`రోత మాటల సర్వసంగ పరిత్యాగి!!
` తన చీటి తాను చింపుకున్న చినజీయరుడు
` తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురయ్యాడు!
` నోటి దూల తెచ్చిన తంటా..పాపం పండితే వచ్చే మాటల తీట?
` దైవ దూషణతోనే ఎవరికైనా పతనం మొదలు
` తెలంగాణ గడ్డమీద సమ్మక్క ఎవరని..అదెవరని సంబోధిస్తావా?
` ఇంతకీ నువ్వెవరో.. తెలుసుకొనే మాట్లాడావా?
` తెలంగాణ అంటేనే ప్రకృతి శక్తులకు నియలం…
` ఆ ప్రకృతి శక్తులే సమ్మక్క ,సారక్క ప్రతిరూపాలు
` తెలంగాణ ఉనికే సమ్మక్క..సారక్క స్పూర్తి
` విముక్తి విజయాలు తెలంగాణ సొంతం
హైదరాబాద్ , నేటిధాత్రి :
అహం తలకెక్కితే అల్పుడౌతాడు. పాపం పండే రోజు దాపురిస్తే దైవ దూషణకు దిగుతాడు. ఇదే వ్యక్తి పతనానికి నాంది. పురాణాలు చెప్పిందిదే…దేవుడు కూడా దూషించేవాడిని పది మందికి పరిచయం చేసి మరీ, దైవ దూషణ చేయింది దుర్గతిని ప్రసాదిస్తాడు. ఇలాంటి గతి పడుతుందని నిరూపిస్తాడు. అప్పుడు నోరెత్తడానికి అందరూ భయపడతారు. కాలం గడిచే కొద్ది మనిషిలో, సమాజంలో మార్పు సహజం. ప్రతి సారి ఒక దుర్మార్గున్ని జనింపజేసి, దైవ దూషణ చేయిస్తాడు. పతనం ఎలా వుంటుందో అన్నది పదే పదే చూపిస్తాడు. ఇక్కడ సరిగ్గా అదే జరుగుతోంది. చిన జీయరుడు యాదగిరి నర్సన్న పేరు మార్చిన నాడే అతని పతనం మొదలైనట్లు తెలంగాణ జనమే అనుకున్నారు. అన్నట్లుగానే సరిగ్గా గుడి పూర్తయ్యేలోగా చినజీయరుడి చీటి చిరిగే సమయం ఆసన్నమైంది. ఇంతకన్నా దైవం వున్నాడన్న దానికి మరో సంకేతం లేదేమో! అని కూడా అనుకోవాలి. కాలం కలిసి రాకపోతే తాడే పామౌతుందంటారు..పదేళ్ల కింద చేసిన పాపపు వ్యాఖ్యలు ఇప్పుడు వెలుగులోకి వచ్చి, జీయరుడి చీకటి బతుకును కథకథలుగా చెప్పుకునేలా చేస్తోంది. ప్రకృతి దూషణ అన్నది ఎంత పాపమో తెలిసి కూడా దైవ దూషణ చేశాడు. సహజంగా జనం మేధావి మాటలు తొందరగా నమ్మరట. పిచ్చోడి మాటలు వెంటనే నమ్మేస్తారట.
తెలంగాణ అంటేనే ఒక శక్తి. ఒక ఉద్యమ స్పూరి. చరిత్రంతా తిరగేసినా ఎదిరించే తత్వంతో సాధించిన విజయం. అది ప్రకృతి విజయమైనా….ప్రజల విజయమైనా…తెలంగాణకు ఒక్కటే…తెలంగాణ ప్రతి ఊరిలోనూ ప్రకృతి దేవతలు, గ్రామ దేవతల ఆలయాలుంటాయి. అలాగే తెలంగాణలో సమ్మక్క సారక్క జాతరలే కాదు, గద్దెల కొలువులు అనేక జిల్లాల్లోనూ వుంటాయి. అక్కడ కూడా సమ్మక్క సారక్కలు పూజలందుకుంటారు. మేడారం వెళ్లలేని వాళ్లు, తమ గ్రామాల్లోనే గద్దెల నిర్మాణంతో అమ్మలను కొలుస్తారు. తెలంగాణ అంతటి విశిష్టత, ప్రాశస్త్యం సమ్మక్క..సారక్కలకు వుంది. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర. పేరుకే గిరిజన జాతరైనా కోట్లాది మంది ప్రజలు కోరుకునే వేల్పులు ఆ తల్లులు. అలాంటి తల్లులను దూషించిన నోరు చేసిన పాపం ఊరికే పోతుందా? ఆ పాపం వెంటాడకుంటుందా? చినజీయరుడి కధను తలికిందులు చేయకుండా వుంటుందా? తెలంగాణ సమాజమంతా ఒక్కసారిగా భగ్గుమంటోంది. తెలంగాణ సమాజ ఆగ్రహానికి గురైనవారు చరిత్రలో గతిలో ఎందరో నీచులున్నారు.
రాముడు, కృష్ణుడు పురాణ పురుషులు. వారు ముందు వీరులు. ఆ తర్వాతే దేవుళ్లు. కారణజన్ములై ప్రజలకు మంచి నేర్పేందుకు, లోక రక్షణ కోసం అవతరించారు. ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం కోసం కృషి చేశారు. సత్యం, ధర్మాలకు ప్రతీకలుగా, ఆద్యులుగా నిలిచారు. చెడు మీద విజయాలు సాధించి వీరులయ్యారు. ప్రజల ఆరాధ్యులయ్యారు. ఇక్కడ సమ్మక్క..సారక్క కూడా అంతే…ముందు వారు వీరవనితలు. చెడుమీద పోరాటం చేసిన వాళ్లు. తమను అణిచివేస్తున్నవారి మీద తిరుగుబాటు చేశారు. యుద్ధం చేశారు. ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేశారు. తర్వాత దేవతలయ్యారు. కొన్ని వందల సంవత్సరాలుగా ప్రజలకు అండగా వుంటున్నారు. ఆయురారోగ్యాలు ప్రసాదిస్తునారు. తెలంగాణ తోపాటు పొరుగున వున్న చత్తీస్ఘడ్, మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలకు ఇలవేల్పులయ్యారు. అలాంటి సమ్మక్క సారక్కల గురించి తెలిసీ తెలియక తిక్కవాగుడు వాగడమే తప్పు. పైగా వారినిద్ధేశించి అది అంటూ సంభోధించడం చిన్న జీయరుడి అహంభావానికి నిదర్శనం. తెలంగాణ దృష్టిలో సమ్మక్క `సారక్కలు ఆది దేవతలు…వన దేవతలు వాళ్లు… వాళ్లను తూలనాడడం క్షమించరానిది.
తెలంగాణలో బతుకుతూ తెలంగాణ ఉద్యమాన్ని కళ్లతో చూసిన అనుభవం చినజీయరుడకి వుంది. తెలంగాణలో కొన్ని కోట్ల కుటుంబాలకు ఇలవేల్పులైన వన దేవతలనుద్ధేశించి చేసిన వెలికి వ్యాఖ్యలపై చినజీయరుడుకి కనువిప్పు కలగాల్సిన అసవరం వుంది. తిన్నింటి వాసాలు లెక్కించడం అనేది ఏమిటన్నది రెండుసార్లు చినజీయరు నిరూపించుకున్నట్లైంది. తన బుద్దేంటో తనే స్వయంగాచెప్పినట్లైంది. ఇంకా తెలంగాణ సమజం ఉపేక్షించే స్ధితిలో లేదు. ద్వైతానికి, అద్వౌతానికి తేడా తెలియని చినజీయరు విశిష్టాద్వైతం గురించి మాట్లాడడం అంటే తేలు మంత్రం రాని వాడు పాము మంత్రం చెప్పినట్లే అని మేధావులు ఏనాడో చెప్పారు. సమ్మక్క` సారక్క జాతర అనేది ఒక వ్యాపారమా? మరి చినజీయరు చేస్తున్నదేమిటి? సమతా మూర్తి సందర్శనకు టిక్కెట్లెమిటి? సమతా మూర్తి విగ్రహం దైవ స్వరూపమేమీ కాదు. భువినుంచి రామానుజుడు దిగి రాలేదు. చినజీయరుడు దైవ దూత అసలే కాదు…పాపపు కూతలు కూసే వాడని తనను తాను నిరూపించుకున్నాడు. ఆ మధ్య కులాలు మాసిపోకూడదు. ఏ కులం వారు ఆ కులవృత్తిని చేయాలి. మాంసం తినేవారు జంతువుల్లాగా ప్రవర్తిస్తారు. కోడిని తిన్నవారు కోడిలాగే వ్యవహరిస్తారంటూ సమాజ ఆహార వ్యవహారాల మీద దాడి చేశాడు. అప్పుడే తెలంగాణ సమాజం తిరగబాల్సివుండే. కాని వదిలేశారు. గట్టిగా నిలబడలేదు. కాని ఇప్పుడు తెలంగాణలోని ఏ సమాజం చినజీయరుడిన వదిలేయొద్దు. ఆయనతో క్షమాపణ చెప్పడమే కాదు భవిష్యత్తులో ధర్మప్రవచనాల పేరుతో చిల్లర మాటలు మాట్లాడనని కూడా చెప్పించాలి.
తెలంగాణ మీద సాంస్కృతిక దాడి అంటే ఇదే…ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత ఉద్యోగ నియామకాల విషయంలోనూ ఇలాగే జరిగింది. నాడు తెలంగాణ విద్యార్ధులు, యువత అంతా ఉర్ధూ మీడియంలోనే చదువుకున్నారు. ఉద్యోగాల విషయంలో తెలుగు సరిగ్గా రాకపోవడంతో ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు ఇలాగే వ్యవహరించారు. తెలంగాణ యాసను అవమాన పర్చారు. సాక్ష్యాత్తు కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ సమజాన్ని అవమానించారు. తెలంగాణలో 1969 ఎప్రిల్ నెలలో ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో గద్వాలలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో తెలంగాణ వారికి తెలివిలేదంటూ వెకిలి వ్యాఖ్యలు చేశారు. ఈ పరంపర ఇలా సాగుతుండంతోనే తెలంగాణ అస్ధిత్వాన్ని కోరుకున్నది. అలాంటిది తెలంగాణ వచ్చాక కూడా తెలంగాణలో వుంటూ, తెలంగాణ ఆచార వ్యవహారాల మీద, సంస్కృతీ సంప్రదాయాల మీద, గుళ్ల మీద, గ్రామ దేవతల మీద కూడా చినజీయరుడు వ్యాఖ్యలు చేయడం సహించరానిది. ఆంధ్రప్రాంతంలో కూడా అనేక జారతలున్నాయి. అక్కడ కూడా అనేక మంది దేవతలు కొలువైవున్నారు. జాతరలు నిర్వహిస్తారు. అక్కడ అలాంటి వ్యాఖ్యలు చినజీయర్ చేస్తాడా? కాని ఏ ధైర్యంతో నీచ పలుకులు పలుకాడు? ఎంత అహంకారముంటే తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలలో ఒక ముఖ్య భాగమైన సమ్మక్క. సారక్కలను గురించి మాట్లాడతాడు?
తెలంగాణ అంటేనే ప్రకృతి. తెలంగాణ అంటేనే ప్రకృతి శక్తి. ఇక్కడ పూలను పూజిస్తారు. పూలలో కూడా గౌరమ్మను చూసుకుంటారు. పూలతో పూజలు చేస్తారు. ఆ పూలతోనే జీవితం ముడివేసుకుంటారు. ప్రకృతిని ఆరాధిస్తారు. అందులో సమ్మక్క సారక్కలు భాగమయ్యారు. వన జీవనంలో వేడుకలకు దేవతలయ్యారు. కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాదిస్తున్నారు. అలాంటిది సమ్మక్క, సారక్కలపై చినజీయరుడి అల్పత్వాన్ని సూచించే మూర్ఖపు వ్యాఖ్యలు ఎవరూ క్షమించొద్దు. ఎవరికీ తెలియని ఓ వ్యక్తిని తెచ్చి సమతా మూర్తి అని పరిచయం చేసి, వ్యాపారం చేసే వ్యక్తి తెలంగాణకు చీడపురుగవుతున్నాడని తెలంగాణ సమాజం భావిస్తోంది. అతనికి అధిక ప్రాధాన్యతన్విడంతోనే తరతరాలుగా కొలుస్తున్న యాదగిరి నర్సింహస్వామి పేరును చెరిపేసే కుట్ర చేసినప్పుడే అతని స్వరూపం తెలిసిపోయింది. తన ఎదుగుదలకు ఎంతో సహకరించిన ముఖ్యమంత్రి కేసిఆర్ పేరు సమతా మూర్తి విగ్రహావిష్కరణ శిలాఫలకంలో చేర్చనప్పుడే అసలు బుద్ది తేలిపోయింది. సద్భుద్ధి లేని వారు సర్వసంగ పరిత్యాగైనా, దుర్భుద్దికి అన్నో తమ్ముడౌతాడో గాని మనిషి కాలేదు. మానవత్వం నటిస్తే సరిపోదు. మనిషినని చెప్పుకుంటే ఎవరూ నమ్మరు. కోపమొచ్చేలా వ్యవహరిస్తే తెలంగాణ ప్రజలు తరుముతారో…తంతారో కూడా తెలిసి కూడా వెలికి వ్యాఖ్యలు చేయడాన్ని సహించడం అంటూ ఉండదు.