“పోగొట్టుకున్న హక్కులు పోరాడకుండా రావు” అని బానిసలకంటే హీనంగా బతుకుతున్న బహుజనుల బతుకులకు భరోసా ఇచ్చి, అన్యాయాన్ని ఎదిరించేలా,అక్రమాలకు ఎదురుతిరిగేలా, ఆత్మగౌరవంతో జీవించేలా, మనుషులుగా బతికేలా బతుకనేర్పిన, ఆధునిక బహుజన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు.
నాడు చాతుర్వర్ణవ్యవస్థలో బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్య కులాలకు అక్షరాన్ని,ఆయుధాన్ని,ఆహారాన్ని అందించి, శూద్ర కులాలకు ఆత్మగౌరవం కూడా లేని బానిసలుగా మార్చారు. ఇక అతిశూద్ర (అదే అంటరాని)కులాల వారిని అయితే కనీసం మనుషులుగా కూడా చూసే పరిస్థితి లేదు. శూద్ర,అతి శూద్రుల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. ఇంకా స్త్రీల పరిస్థితి అయితే మరీ దారుణం.
ఈ పరిస్థితుల్లో మహారాష్ట్రలోని పూణేలో ఒక “పూలు-కూరగాయలు”అమ్ముకునే శూద్ర కుటుంబంలో జ్యోతిరావు పూలే జన్మిస్తాడు. నాటి శూద్రకులాలకు విద్య నిరకరించబడిన సందర్భంలో ‘తాము బానిసలమని, మనుషులం అయినప్పటికీ జంతువులకంటే హీనంగా చూడబడ్తున్నామని, అజ్ఞానులం’ అన్న విషయం కూడా తెలియని పరిస్థితి. తన బ్రాహ్మణ స్నేహితుని పెళ్లి సందర్భంగా తనకు ఎదురైన అవమానం యావత్ జాతికి ఎదురైనట్టు గ్రహించి, సామాజిక అసమానతలకు అజ్ఞానమే కారణమని గ్రహించి, దీనికి చదువొక్కటే పరిష్కారం చూపగలదని “జ్ఞాన యుద్దానికి” సిద్ధపడతాడు. నాటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా 9 సంవత్సరాల సావిత్రి తో బాల్య వివాహం జరిగినా, తను ఆడి, పాడే వయసులో సమాజాన్ని చదివి, ఆధునిక భారత దేశానికి మొట్టమొదటి చదువుల తల్లిగా, సావిత్రి బాయిని అందించిన ఆదర్శప్రాయుడు పూలే. సావిత్రికి చదువు నేర్పి,ఆమె ద్వారా అంటరాని స్త్రీలకు, మహిళలకు విద్యానందించడానికి సుమారుగా 16 పాఠశాలలు ఏర్పాటు చేస్తారు. నాటి బ్రాహ్మణ వర్గాలు శూద్ర,అతి శూద్ర కులాలను ఎన్ని రకాలుగా దోచుకుంటున్నారో, ఎలా కట్టు బానిసలుగా మార్చారో వివరిస్తారు. అక్షరం ఆలోచింపజేస్తుంది, విద్య ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. అందుకే వారిని భయంతో కాకుండా ధైర్యంగా బతికే వారిగా తయారు చేస్తాడు. శ్రమజీవులుగా ఉన్న స్త్రీల హక్కులకోసం పూలె దంపతులు ఎన్నో రకాల ఉద్యమాలు చేశారు. అందులో భాగంగానే రామభాయి, తారాభాయి లాంటి స్త్రీ వాద ఉద్యమాలకు అండగా నిలిచారు. బ్రాహ్మణ ప్రమేయం లేకుండా “సత్య శోదక్ సమాజ్” ద్వారా ఎన్నో పెళ్లిళ్లు చేసి, అణగారిన వర్గాల్లో ఆత్మస్థైర్యం నింపారు. శ్రామిక వర్గాల చైతన్యం కోసం ఎన్నోరకాల రచనలు,కావ్యాలు వెలువరించారు.1873లో “గులాం గిరి”అనే గ్రంథం ద్వారా సమాజంపై బ్రాహ్మణ ఆధిపత్యాన్ని, మోసాన్ని ప్రపంచానికి తెలియజేసారు. 63 సంవత్సరాల తన జీవితకాలంలో సుమారు 40 సంవత్సరాలకు పైగా అంటరానికులాల అభ్యున్నతికి, స్త్రీల హక్కులకోసం,మెరుగైన శ్రామిక జీవన పరిస్థితుల కోసం శ్రమించాడు. శూద్ర కులాలకు ప్రధాన జీవనాధారమైన వ్యవసాయంపై, వ్యవసాయ కూలీలపై ఒక స్పష్టమైన ఆలోచనను కలిగి,”కల్టీవేటర్స్ విప్ కార్డ్”లో ప్రభుత్వానికి, వ్యవసాయాన్ని ప్రజాధార పరిశ్రమ గా గుర్తించాలని, ప్రభుత్వమే చెరువులు, కాలువలు తవ్వించాలని, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వ్యవసాయ భూమిని ప్రజల సౌకర్యార్థం పంచాలని” కోరారు.
నాటి అగ్రకుల ప్రయోజనార్థం జరిగిన ఉద్యమాలను, ప్రజా ఉద్యమలుగా భావించలేదు. ఉద్యమాలు ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయాల పరంగా ఉపయోగపడలన్నాడు. తమ నాయకునిగా పులేను భావించి 1888 మే11 న ఒక పెద్ద సభలో ప్రజలే స్వచ్చందంగా “మహాత్మా” అనే బిరుదును ప్రకటించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు.
పూలే దేశంలోని మెజారిటీ ప్రజలకు చదువుకునే హక్కు, ఆత్మగౌరవంతో జీవించే హక్కు కావాలని ఆకాంక్షించారు. మానవతా వాదాన్ని పెంపొందించారు. సమధర్మం, సమన్యాయం కావాలనుకున్నారు.
పులే దంపతులు సమాజాభివృద్ధికై తమ జీవితాంతం త్యాగం చేసి, ఎన్నో హక్కులు సాధించి 1890 నవంబర్ 28 న పుణేలో పరమపదించారు.
కానీ వారి పోరాటాల ఫలితంగా విద్యావంతమైన బహుజన సమాజం వారి ఆశయాలను కొనసాగిస్తుందా.? తమ సమాజాన్ని చైతన్యం చేస్తుందా?.కులం, మతం, సంస్కృతి, సాంప్రదాయాల పేరు మీద దళిత,బహుజన సమాజంపై జరుగుతున్న దమనకాండను ప్రశ్నించే స్థాయికి ఎదిగిందా?.
“రాజ్యాధికారమే అన్ని సామాజిక సమస్యలకు పరిష్కారం”అని డా”బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు, రాజ్యాధికార దిశగా బహుజన సమాజం ఆలోచించడం లేదు. రాజ్యాధికార స్పృహ మనకంటే, ఆధిపత్య కులాలకు ఉంది. అందుకే దళిత,బహుజనులను రాజకీయంగా ఎదగకుండా పాలక పార్టీలు ఎన్నో రకాల ప్రలోభాలకు గురిచేస్తూ, ఎన్నో రాయితీలు ప్రకటిస్తూ, ఒక రహస్య చక్రబందంలో ఇరికిస్తున్నాయి.
చదువుకున్న సమాజమే జ్ఞానవంతంగా తయారౌతుంది. సామాజిక అభ్యున్నతికై ఆలోచిస్తుంది. అన్యాయాన్ని ఎదిరిస్తుంది, అక్రమాల్ని ప్రశ్నిస్తుంది. అందుకే పాలకులు సమాజాన్ని చైతన్యవంతం కాకుండా జాగ్రత్త వహిస్తూ, తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉంటున్నాయి.
కాబట్టి ఇప్పటికైనా చదువుకున్న విద్యావంతులు, ఉద్యోగులు, మేధావులు, కవులు, కళాకారులు బహుజన సమాజాన్ని చైతన్యం చేస్తూ, రాజ్యాధికార దిశలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది.