400 Kg Jaggery and Raw Materials Seized for Illegal Liquor
400 కేజీల గుడుంబా బెల్లం పటిక పట్టివేత
బెల్లం,పటిక,కారు స్వాధీనం..నిందితుడి అరెస్ట్
నాటు సారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవు
నర్సంపేట ఎక్సైజ్ సిఐ నరేష్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
నిషేధిత అక్రమ గుడుంబా తయారి కోసం రవాణా చేస్తున్న 100 కిలోల బెల్లం 300 కిలోల పటిక, ఐదు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి తెలిపారు. ఏ నరేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ డివిజన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు,జిల్లా ఎక్సైజ్ అధికారి అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు నర్సంపేట పరిధిలో నాటుసారా నియంత్రణ కొరకు ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు.ఈ సందర్భంగా నర్సంపేట మండలంలోని ముత్తోజిపేట ప్రధాన రహదారిపై విస్తృత తనిఖీలను చేపట్టగా నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లెకు చెందిన బానోతు రాజన్న @ టీక్య అనే వ్యక్తి కారును అనుమానంతో తనిఖీలు చేయగా కారులో బెల్లం,పట్టిక,నాటుసారా లభ్యమైంది.కాగా అతని వద్ద నుండి 300 కేజీల పట్టిక ,100 కేజీల బెల్లం, ఐదు లీటర్ల నాటుసారా, టాటా విస్టా కారు, ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగిందన్నారు. నిందితుడు పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనంతరం సిఐ నరేష్ రెడ్డి మాట్లాడుతూ నిషేధిత నాటుసార తయారుచేసిన విక్రయించిన చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ రూల్స్ ప్రకారం గుడుంబా తయారు చేసిన,విక్రయించిన ప్రభుత్వం నుండి అందించే సంక్షేమ పథకాలు రద్దు చేయాల్సి ఉంటుందని సిఐ సూచించారు.ఈ తనిఖీలలో నర్సంపేట ఎక్సైజ్ ఎస్సై శార్వాణి, సిబ్బంది పాల్గొన్నారు.
