Complaint Filed Over Zaheerabad Chairman Election
జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సరికాదు.
◆-: రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు, జిల్లా కలెక్టర్ కు కౌన్సిలర్ స్రవంతి రవి కిరణ్ ఫిర్యాదు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో తీవ్ర అవకతవకలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా సాగిన ఈ ఎన్నికను రద్దు చేసి, తిరిగి కొత్తగా ఎన్నిక నిర్వహించాలని వార్డు నంబర్ 27 కౌన్సిలర్ స్రవంతి డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం, స్థానిక శాసనసభ్యులు మాణిక్ రావు గారి ఆదేశాల మేరకు గురువారం ఆమె తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినిని, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య కలిసి రాతపూర్వక ఫిర్యాదును అందజేశారు.
ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడుతూ తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల నిబంధనలు (2020) ప్రకారం..చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో ఓటింగ్ కోసం కౌన్సిలర్ల పేర్లను ఖచ్చితంగా అక్షర క్రమంలో పిలవాలి. అక్షర క్రమం ప్రకారం తన పేరు మొదటి స్థానంలో రావాల్సి ఉండగా, రిటర్నింగ్ అధికారి నిబంధనలను పక్కనబెట్టి తమకు నచ్చిన విధంగా పేర్లను పిలిచారని స్రవంతి ఆరోపించారు.
అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ప్రయోజనం చేకూర్చేలా ఎన్నికల అధికారులు వ్యవహరించారని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని దుయ్యబట్టారు.
తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019, సెక్షన్ 14(3), రూల్ 4 నిబంధనలను రిటర్నింగ్ అధికారి ఉల్లంఘించారని, తద్వారా ఈ ఎన్నిక ప్రక్రియ మొత్తం చట్టవిరుద్ధంగా మారిందని ఆమె తన ఫిర్యాదులో వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికైన మొహమ్మద్ యూనుస్ ఎన్నికను తక్షణమే చెల్లనిదిగా ప్రకటించాలని పారదర్శక పద్ధతిలో మళ్ళీ కొత్తగా ఎన్నిక నిర్వహించాలని ఆమె పేర్కొన్నారు. న్యాయం జరిగే వరకు, ప్రజాస్వామ్య విలువలను కాపాడే వరకు తన పోరాటం కొనసాగుతుందని, ఈ విషయంలో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపించాలని స్రవంతి విజ్ఞప్తి చేశారు.
