కారుకెదురే లేదు

ప్రతిపక్షాలకు అంత సీన్‌ లేదు?

`బిజెపి కొంగజపాలను తెలంగాణలో నమ్మే దిక్కు లేదు?

`బిజెపి ప్రచారానికి ప్రజల మద్దతు లేదు?

`కాంగ్రెస్‌ లో సఖ్యతకు చోటే లేదు?

`పోటికి ప్రతిపక్షాలకు నాయకులే లేరు?

`జల్లడ పట్టినా పోటీకి ముందుకొచ్చే వారు లేదు?

`జనంలో టిఆర్‌ఎస్‌ కు బలం తగ్గలేదు?

`మరో పార్టీపై ప్రజలకు ఆలోచన కూడా లేదు?

`కకావికలమైన ప్రతిపక్షాలు కూడదీసుకునేందుకు శక్తి లేదు?

`మరో దశాబ్దం కారు జోరుకు ఎదురేలేదు?

`పరాయి మీడియా నోరుకు తెలంగాణలో విలువలేదు?

 రేకుల డబ్బాలో రాళ్లు వేసి చప్పుడు చేస్తే వచ్చేది అనునాదం కాదు, సింహనాదం అంతకన్నా కాదు. శంఖారావం అసలే కాదు. డబ్బా మూత తీస్తే కనిపించేవి రాళ్లే కాని బంగారం కాదు..! అలాగే బిజేపి జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినంత మాత్రాన ఓట్లు రాలవు. బిజేపి నాయకులందరూ ఎక్కడెక్కడినుంచో వస్తున్నారని, వచ్చి వరాలు ప్రకటిస్తారని ఎవరూ అనుకోవడం లేదు. నిన్నటి దాకా పార్టీ కార్యాలయానికే దిక్కులేని దగ్గర, ఇంత పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు ఏర్పాటు చేసినంత మాత్రాన ఊపొస్తుందని ఊహల్లో తేలిపోతే సరిపోదు. గతంలో జరిగిన సమావేశాలకు, ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగే సమావేశాలకు తేడా గమనించారా? కాకినాడలో ఎంత సింపుల్‌గా సమావేశాలు జరిగాయో, ఇప్పుడు ఎందుకంత ఆర్భాటం ప్రదర్శిస్తున్నారో అర్ధమౌతుందా? బిజేపి జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరిగితే దేశమంతా తెలంగాణ వైపు చూస్తే సరిపోదు. ఆ సమావేశాలతో అభివృద్ధి జరగదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వాల్సిన నిధులిస్తే అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్‌కు వచ్చి ఏం చెబుతారు?పార్టీ అధికారంలోకి రావాలని అంటారు? కాని అధికారంలోకి రావడానికి ఏం చేస్తారని, ఆ లోపు ఏమిస్తారన్నదేమైనా చెబుతారా? లేక నాలుగు మాటలు చెప్పి, జారుకుంటారా? అన్నది జనంలో నలుగుతున్న మాట. గతంలో అభివృద్ధి పనులకు హజరైనప్పుడే ఏం ఇచ్చింది లేదు. కనీసం ఇస్తామని చెప్పింది లేదు. మిషన్‌భగీరధ లాంటి కార్యక్రమానికి నీతి అయోగ్‌ తెలంగాణక నిధులివ్వాలని సూచించిన వాటికే దిక్కులేదు. రాజకీయ సమావేశాలు పెట్టి రాజకీయం చేయడం తప్ప, ప్రగతి కోసం ప్రయత్నాలు చేస్తారనో, ఇక్కడినుంచే నాలుగు ప్రాజెక్టులు ప్రకటిస్తారని మాత్రం ఎవరూ ఊహించడం లేదు. ప్రధానితో రాష్ట్రాభివృద్ధి కోసం ప్రకటనలు చేయిస్తామని రాష్ట్ర నాయకులు చెబుతున్నది లేదు. ప్రధాని మోడీని నిలదీసేంత శక్తి ఎవరికీ లేదు.

                         రాజకీయమంటే నాయకులు చేసే ప్రచారం కాదు.

 ఒక నమ్మకం. ఒక విశ్వాసం. నాయకుడి వ్యక్తిత్వం. కాకపోతే రాను రాను అర్ధం మారిపోతోంది. అధికారం అన్నదే ప్రతి నాయకుడికి కళ్లకు కనిపిప్తోంది. రాజకీయం అంటే ఒక యజ్ఞం. ఒక వేదం. ప్రజాసేవకు అంకితం. ప్రజలు ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు. దేశానికి పాలించే అవకాశం బిజేపికి ఇచ్చారు. కాని బిజేపి ఏంచేస్తోంది? పన్నులతో నడ్డి విరుస్తోంది? ధరలు ఆకాశానికి అంటేలా చేస్తోంది? నూనెలు కొనుక్కొలేం? పప్పులు ఉడికించుకొని తినలేం? పెట్రోలు కొనుక్కొలేం? ప్రయాణాలు చేయలేం? ఎక్కడ విన్నా ఇదే మాట? మేం అధికారంలోకి వచ్చి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పగలిగే శక్తి ఏ ఒక్క బిజేపి నాయకుడికైనా వుందా? కనీసం ఎన్నికల మందు హమీ ఇచ్చినట్లు విదేశాల్లో నల్లదనం తేలేకపోయామని చెప్పుకునే దుమ్ము వుందా? ఉపాధి కల్పనకు తూట్లు పొడిచారు. జిఎస్టీ పేరుతో జరిగిన అంధకారం కళ్లముందు కనిపిస్తున్నా, జరిగింది పొరపాటు అన్నది చెప్పగలరా? తెలంగాణ ప్రజలకు ఏం చెబుతారు? తెలంగాణకు విభజన సమయంలో ఇస్తామని చెప్పిన వాటిని ఇవ్వనందుకు క్షమాపణలు చెప్పగలరా? లేక ఇంకా ఏడాది గడువుంది. ఈ లోపు రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తామని చెప్పగలరా? గతంలో ఎన్నికల ముందు ఇలాగే బిహార్‌ వెళ్లిన ప్రధాని మోడీ రూ.80 వేల కోట్లు ప్రకటించారు. కర్ణాటక రాష్ట్రానికి ఇతోదిక సాయం చేస్తున్నారు. వేల కోట్ల నిధులు ఇస్తున్నారు. ఇక గుజరాత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి తెలంగాణకు? అన్న ప్రశ్న బిజేపిలోని ఏ ఒక్క నాయకుడైనా ఆలోచించారా? పార్టీ పెద్దల దృష్టికి తెచ్చారా? నలుగురు ఎంపిలున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి తెచ్చారా? ఇలాంటి సమయంలోనైనా ప్రకటింపజేయగలరా? ఇది పార్టీ పరమైన కార్యక్రమాలంటూ దాట వేస్తారా? తప్పించుకోవడానికి ఇదొక సాకుగా ఉపయోగించుకుంటారా? కనీసం ఎన్నికల ముందు ఇచ్చిన పసుపు బోర్డుకైనా మోక్షం వస్తుందని చెప్పగలరా? దామాషా ప్రకారం వచ్చే నిధులు కేంద్ర ఆర్ధిక సంఘం పంచే వాటాల గురించి చెప్పుకొని పబ్బం గడుపుకుందామనుకుంటే ప్రజలు క్షమించరు. 

                          అసలు ప్రతిపక్షాల పరిస్థితి ఏమిటన్నది పార్టీలకు పూర్తిగా తెలుసు. 

ప్రజల్లో వారికి వున్న విలువేమిటో తెలుసు. కాని రాజకీయమన్నాక తమకు శక్తి లేదని చెప్పుకుంటే నాయకులు కాలేరు. గెలవలేరు. పార్టీలను గెలిపించుకోలేదు. కనీసం నమ్మకంతో ఓట్లేసే ప్రజలు కూడ ఆ మాత్రం ఆదరించలేరు. అందుకే మేమున్నాం…మాకు ప్రజల్లో బలముందని చెప్పుకోకపోతే వారికి మనుగడ వుండదు. ప్రజా జీవితంలో వుండేందుకు అవకాశమే వుండదు. రాజకీయాలకు పనికిరాదు. బడతున్నోదిదే బర్రే…నోరున్నోడిదే ఊరు అనేవారు…ఇప్పుడు సరిగ్గా రాజకీయాల్లో అదే నడుస్తోంది. నేరేసుకొని ఊరేగని నాయకుడికి మనుగడ లేదు. వారికి విలువ లేదు. అందుకే అందరూ రాజకీయాల్లో నెగ్గుకు రాలేకపోతున్నారు. అలా ప్రతిపక్షంలో నోరున్న నాయకుడిగా ఎలాగో అలాగా గుర్తింపు పొందిన రేవంత్‌ రెడ్డి మాటలు కోటలు దాటడం తప్ప, చేతులు తంగెళ్లు దాటని పరిస్ధితి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాకపోతే మంత్రాల బలం లేకపోయినా, తుప్పిళ్ల బలమైనా చూపించుకోవాలన్న తాపత్రయం రేవంత్‌లో బాగానే వుంది. కాకపోతే పార్టీలోనే ఆయన వ్యవహారశైలి ఎవరికీ నచ్చడంలేదు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్‌రెడ్డి పార్టీలో ఎవరికీ నచ్చడంలేదు. తన ఇష్టా రాజ్యం చేస్తున్నారు. తనకు ఇష్టమైన వారికి ప్రాధాన్యతనిస్తున్నారు. కారణం ఆయనకే కాదు, అదంరికీ తెలుసు. పార్టీ గెలిచేది లేదు…అధికారంలోకి వచ్చేది లేదు. కాకపోతే పిపిసి పదవిలో వున్నంత కాలం తనదైన శైలిలో రాజకీయం నెరపాలి. తను అనుకున్న రాజకీయమే చేయాలి. ఎప్పటిలాగా అందరూ చెప్పిన రాజకీయం చేసినా, తన సొంత రాజకీయం నెరిపినా పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్ధితి ఎలాగూ లేదు. ఇంకెందుకు సీనియర్లను పట్టించుకోవాలి. ఎందుకు వారి వెంట తిరిగాలి. తనకు పిపిసి పదవి ఇచ్చింది సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు కాదు. అడుగడుగునా తనకు పదవి రావడాన్ని అడ్డుకున్నారే గాని, ఏనాడు తన గురించి పాజిటివ్‌గా మాట్లాడిన వారు లేరు. మరి అలాంటి వారి కోసం రాజకీయం నెరపడం, వారికి చెప్పి కార్యక్రమాలు చేయడం రేవంత్‌కు ఇష్టం లేదు. సీనియర్లను పక్కన పెట్టుకొని వారికి లేని గౌరవం ఆపాదించడం కూడా రేవంత్‌కు సుతారం నచ్చడం లేదు. పైగా కనిసినున్నంత సేపు ఇష్టం లేని నవ్వులు నవ్వుకొని, అతి కష్టంగా పొగుడుకొని, పక్కకు జరగ్గానే ఎవరికి వారి రాజకీయం చేయడం కాంగ్రెస్‌లో కాకతాలియం కాదు. ఎప్పుడూ జరిగేదే. కావాలని జరిగేదే…ఎల్లకాలం జరిగేదే…అలాంటప్పుడు సీనియర్లకు తాను విలువ ఇవ్వాల్సిన పని లేదు. సీనియర్లకు రేవంత్‌కు గౌరవం ఇవ్వడం అవసరం లేదు. ఎవరికి వారే యమునా తీరే…అంతే మొత్తం మీద పార్టీది గోదారే..?

                  బిజేపి రాజకీయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

అదిగో పులి అంటే, ఇదిగో తోక అనుకునేవారు ఎక్కువయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోకుండా చతికిలబడ్డా, పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్ధానాలు రావడంతో మొదలైంది. మిడిసిపాటు రాజకీయం మొదలు పెట్టారు. కాలం అనుకూలించినట్లుగా తామరాకు మీద పడ్డ నీటి తెంపర అటూ అటూ పరుగులు పెట్టినట్లు ఆగడం లేదు. నాలుగు సీట్లకే ఇంత హడావుడి చేస్తే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్‌కు ఎంత దూకుడుండాలి. ఎంత రాజకీయం చేయాలి. ఉప ఎన్నికలు కలిసి వచ్చినంత మాత్రాన ఇక అంతా మేమే…వచ్చేది మేమే… ఇక రాజ్యాధికారం మాదే అనుకుంటూ పగటి కలలు కనడం మొదలుపెట్టారు. హడావుడి చేస్తున్నారు. కాకపోతే అధికారంలోకి వస్తున్నట్లు గ్రూపులు కూడా తయారు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం మాదే అనుకుంటున్నారు. రాష్ట్రానికి ఏం తెచ్చేందుకు ప్రయత్నం చేద్దామని ఏ ఒక్క రోజైనా బిజేపి పార్టీ రాష్ట్ర నాయకత్వం కూర్చుని మాట్లాడినట్లు ఏ ఒక్క రోజైనా కనిపించిందా? అందుకు సంబంధించిన ఒక్క వార్తయినా వచ్చిందా? కాని నాదో గ్రూపు, నీదో గ్రూపు. అధ్యక్షుడు బండి సంజయ్‌ మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేల అలక. గ్రూపులున్న మాట వాస్తవమే అని ఒప్పుకోలు మాట. ఎవరికి వారే, యమునా తీరే….అప్పుడు ఎన్నికలు జరిగినట్లు, గెలిచినట్లు,తాము ముఖ్యమంత్రి అయిపోయినట్లు కలలు గంటున్న గ్రూపులు కూడా బిజేపిలో మూడు నాలుగున్నాయంటే ఆశ్చర్యం అక్కర్లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!