Coal Mines Halted in Bhupalpally Over Labour Code Protest
భూపాలపల్లిలో స్తంభించిన బొగ్గు గనులు!
భూపాలపల్లి నేటిధాత్రి
కేంద్ర ప్రభుత్వం మొండిగా అమలు చేయాలని చూస్తున్న నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా కార్మిక లోకం భగ్గుమంది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా భూపాలపల్లి కెఎల్పి 8 ఇంక్లైన్ వద్ద ఐఎన్టియుసి, ఏఐటియూసి, ఏఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు కదం తొక్కారు. గురువారం ఉదయం నుంచే కార్మికులు విధులను బహిష్కరించి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నినాదాలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ… దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, యాజమాన్యాలకు కొమ్ముకాసేలా 4 కోడ్ లుగా మార్చడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. “ఈ చట్టాలు అమలైతే కార్మికులకు పని గంటల గ్యారంటీ ఉండదని, కనీస వేతనాలు అడిగే హక్కు కూడా కోల్పోతామని” వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తన పద్ధతి మార్చుకోకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు .కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేయాలనీ,కార్మికుల సామాజిక భద్రతను కేంద్రం గాలికొదిలేసిందనీ, అన్నారు .రాజకీయాలకు అతీతంగా సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి సమ్మెను సక్సెస్ చేశాయనీ, హక్కులను కాపాడుకునే వరకు విశ్రమించమనే నినాదంతో భూపాలపల్లి గని ప్రాంతం మారుమోగింది.
ఈ పోరాటంలో కార్మిక నాయకులు చంద్రగిరి శంకర్, సంగం శీను, గుడుగుల శంకర్, పులి కృష్ణ ,
గాజర్ల హరికృష్ణ, కృష్ణారెడ్డి, ఈగ శీను,లింగయ్య, రాము, భోగి రాజయ్య, వినోద్ వందలాది మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేశారు.
