రూ. 35 లక్షల విలువ గల 34 ఎర్రచందనం దుంగలు స్వాధీనం..
*ముగ్గురు స్మగ్లర్ల అరెస్టు..
*రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం..
తిరుపతి నేటి ధాత్రి :
కడప జిల్లా బద్వేలు అటవీ ప్రాంతంలో 34 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ. శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో డీఎస్పీ శ్రీ జి. బాలిరెడ్డి మార్గ నిర్దేశకత్వంలో మేరకు ఆర్ ఐ చిరంజీవులు కు చెందిన ఆర్ ఎస్ ఐ పి.నరేష్ టీమ్ గురువారం నుంచి బద్వేలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. సి.రామాపురం సమీపంలో ఎద్దులబోడు వద్ద రెండు మోటారు సైకిళ్లపై ముగ్గురు వ్యక్తులు కనిపించారు. వీరు టాస్క్ ఫోర్స్ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు. ఆ చుట్టుపక్కల పరిశీలించగా 34 ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని కడప జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారి నించి మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దుంగలతో సహా స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. వీటి విలువ రూ. 35లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసును ఎస్ ఐ రఫీ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..