వరంగల్, నేటిధాత్రి
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అత్యంత అరుదైన, ఆధునికమైన ఎంఆర్ఐ స్కాన్ యంత్రాన్ని, శుక్రవారం వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం వరంగల్ జిల్లాకు విచ్చేస్తున్న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు ఎంఆర్ఐ స్కాన్ యంత్రం ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని ఎంజీఎం హాస్పిటల్ సుపరిండెంట్ చంద్రశేఖర్ గురువారం ఆసుపత్రి ఆవరణలో ప్రెస్ మీట్ పెట్టి ఎంఆర్ఐ యంత్ర ప్రత్యేకతల గురించి తెలియచేశారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ, టిఎస్ఎంఐడిసి సంస్థ ద్వారా 10కోట్ల 60లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారని, సౌత్ వెస్ట్ ఇండియాలోనే మొట్ట మొదటి హీలియం రహిత అధునాతన ఎంఆర్ఐ సౌకర్యం ప్రభుత్వ సంస్థలో అందుబాటులో ఉంటుంది కావున ప్రజలందరు వినియోగించుకోవాలని, ఈ ఆధునిక ఎంఆర్ఐలో హిలియంపై ఆధారపడడం ఉండదు కాబట్టి నిర్వహణ సులభతరం అవుతాయి అని, నిర్వహణా సంబంధిత ఇబ్బందులు తక్కువ ఉండి నిరంతరాయంగా పనిచేస్తుంది అని, కంపెనీ నుండి 10 సంవత్సరాల గ్యారంటీ ఉంటుంది అని ఎలాంటి సమస్య వచ్చిన కంపెనీదే పూర్తి బాధ్యత ఉంటుందని, ఈ ఆధునిక ఎంఆర్ఐలో రాబోయే కొత్త సాంకేతిక మరియు వ్యాధి నిర్ధారణ అవసరాలకు అనుగుణంగా ఉండడం వలన త్వరితగతిన అప్ గ్రేడ్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది అని అన్నారు. యంత్ర ఆధునుకీకరణ గురించి నూతన వ్యవస్థ కొనుగోలు గురించి చింతించాల్సిన అవసరం లేదని, ఈ ఆధునిక ఎంఆర్ఐ 40% అధిక రెజల్యూషన్ తో డాక్టర్ వ్యాధి నిర్ధారణ పరిధిని పెంచుతుంది అని, ఇది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో అనుసంధానమై ఉన్నందువల్ల ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ చేయడానికి వీలవుతుంది. పెద్ద ఫీల్డ్ ఆఫ్ వ్యూ కవరేజ్ కారణంగా అతి తక్కువ సమయంతో పూర్తి శరీరాన్ని స్కాన్ చేయగలుగుతుంది. ఉదాహరణకు మొత్తం వెన్నెముక ఇమేజింగ్, 70సెంటిమీటర్ల వెడల్పు గల ఎం ఆర్ ఐ మెషీన్ కారణంగా ఇరుకు భావన క్లాస్ట్రో ఫోబియా లేని విధంగా రోగులకు సౌకర్యవంతంగా ఉంటుందని, (స్కాన్ శబ్దం) ధ్వని శబ్దం తక్కువగా ఉండడం వల్ల రోగికి సౌకర్యంగా ఉంటుంది అని వెల్లడించారు.