేని వాహనంపై ఎక్కించి డీజే,డప్పు చప్పుళ్లు, మంగళవాయిద్యాలు,మహిళలు కోలాటం ఆడుతూ,ద్విచక్ర వాహనాలపై తరలివచ్చిన యువత బాణాసంచా కాలుస్తూ నాయకులను ఊరేగింపుగా ఇనుగుర్తి వరకు తోడ్కొని వచ్చారు.అతిథులకు గజమాల వేసి హార్థిక స్వాగతం పలికారు,వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య రిబ్బన్ కత్తిరించి తహశీల్దారు కార్యాలయాన్ని ప్రారంభించి,ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.అతిథులు తహశీల్డార్ అబిదలీని లాంఛనంగా ఆయన కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ,జై కేసీఆర్ జైజై కేసీఆర్”,”వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి”అనే నినాదాలు హోరెత్తాయి.ఆ తర్వాత ఏర్పాటైన సభ ప్రజల చప్పట్లు, హర్షధ్వానాల మధ్య విజయవంతమైంది.కార్యక్రమంలో ఎంపీపీ చంద్రమోహన్, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్ రెడ్డి,ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ దార్ల రాంమూర్తి,ఎంపీటీసీలు రజిత,రజని,మంజుల,మార్క్ ఫెడ్ డైరెక్టర్ మర్రి రంగారావు,ఎంపీ రవిచంద్ర సోదరులు వద్దిరాజు కిషన్, దేవేందర్,వెంకన్న,మోహన్,పెద్ద వెంకన్న తదితరులు పాల్గొన్నారు.