అధికారులంతా రింగైతే ఇలా వుంటుందా?
అగ్గువ లైట్లు కొని పిరం ధరలు రాసి?
ఇటు లెక్కల్లో తేడాలు…అటు కమీషన్లలో వాటాలు?
కింది స్ధాయినుంచి పై దాకా అధికారుల సరికొత్త లీలలు?
జనం కళ్లు గప్పి నాసిరకం పనులు?
ప్రజల సొమ్ము అప్పనంగా కమీషన్లు?
నాలుగు నెలలు గడవకముందే పనులు కనుమరుగు?
బైట పడుతుందనే సరికి పరారయ్యేందుకు ప్రయత్నాలు?
అమెరికాకు వెళ్లేందుకు వీసాకోసం వెయింటింగ్?
ఎలాగూ రిటైర్మెంట్ వుంది…లాంగ్ లీవ్ పెడితే సరి?
కాగల కార్యం అధికారులు దగ్గరుండి చూసుకుంటున్నారు?
ఊరు కాదు, దేశమే దాటిపోతే జనం సొమ్ముకు లెక్కేది?
వసూలు చేసే దిక్కేది?
జిల్లా నేతలు ఏం చేస్తున్నారు? పై అధికారులు పర్యవేక్షణ మర్చిపోయారు?
రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం సహజం. అందుకు అవసరమైన ప్రజాభివృద్ధి, సమాజాభివృద్ధి, ప్రగతి వంటి అనేక అంశాలపై ఎప్పటికప్పుడు దృష్టిపెడుతుంటారు. నాయకుల ఆలోచనలు, నిర్ణయాలు, అధికారుల ప్రతిపాదనలు, కార్యకలాపాలు తోడు కావాలి. ఫలాన గ్రామంలో ప్రజలనుంచి అభివృద్ధి విషయంలో డిమాండ్ నాయకులకు వస్తుంది. దానిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పనుల శ్రీకారం చుట్టాల్సివుంటుంది.
ప్రజాప్రతినిధులు అధికారులకు ఆదేశాలు జారీ చేసేవారు. కాని కాలం మారిపోతోంది. ప్రజా ప్రతినిధులు ప్రతిపాదనలు పంపడం అన్నది తగ్గిపోతోంది. పైగా అధికారులను ఆదేశించడం క్రమంగా తగ్గిపోతోంది. ఫలాన పనులు కావాలంటూ వేడుకోవాల్సినంత అసవరం కూడా ఏర్పడుతోంది. అధికారిక కేంద్రీకృత విధానం అమలౌతోంది. అది ఒకదగ్గర నుంచి ఇతర ప్రాంతాలకు కూడా క్రమంగా పాకుతోంది. నాయకుల్లో వున్న విభేదాలు అధికారులకు వరంగా మారుతున్నాయి. దాంతో అధికారులు తమ ఇష్టారాజ్యం పనుల నిర్వహణ చేపడుతున్నారు. ప్రజా ప్రతినిధుల ప్రమేయం పెద్దగా లేకుండా చేస్తున్నారు. గతంలో ప్రజా ప్రతినిధులు చేసే పనుల్లో అధికారులు కొంత కమీషన్ రూపంలో తీసుకునేవారు. కాని ఇప్పుడు అధికారులే స్వయంగా బినామీల పేరుతో పనులు నిర్వహిస్తున్నారు. కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. ప్రజా ప్రతినిధులకు కమీషన్లు ఇచ్చే స్ధాయికి ఎదిగారు. మహదేవ్ మండలంలో ఇదే జరుగుతోంది. మహాదేవ్ పూర్ మండలంలో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, ప్రజా ప్రతినిధులు ఎవరికీ చెప్పుకోలేక మధనపడుతున్నారు. నాయకుల్లో లేని ఐక్యత అధికారులకు కాసుల పంట పండిస్తోంది. అధికారుల అక్రమాలకు వేధికైతోంది.
గతంలో కాంట్రాక్టర్లు రింగయ్యారు. ప్రజా ధనం దోచుకుంటున్నారు…కమీషన్లు పంచుకుంటూ, పనులు జేజిక్కించుకుంటున్నారు. నాసిరకం పనులు చేస్తున్నారంటూ వార్తలు వచ్చేవి. ఆ కాలం పోయింది. అధికారులు రింగయ్యే కాలమొచ్చింది. కింది నుంచి పై స్ధాయి దాకా అధికారులంతా ఏకతాటిపైకి వచ్చి, పనుల నిర్వహనకు పూనుకుంటున్నారు. అవసరం వున్న లేకున్నా దోచుకోవడానికి వీలైనన్ని పనులు చేపడుతున్నారు. అవసరమైన చోట వాటిని వదిలేస్తున్నారు. నాసిరకం పనులు చేస్తున్నారు. జనం నానా తిప్పలు పడుతున్న పనులు గాలికి వదిలేస్తున్నారు. అధికారులే బినామీ కాంట్రాక్టర్ల అవతరం ఎత్తుతున్నారు. అందులో కూడ సక్సెస్ అవుతున్నారు. నాయకులను, కాంట్రాక్టులను డమ్మీలను చేసేశారు. పెత్తనం, పనులు, రసుములు అన్నీ అధికారులే పంచుకుంటున్నారు. నాయకులకు బిస్కెట్లు వేసే దాకా వస్తున్నారు. కాంట్రాక్టర్లకు పనులు లేకుండా చేస్తున్నారు. దాంతో వారు కార్యాలయాల వైపు రాకుండా పోతున్నారు. పనుల కోసం ఎవరికి పిర్యాధు చేయాలో తెలియక నానా అవస్ధలు పడుతున్నారు. పైగా చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో పనులంటేనే బెంబేలెత్తిపోతున్నారు. అలా అధికారులు వారిని తయారు చేస్తున్నారు. పనుల వివరాలు కూడా ఎక్కడ వెళ్లడిరచకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. టెండర్లకు స్వస్తి చెప్పి, బిట్లు బిట్లుగా పనులు విడదీసి కానిచేస్తున్నారు. జేబులను కాసులతో నింపేసుకుంటున్నారు. గతంలో రోడ్ల సంగతి చూశాం. మండలంలోని అన్ని గ్రామాల్లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కోసం చేసిన ఖర్చులు చూద్దాం… వెచ్చించాల్సిన దానికన్నా రెండు రెట్లు చెల్లింపులు చేసి, కమీషన్లు పంచుకుంటున్నారు. మొత్తం మండలంలో 300కు పైగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ఒక్క మహాదేవ్పూర్లోనే 90కి పైగా సెంట్రల్ లైట్లు ఏర్పాటు చేశారు. ఒక్కొ సెంట్రల్ లైట్కు సుమారు 60వేలు ఖర్చవుతుందని అంచనా. కాని దాన్ని రూ.1.30లక్షల దాకా పెంచి బిల్లులు చెల్లింపులు చేసినట్లు సమాచారం. ఇలా ప్రజా ధనం దుర్వినియోగం చేస్తువస్తున్నారు. అందులో మండల పరిషత్ అభివృద్ధి అధికారితోపాటు, పంచాయితీ రాజ్ శాఖ ఏఈ, డిఈ, ఈఈలు ఒక పధకం ప్రకారం పనుల నిర్వహణ కానిచేస్తున్నారు. అయితే ఎంపిపికి కొద్దో గొప్పే అందించేది కొంత అందిస్తున్నారట. దాంతో ఆయన జరుగుతున్న అవకతవకలపై మౌనంగా వుంటున్నారట. ఈ మధ్య కాలంలో జడ్పీటీసిలు, ఎంపిటిసిలు ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోయారు. వారికి మండల పరిధిలో ఏం జరుగుతున్నాయన్నదానిపై కూడా సమాచారం లేదు. వారికి అవగాహన కూడా లేదు. దాంతో వాళ్లు కూడా ఆ పదవి చెప్పుకోవడానికి తప్ప, ఏం పనులు చేయడానికి లేకుండాపోయింది.
ఇప్పటి దాకా బాగా సంపాదించిన నాయకులు ఓడిపోయి, లేదా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారు రాజకీయాలు వదిలేసి విదేశాలలో సెటిల్ అయిన వారిని చూశాం. ఇప్పటి దాకా బ్యాంకులు ఎగ్గొట్టిన వాళ్లే దేశాన్ని వదిలేసి వెళ్తున్నారన్న వార్తలు విన్నాం. ఇక తాజాగా అధికారులు కూడా అదే బాటను పడుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంది వచ్చిన అవకాశాలను పుల్గా వాడుకొని, సంపాదించుకోవాల్సిందంతా సంపాదించుకొని, ఆరోపణలు వచ్చే సమయానికి విదేశాలు చెక్కెసేదాకా వచ్చారన్న మాట వింటే ఆశ్చర్యమేయక మానదు. మహాదేవ్పూర్ మండలంతోనే దానికి కూడా శ్రీకారం జరగుతోంది. పైన ఉటంకించిన పనులన్నీంటికీ కర్త, కర్మ, క్రియగా భావిస్తున్న, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఈ. లాంగ్ లీవ్ పెట్టినట్లు సమాచారం. విదేశాలకు ప్రయాణమౌతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ అధికారి గతంలోనే రిటైర్డు కావాల్సివుండే. ప్రభుత్వం పెంచిన వయోపరమితి మూలంగా మరింత కాలం ఉద్యోగ నిర్వహణకు అవకాశం ఏర్పడిరది. దాంతో ఇక ఈ సమయంలో దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక మీద వచ్చే ఆదాయాలపై ఎంపిడివోతో కలిసి, ఏఈ, డీఈ, ఈఈల ఆశీర్వాదంతో ఖర్చుకు అవసరమైన పనులన్నీ చేసేసినట్లు జనం చెప్పుకుంటున్నారు. చేయాల్సినన్ని నాసిరకం పనులు చేసి, వేసుకోవాల్సినంత సొమ్ము జేబులో వేసుకున్నారంటున్నారు. ఇక ఇటీవల అటు మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. బిల్లుల చెల్లింపులలో ఇబ్బందులు ఎదుర్కొన్న కాంట్రాక్టర్లు రోడ్డెక్కుతున్నారు. ఏఈ అచాకాలను ప్రశ్నిస్తున్నారు. ఇక టిఆర్ఎస్ నాయకులు కూడా కదులుతున్నారు. అదే జరిగితే అవినీతి డొంకంతా బైటపడుతుంది. అది గమనించి ఎలాగూ రిటైర్ మెంటు త్వరలో వుంది. ఈ లోపు లాంగ్ లీవ్ పెట్టేసి, అమెరికా చెక్కెస్తే కాగల కార్యం గంధర్వులే తీర్చుతారని అనుకుంటున్నాడట. అందుకు లీవ్ మంజూరు చేయాల్సిన ఈఈ కూడా సహకరించడం కూడా జరగుతోందనేది సమాచారం. ఇలా అందిన కాడికి దోచుకొని, ప్రజా ధనం దుర్వినియోగం చేసి, దేశదిగంతాలు దాటిపోతే, రిటైర్ అయ్యాక వస్తే అడిగేందుకు ఏమీ వుండదు? వసూలు చేసేందుకు వీలు పడదు? అది తెలుసుకొని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి తోడు అతని స్ధానంలో ఇన్చార్జి ఏఈకి కూడా బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు సాగుతున్నాయట. అదే జరిగితే ఇన్చార్జిని అడిగితే నాకేం తెలుసంటాడు? వెళ్లిపోయిన అధికారి ఒక్కసారి బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకుంటాడు. అందుకే ప్రజా ప్రతినిధులు. లక్షలకు లక్షలు అప్పులు చేసి, బిల్లులు రాక అవస్ధలు పడుతున్న కాంట్రాక్టర్లు దీనిపై స్పందిస్తే తప్ప ఏఈ తిన్నది కక్కించడం కుదరదు. ఆయన లీవ్ను ఆపకుండా వుంటే, ఎప్పటికీ నిధులు వెనక్కి తేలేరు. టిఆర్ఎస్ పెద్దలు, ప్రజాప్రతినిధులు కదిలితే తప్ప, ఈ దుర్మార్గం ఆగదు. చేతులు దులుపుకొని వెళ్లాలనుకుంటున్న ఏఈ ఆడిపోడు…? ఇక నాయకులు ఏలా స్పందిస్తారో చూద్దాం…బాధితులు ఎవరు ముందుకొస్తారో వేచి చూద్దాం…!! జిల్లా స్ధాయి అధికారులు, కలెక్టర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తి కరంగా మారింది.