Welfare Schemes Are the Strength of Congress: Kometireddy Venkat Reddy
సంక్షేమ పథకాలే కాంగ్రెస్ విజయానికి పునాది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపు
మూడుచింతలపల్లి, అలియాబాద్ మునిసిపల్ లో ఎన్నికల ప్రచారం, రోడ్ షో
బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరికలు
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :
సంక్షేమ పథకాలే కాంగ్రెస్ విజయానికి పునాదిగా నిలుస్తాయని, మేడ్చల్ నియోజకవర్గంలో మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్ నియోజకవర్గం మూడుచింతలపల్లి – అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ అధ్యక్షతన, ఎమ్మెల్సీ చీఫ్ విప్ పత్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ లతో కలిసి బుధవారం పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వంగా రెండు సంవత్సరాల వ్యవధిలో అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఎన్నికల హామీల మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ముఖ్యమంత్రి సహాయ నిధి, గృహజ్యోతి పథకం, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు వంటి పథకాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చాయన్నారు. మున్సిపాలిటీల్లో కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఘన విజయం అందించాలని ఆయన కోరారు.

అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మహేందర్ రెడ్డి లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుస్తున్నాయని అన్నారు. ప్రజల ఆశీర్వాదాలతో మేడ్చల్ నియోజకవర్గంలోని అన్ని మూడు చింతలపల్లి, అలియా బాద్, ఎల్లంపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రత్నాల శ్రావణి మహేష్, బసవరెడ్డి ల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నారాయణపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఉప్పరి రాంచంద్రయ్య, జిలకరి మహిపాల్ ఎస్సి కమిటీ అధ్యక్షుడు, జీలకర్ర బన్నీ, మల్లికార్జున్, జీవన్, రఘుపతి, ఉప్పరి నర్సిములు తదితరులు పార్టీ లో చేరగా కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, జిల్లా మార్కెట్ కమిటీ ఛైర్మెన్ నర్సింహా యాదవ్, జిల్లా ఆర్టీఏ సభ్యుడు భీమిడి జైపాల్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, మూడు చింతలపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్, అలియాబాద్ మున్సిపాలిటీ అధ్యక్షుడు తుంకి రమేష్, మేడ్చల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
