Veteran CPI Leader Sriramula Ramachandram Passes Away
తుదిశ్వాస వరకు కమ్యూనిస్టుగా బ్రతికిన గొప్ప నాయకుడు శ్రీరాముల రామచంద్రం-చాడ
కరీంనగర్, నేటిధాత్రి:
నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన అనేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనడమే కాకుండా తన జీవితాంతం తుది శ్వాస విడిచే వరకు కమ్యూనిస్టుగా బ్రతికిన గొప్ప నాయకుడు శ్రీరాముల రామచంద్రమని సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. మండలంలోని కొండపల్కల గ్రామానికి చెందిన సిపిఐ మానకొండూర్ మండల మాజీ కార్యదర్శి శ్రీరాముల రామచంద్రం ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను చాడ వెంకటరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పరామర్శించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామానికి చెందిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సీనియర్ నాయకులు శ్రీరాముల రామచంద్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పార్టీకి ఆయన కుటుంబానికి తీరని లోటని, గత నలభై సంవత్సరాలకు పైగా సిపిఐ పార్టీలో గ్రామ స్థాయి కార్యదర్శిగా, మండల కార్యదర్శిగా, జిల్లా కౌన్సిల్ సభ్యులుగా పనిచేశారని, మండలంలో అనేక గ్రామాల్లో పార్టీ విస్తరణ కోసం పనిచేశారని, ప్రజా సంఘాలను ఏర్పాటు చేశారని, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శిగా కూడా కొంత కాలం పనిచేశాడని, ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేశారని, అనేక ప్రజా, వ్యవసాయ కార్మికుల సమస్యలపై ఉద్యమాలు చేశాడని, కొండపల్కల గ్రామంలో పార్టీ కార్యాలయం నిర్మించడంలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడని కొనియాడారు. డెబ్బై ఐదు ఏళ్ల వయస్సులో కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వాడని, నేటి తరం వారికి ఆదర్శంగా నిలుస్తూ ఉండేవాడని, సీనియర్ నాయకులుగా మండలంలో ఆయన పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారని, తన తుది శ్వాస విడిచే వరకు కమ్యూనిస్టుగా బ్రతికిన క్రమ శిక్షణ కలిగిన నాయకుడని అలాంటి నాయకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అత్యంత బాధాకరమని, ఆయన మృతి పార్టీకి వారి కుటుంబానికి తీరని లోటని పార్టీ వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని చాడ వెంకటరెడ్డి తెలిపారు. పరామర్శించిన వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, మండల కార్యదర్శి బండ రాజిరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బూడిద సదాశివ, గ్రామ శాఖ కార్యదర్శి ఎరబోయిన సదయ్య, వార్డు సభ్యులు శాతరాజు సంపత్, నాయకులు భద్రయ్య, పొచమల్లు, రమేష్, నాంపల్లి, కొమురయ్య, రాజు, తదితరులున్నారు.
