Quality Education Focus in Mancherial
విద్యార్థులకు సకల సదుపాయాలతో నాణ్యమైన విద్య
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లాలోని భీమారం మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం,షెడ్యూల్డ్ కులముల సంక్షేమ శాఖ పరిధిలో నిర్వహిస్తున్న పాఠశాల,వసతి గృహాన్ని సందర్శించి తరగతి గదులు, విద్యార్థుల గదులు, వంటశాల,భోజనశాల, పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని పటిష్టం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో అభివృద్ధి పనులు చేపట్టిందని, విద్యార్థులకు పూర్తి సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఈ క్రమంలో విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం, శుద్ధమైన త్రాగునీరు అందించాలని,విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు.విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని,తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.అనంతరం మండలంలోని దాంపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్ణీత విస్తీర్ణంలో ఇండ్లు నిర్మించుకోవాలని,ఆ దిశగా అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు.నిర్మాణ దశలకు అనుగుణంగా బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుకను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని,ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసుకోవాలని తెలిపారు.ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యం,త్రాగునీరు,ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని,గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.వేసవి అయినందున త్రాగునీటి సమస్య లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
