9 కోట్ల 31 లక్షల రూపాయల విలువ చేసే నిషేధిత గంజాయిని దహనం చేయడం జరిగింది : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం జిల్లాలోని 13 పోలీస్ స్టేషన్లలో నమోదైన 55 కేసుల్లో వివిధ సందర్భాల్లో నిందితుల వద్ద నుండి సీజ్ చేసిన 3,723 కేజిల నిషేధిత గంజాయిని ఈ రోజు హేమచంద్రాపురం గ్రామ శివార్లలోని నిర్మానుష అటవీ ప్రాంతంలో పర్యావరణ కాలుష్య నియంత్రణా నిబంధనలను పాటిస్తూ జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది.దహనం చేసిన నిషేధిత గంజాయి విలువ సుమారుగా 9 కోట్ల 31 లక్షల రూపాయలు ఉంటుంది.జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ రోహిత్ రాజు ఐపిఎస్ మరియు సభ్యులైన భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో కోర్టు వారి అనుమతి తీసుకుని ఈ నిషేధిత గంజాయిని ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు దశల వారీగా విభజించి దహనం చేయడం జరిగింది.ముందుగా జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ అయిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ పోలీస్ స్టేషన్ల వారీగా కొన్ని భాగాలుగా విభజించిన గంజాయిని హెడ్ క్వార్టర్స్ నందు తూకం వేసి పరిశీలించారు.అనంతరం దహనం కొరకు సిద్ధం చేసిన మొత్తం గంజాయిని దగ్గర్లోని అటవీ ప్రాంతానికి తరలించి తగలబెట్టడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. ఎన్ డి పి ఎస్. యాక్ట్ లోని నియమ నిబంధనల ప్రకారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉన్న గంజాయిని ఈ రోజు దహనం చేయడం జరిగిందని తెలియజేసారు.కొందరు అక్రమార్జనలో భాగంగా గంజాయిని విక్రయిస్తూ పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి దించుతున్నారని,ఈ విధంగా ఆసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం జిల్లా వ్యాప్తంగా రహస్య బృందాల్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఎవరైనా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఇకపై మత్తుకు బానిసలై గంజాయి లాంటి మత్తు పదార్ధాలను సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.తో డిఎస్పీలు రెహమాన్,సతీష్ కుమార్ మరియు డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి,సీఐ శ్రీనివాస్,ఆర్ఐలు,సీఐలు, సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.