Ensure Quality Education: Collector
విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, నేటి ధాత్రి :
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ మండలం సీతారాంపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల పరిసరాలు, మూత్రశాలలు, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, మెనూ ప్రకారం సకాలంలో విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని తెలిపారు. పాఠశాలలో ఏమైనా మరమ్మతులు ఉన్నట్లయితే వెంటనే పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, వేసవి అయినందున ఆరోగ్యం దృష్ట్యా పాటించవలసిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
