ఏది నిజం! ఏది అబద్ధం!?
మంత్రి మల్లన్నతో టిఆర్ఎస్ ఇమేజ్ డ్యామేజీ?
మల్లన్న..మాటలో మరేదో మర్మం!?
రేవంత్కు పరోక్ష సహాకారమా?
తొమ్మిదేళ్లుగా వేధింపులెందుకు భరిస్తున్నట్లు?
రేవంత్ కూతురు పెళ్లికి ఖర్చెందుకు పెట్టుకున్నట్లు?
అక్రమాలు నిజమే అని ఒప్పుకున్నట్లు కాదా?
రేవంత్ వేధింపులు బైటపెట్టవెందుకు ?
దాడి దాకా తెచ్చుకొని పార్టీ పరువు తీసినట్టు కాదా?
మంత్రివన్న మాట మర్చిపోయి మాట్లాడతున్నావా?
ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడ్డావు?
ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నావ్?
అప్పుడే తొడగొడితివి, కాసేపటికే కన్నీళ్ళు పెడితివి?
జనం ఏది నమ్మాలి?
ప్రతిపక్ష పార్టీ నేతకు మంత్రి భయపడడం బలహీనత అనిపించుకోదా?
ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడం కాదా?
రేవంత్ బలవంతుడని పరోక్షంగా ప్రచారం చేస్తున్నట్లు కాదా?
గతంలో అంటే సరే….ఇప్పటికీ కన్నీళ్లెందుకు?
రేవంత్ ను ఎదిరించలేని తనానికి నిదర్శనమా?
రేవంత్ కు భయపడే టిఆర్ఎస్ లో చేరానని చెబుతున్నట్లా?
డిల్లీలో చంద్రబాబును కలిసి టిక్కెట్టు తెచ్చుకునేంత సీక్రెట్ ఏముంటుంది?
మల్లన్న మాటల విన్యాసంలో అసలు మర్మమేమిటి?
అయితే తొడైనా కొట్టాలి…లేకుంటే సానుభూతైకోసమైనా పాకులాడాలి! ఏక కాలంలో రెండూ కావాలంటే కుదరదు. అందులోనూ అధికార పార్టీలో, ముఖ్యంగా ఉన్నతమైన పదువుల్లో వున్నవారికి అసలే సాధ్యం కాదు. తానే బౌలింగ్ చేస్తా… తానే బ్యాటింగ్ చేస్తా అంటే అసలే కుదరదు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ కాకుండా పోదు…. అయినా బాధ్యత కల్గిన మల్లన్న మంత్రి పదవిలో వుండి, నన్ను రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు? తొమ్మిదేళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు? ఏడిపించుకుతింటున్నాడు? అని మంత్రే వాపోతే ఇక సామాన్య ప్రజలకు దిక్కేది? వారికి రక్షణేది? అన్న అనుమానాలు జనానికి రావా? ప్రజలు అభధ్రతాభావానికి లోను కారా? కాపాడాల్సిన పదవిలో కూర్చొని తన వల్ల ఏదీ కాదని మంత్రి చెప్పకనే చెప్పినట్లు కాదా? తాను ప్రజలను కాపాడలేనని ఒప్పుకున్నట్లు కాదా? ప్రతిపక్ష నాయకుడు భయపెడితే బెదిరిపోయే స్ధాయిలో వుంటే ఇక మల్లన్నకు పదవులెందుకు అన్న ప్రశ్న ఉత్పన్నం కాదా? మంత్రి మల్లన్నా…ఈ మాత్రం తెలియకుండానే రాజకీయాలెలా?
తనను ఎనుకున్న ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రజా ప్రతినిధివి. చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడివి. మంత్రిగా రాష్ట్రం మొత్తానికి బాధ్యుడివి. అలాంటిది ప్రతిపక్షనేత రేవంత్ వెంటపడుతున్నాడు…వేధిస్తున్నాడు..?అని చెప్పడం వల్ల తెలంగాణ రాష్ట్ర సమితికి నష్టదాయం కాదా? పార్టీకి తలవంపులు అన్న ఆలోచైనా వుందా? వ్యక్తిగతంగా మంత్రి మల్లారెడ్డికి ఇప్పటికే కావాల్సినంత డ్యామేజీ అయ్యింది. అది ఇప్పుడు పార్టీ మెడకు చుట్టుకుంటుందన్న సంగతి తెలియదా? అరేయ్..ఒరేయ్ అనే పదాలు రాజకీయాల్లో కామైనపోయాయి… రేవంత్రెడ్డిని…అరేయ్ …తురేయ్ అంటూ తొడగొడితివి. అంతు చూస్తానని ఛాలెంజ్ చేస్తివి…అక్కడితో ఆగిపోతే బాగుండేది. కాని కన్నీళ్లెందుకు? కనికరం చూపాలన్నంత దుగ్ధద స్వరంతో మాటలెందుకు? ఇదే కదా కొంపముంచేది? అయినా రాజకీయాల్లో హుందాతనం వుండాలి….సహజంగా ప్రతిపక్షనేతలన్నవారు అధికార పక్షాన్ని రెచ్చగొడతారు? గిల్లి కజ్జాలు పెట్టుకుంటారు. ప్రభుత్వాన్ని ఎలా బైటేయాలని చూస్తుంటారు. ఇది ప్రతిపక్షాల నిర్వర్తించాల్సిన బాధ్యత. కాదని ఎవరూ అనలేరు. ఎక్కడైనా ప్రభుత్వం వేధిస్తుందని ప్రతిపక్ష నేతలు వాపోయిన రోజులే చూశాం….కాని కొత్తగా మంత్రి మల్లన్న మూలంగా ప్రతిపక్ష నేతలు కూడా ప్రభుత్వ పెద్దలను వేధిస్తారని తెలియజేసినట్లైంది. మల్లారెడ్డి, రేవంత్రెడ్డిల వ్యవహారం పార్టీలపరమైంది కాదు…వ్యక్తిగతమైంది. ఆ వైరం ఇప్పటిదికాదు….తెలుగుదేశం పార్టీలో ఇద్దరూ వున్నప్పటినుంచి సాగుతోంది. దాన్ని తీసుకొచ్చి మంత్రి మల్లారెడ్డి టిఆర్ఎస్కు ఎందుకు ముడిపెడుతున్నారన్నదే ఇక్కడ అసలు పాయింట్…
అసలు రాష్ట్రంలో రెడ్డి రాజకీయం పేరుతో ఏం జరగుతోంది. ప్రతిపక్షాలు అధికారంకోసం ప్రయత్నాలు చేయడం సహజం. వున్న అధికారాన్ని కాపాడుకోవాలనుకోవడం అధికారపక్షానికి అవసరం. కాని ఇద్దరు నేతల వ్యక్తిగత ప్రతిష్ట మూలంగా అధికార పార్టీకి నష్టం వాటిల్లేదకా వెళ్లడాన్ని ఎవరూ సమర్ధించరు. అయినా మంత్రిగా వున్న మల్లారెడ్డి ఏవైనా తమ సామాజిక వర్గపరమైన సమస్యలు వుంటే, ముఖ్యమంత్రి కేసిఆర్తో చెప్పి చేయించుకునే వీలుంది. ఆ వెసులుబాటు వుంది. వాటిని పూర్తిచేసి, మన ప్రభుత్వం మన సామాజిక వర్గానికి మేలు చేసిందని చెప్పుకునే అవకాశం వుంది. కాని గర్జన నిర్వహిస్తే, అది విన్నపం కాదని మంత్రికి తెలియదా? మల్లారెడ్డికి గర్జన అంటే తిరుగుబాటు అన్న విషయం తెలియనంత అమాయకుడా? ప్రభుత్వం మీద లక్షలాది మందిని పోగు చేసి, సభ ఏర్పాటు చేస్తే, అల్టిమేటమ్ జారి చేసినట్లు కాదా? మంత్రివై వుండి, రెడ్డి గర్జన అంటూ గలాటా దాకా తెస్తివి…దాడి దాకా తెచ్చుకుంటివి? ఏం లాభం? బీరాలు పలికి, తోక ముడిస్తివి…ప్రత్యర్ధికి భయపడితివి? ఆఖరుకు ప్రభుత్వం పరువు తీస్తివి? అసలు గర్జనలాంటి సభలు ఎందుకు నిర్వహిస్తారో కూడా తెలియంకుడా రాజకీయం చేస్తుంటువి? ప్రభుత్వానికి రెడ్డి సామాజిక వర్గం నుంచి హెచ్చరిక దగ్గరుండి చేసినంత పనిచేస్తివి? అసలు ఏమీ లేని దగ్గర లేనిదేదో చేయాలని చూసి, లేని కుంపటి పెట్టి రెడ్డి జనం మనసు మార్చితివి…ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేస్తివి…? భోళా మనిషి మల్లన్న అందరూ అనుకుంటున్న తరుణంలో పార్టీని బోర్లేషే దాకా తెచ్చావని కూడా అనుకుంటున్నారు…?
రాష్ట్రానికి మంత్రి అంటే ఎంతో బాధ్యతాయుతమైంది. దాన్ని సమర్ధవంతంగా నిర్వహించిన పేరు కోసం పాకులాడాలి. కాని పనికి రాని విషయాలన్నీ నెత్తిమీద వేసుకొని, పార్టీ నెత్తిన రుద్దడాన్ని టిఆర్ఎస్లో నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. నీ పని నీవు చూసుకోక, కార్మిక శాఖ నిర్వహిస్తూ వారి సమస్యలు గాలికొదిలేసి, రెడ్డి సమస్యలు ముందుకు తెచ్చి, పార్టీకి ముప్పు తెచ్చేదాకా తెచ్చితివి. తెలంగాణ రాష్ట్ర సమితి ఏనాడో రేవంత్ను పట్టించుకోవడం మానేసింది. ఓటుకు నోటు లాంటి రాజకీయ నేరంలో బాధ్యుడిని పదే పదే గుర్తు చేసి, హీరోను చేయొద్దుని నిర్ణయించింది. అది తెలుసుకోకుండా నిత్యం రేవంత్ రెడ్డిని విలన్, విలన్ అంటూ హీరోను చేసే కార్యక్రమం నెత్తినెత్తుకున్నంత పనిచేస్తివి. నీకంటే రేవంత్ రెడ్డే పవర్ పుల్ అని పరోక్షంగా నిరూపించవడితివి. ఇప్పుడు చెప్పు మంత్రి మల్లన్న…ఏం చెప్పి సమర్ధించుకుంటావు? అని నాయకులు ప్రశ్నిస్తున్నారు. మంత్రి కేటిఆర్ను నియోజకవర్గానికి రమ్మని మంత్రిగా వుండి సమస్యలు ఏకరువు పెడితివి? ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని నువ్వే చెబితివి? ప్రతిపక్షం చేయాల్సిన పని మంత్రిగా మీరే చేస్తిరి? రాష్ట్రమంతా మిషన్ భగీరధ నీళ్లు ఇంటింటికీ వస్తున్నాయని ప్రభుత్వం ప్రచారం చేస్తుంటే, జవహర్నగర్లో ప్రజల ముందే నీళ్ల గోస తీర్చమంటివి? మంత్రిగా ఆ సమస్యలను పరిష్కరించాల్సిన స్థానంలో వుండి, వాటిని ఎలిగెత్తిచాటినంత పనిచేస్తివి. అదే జవహర్ నగర్లో కరంటు లేదంటివి. చీకట్లో జనం మగ్గుతున్నారంటివి? దాంతో మంత్రి కేటిఆర్ ముందే ప్రభుత్వం పరవు తీస్తివి…ఇలా ఒకటా? రెండా? అనేకం చేస్తూనే వుంటివి…అయినా ఎవరు పెద్దగా ఆలోచించలేదు. రెడ్డి రాజకీయంతో అసలు దాడిదాకా తెచ్చుకొని రెడ్డిలు ప్రభుత్వం మీద ఆగ్రహంగా వున్నారని చూపిస్తివి…
రేవంత్రెడ్డి నన్ను వదలడం లేదంటూ పదే పదే చెబుతూ, తన కూతురు పెళ్లి ఖర్చులు ఇచ్చానంటివి? పిపిసి పదవి రేవంత్రెడ్డి కోట్లు పెట్టి కొనుక్కున్నాడని మీరే అంటిరి. కూతరు పెళ్లిచేసేంత స్ధోమత లేదన్నట్లు రేవంత్కు తానే డబ్బులిచ్చానంటిదిరి? ఇందులో ఏది నిజం? ఏది అబద్దం? అయినా పాలమ్ముకొని కష్టపడి పైకి వచ్చిన మంత్రి మల్లారెడ్డి ఏ తప్పు చేయనప్పుడు రేవంత్రెడ్డికి ఎందుకు డబ్బులివ్వాల్సివచ్చింది? అంటే పరోక్షంగా తాను తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లే కదా? ఇంకా ఈ బొంకులెందుకు? ఆ రంకెలెందుకు? ఏడుపులెందుకు? పార్టీ పరువు భజారునేయడం ఎందుకు? డిల్లీకి వెళ్లి చంద్రబాబుకు సైతం రేవంత్ దుష్ట రాజకీయం గురించి టిక్కెట్టు తెచ్చుకున్న మల్లారెడ్డిని కాదని, చంద్రబాబు రేవంత్నే ఎందుకు నెత్తిన పెట్టుకున్నట్లు? ఆయనకే ఎందుకు అంత ప్రాదాన్యత ఇచ్చినట్లు అన్నది జనం ఆలోచించకుండా వుంటారా? అయినా అవసరం లేని వేళ, అనవసరమైన విషయాలు తెరమీదకు తెచ్చి, అర్ధాంతరంగా గందరగోళ రాజకీయాలు చేయాలని చూస్తే ఇలాగే వుంటుంది…అడ్డదిడ్డమైన ఆరోపణలకు గురి కావాల్సివస్తుంది!