మాట ఇవ్వడం తప్పడం బిజేపి అలవాటే!?
1998లో కాకినాడ తీర్మానం కాకెత్తుకుపోయింది?త
1999 అధికారంలోకి వచ్చారు తెలంగాణ ఎందుకన్నారు?
2000 లో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేశారు? తెలంగాణ ఇవ్వలేదు?
హైదరాబాద్ వుండగా తెలంగాణ ఎందుకన్నారు?
2009 అధికారంలోకి వస్తే 100 రోజుల్లో తెలంగాణ అన్నారు… జనం నమ్మలేదు?
2014లో తెలంగాణ కాంగ్రెస్ ఇస్తే తల్లిని చంపి,బిడ్డను బతికించారన్నారు?
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడు మండలాలు ఆంధ్రాలో కలిపారు…
కొంపలు మునిగిపోయినట్లు తొలి మంత్రి వర్గ సమావేశంలోనే తెలంగాణకు అన్యాయం చేశారు…
బియ్యం కొనమంటే నూకలు తినమంటున్నారు?
తెలంగాణలో వచ్చేది అధికారంలోకి మేమే అంటున్నారు?
బలం లేదు…బలగం లేదు…నమ్మేవారు లేరు?
ఓట్లు, సీట్ల రాజకీయం తెలంగాణలో చెల్లదు?
మాటంటే కట్టుబడి వుండాలి. ఒక మాట ఇస్తే నెరవేర్చాలి. అందుకు కనీసం కృషి చేసేట్టుగానైనా వుండాలి. కాని మాట ఇవ్వడం అలవాటు చేసుకొని, మర్చిపోవడం ఆనవాయితీ చేసుకుంటే జనం ఎప్పుడూ నమ్మరు. తెలంగాణ విషయంలో బిజేపి చేసింది అక్షరాలా ఇదే…1998లో బిజేపి జాతీయ మహాసభలు కాకినాడలో జరిగాయి. ఒక ఓటు రెండు రాష్ట్రాలన్నారు. 1999లో ఎన్డీయే పేరు మీద బిజేపి అధికారంలోకి వచ్చింది. 2000 సంవత్సరంలో చత్తీస్ఘడ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ఏర్పాటు చేశారు. కాని తెలంగాణ మర్చిపోయారు. కాదు దాటవేశారు. ఇచ్చిన మాట దాచిపెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణను అటకెక్కించారు. చంద్రబాబు నాయుడు మాట విని, తెలంగాణ ప్రజలకిచ్చిన మాట తూచ్ అన్నారు…తొండాట ఆడారు. 2004 ఎన్నికల ముందు దేశం వెలిగిపోతుందని అతి ప్రచారం చేసుకున్నారు. జనం ఆ పార్టీని మడిచి విసిరేశారు. ఆ ఎన్నికల్లో కూడా గెలిస్తే తప్పకుండా తెలంగాణ ఇస్తామన్నారు. తెలంగాణలో బిజేపి బలపడే పరిస్థితి కనిపించలేదు. తెలుగుదేశం పొత్తు లేక విలవిలలాడిపోయారు. ఇక తెలంగాణ ఇస్తామంటే తప్ప బిజేపి వైపు తెలంగాణ ప్రజలు చూసే పరిస్ధితి కనిపించడం లేదన్న ఆలోచన కొచ్చారు. బిజేపి పార్టీ నాయకుడిగా తెలంగాణ ఇస్తామన్న అద్వానీయే, ఉప ప్రధాని హోదాలో తూచ్ అన్నారు. మళ్లీ అదే అద్వానీ 2008 నవంబర్ 8న కేంద్రంలో అధికారంలోకి వస్తే 100 రోజుల్లో తెలంగాణ ఇస్తామని ఇస్తామన్న తెలంగాణ ఇవ్వలేదు. కాని ఎవరూ ఊహించని మూడు రాష్ట్రాలు ఇచ్చేశారు. ఇక్కడ లోతుగా కొన్ని విషయాలు చర్చించుకోవాలి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పటి రాజ్యాంగ కమిటి ధార్ కమీషన్ ఏర్పాటు చేసింది. దేశంలోని ప్రాంతాలన్నీ ఏకం చేసి, ఎలా రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని సూచనలు కోరింది. అందులోనూ బాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఎలా వుంటుందన్నదానిపై నివేదిక కోరింది. దాంతో ధార్ కమిటి బాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వల్ల ఆర్ధికపరమైన అంతరాలు ఏర్పడతాయన్నారు. అయినా నాడు మరోసారి రాజ్యాంగ కమిటి జేవిపి కమిటీ ఏర్పాటు చేసింది. అందులో జవహర్లాల్ నెహ్రూ, వల్లభ్బాయ్ పటేల్, బోగరాజు పట్టాభిరామయ్య సభ్యులు. అనేక చర్చల తర్వాత ఆ కమిటి బాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సరైందన్నారు. దాంతో 19953లో దేశ వ్యాప్తంగా వస్తున్న డిమాండ్ను బట్టి, మొదటి ఎస్సార్సీ వేశారు. ఫజల్ అలీ అధ్యక్షతన ఆ కమీషన్ దేశమంతా తిరిగింది. దేశంలో 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత పాంతాలు ఏర్పాటు చేయాలని సూచించింది. అందులో తెలంగాణ, విదర్భ రెండు రాష్ట్రాల ఏర్పాటు తప్పని సరి నివేధిక అందించింది. కాని నాడు ప్రధాని నెహ్రూ 14 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాటుతో పార్లమెంటులో బిల్లు పెట్టారు. తెలంగాణ గొంతు ఆనాడు కోశారు. అల్లరి పిల్లవాడు ఆంధ్రాకు అమాయకురాలైన తెలంగాణకు ముడి పెడుతున్నామని సన్నాయి నొక్కులు నొక్కారు. నాటి నుంచి రగులుతున్న తెలంగాణ ఉద్యమం అన్నది 2014 దాకా నిరంతరంగా సాగింది. 1952 ముల్కీ గో బ్యాక్ నుంచి మొదలు, 1969లో ఏడాడి పాటు సాగిన తెలంగాణ ఉద్యమం…తర్వాత 1996 నుంచి తెలంగాణ ఆవిర్భావం దాకా నిరంతరం కొనసాగింది. అంటే ప్రపంచ చరిత్రలో అరవై ఏళ్ల అస్ధిత్వ పోరాటం ఒక్క తెలంగాణలోనే సాగింది. అయితే మధ్యలో అధికారంలోకి వచ్చిన బిజేపికి మాత్రం ఇంత బలమైన తెలంగాణ ఆకాంక్ష కనిపించలేదు. కనీసం మొదటి ఎస్సార్సీలో వున్న రెకమెండేషన్న ఆధారం చేసుకొని తెలంగాణ 2000నాడే ఇచ్చినా పోయేది. కాని అధికారమే పరమాధి అనుకున్నారు. తెలంగాణకు ద్రోహం చేశారు.
ఇక కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్ధితిలోకి నెట్టేబయడుతున్న రోజులు. దాన్ని గమనించిన బిజేపి సీనియర్ నాయకుడు అద్వానీ ఈసారి అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామని మరోసారి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కాని జనం నమ్మలేదు. ప్రజలు ఒకసారి నమ్ముతారు..రెండుసార్లు నమ్ముతారు…పదే పదే చేసే మోసమని తెలిసి నమ్మరు. దేశంలోని 36 రాజకీయ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఉత్తరాలు ఇచ్చాయి. తెలుగుదేశం పార్టీ ఏ దారిలో నడిస్తే, ఆ దారిని ఎంచుకున్న బిజేపిని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ నమ్మరన్నది క్షేత్రస్ధాయి మాట.
గతంలో వాజ్పాయ్ ప్రధానిగా వున్న సమయంలో తెలంగాణ ఏర్పాటు చేస్తారా? లేక దేశంలో రాష్ట్రాల పునర్విభజన కోసం రెండో ఎస్సార్సీ వేస్తారా? అని సాక్ష్యాత్తు కాంగ్రెస్ పార్టీ కోరింది. ఆనాడు ఆ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ మెమోరాండమ్ కూడా సమర్పించింది. అయినా స్పందించలేదు. తెలంగాణను పక్కన పెట్టి మూడు రాష్ట్రాలు ఇచ్చారు. దాంతో 2000లో ఆప్పటి బిజేపి నాయకుడు టైగర్ నరేంద్ర బిజేపిని వీడారు. తెలంగాణ సాధన సమితి ఏర్పాటు చేశారు. నాడు తెలంగాణలో బలమైన నేత నరేంద్రను కూడా వదులుకున్నారు. ఇలా అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేశారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే తెలంగాణలోని ఏడు మండలాలు, 245 గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారు. ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రధాని మోడీ తన మంత్రి వర్గ తొలి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు మొదటి రోజే అన్యాయం చేశారు. తెలంగాణకు విభజన హమీల అమలను ఏనాడు గుర్తు చేసింది లేదు. ఎనమిదేళ్లుగా అధికారంలో వున్నారు. ఏం వెలగబెట్టారు. కాని మేమున్నాం…మేం అధికారంలోకి వస్తామని అంటారు…
ఆఖరకు తెలంగాణ ఇచ్చాక ఆంధ్రప్రదేశ్లో పొత్తులో బాగంగా సీట్ల కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్ధిత్వాన్ని దెబ్బతీశారు. ఆఖరుకు ఈ మధ్య పార్లమెంటులో కూడా మరోసారి తెలంగాణ ఏర్పాటుపై పార్టీ మనసులో గూడుకట్టుకున్న విషాన్ని వెల్లగక్కారు. ఆ పార్టీలో ఎవరో ఒకరు సభ్యుడు మాట్లాడి వుంటే , అది వారి వ్యక్తిగతమనుకునేవారు. కాని సాక్ష్యాత్తు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ఏర్పాటుపై వ్యాఖ్యలు చేయడాన్ని తెలంగాణ ప్రజలు తప్పుపట్టారు. పెద్దన్న స్ధానంలో కూర్చున్నవారు గాయాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం వల్ల సాధించేమిటన్నది కూడా ఓసారి ఆలోచించుకోవాలి. ఇక తాజాగా తెలంగాణ పండిన పంట విషయంలో బియ్యం సేకరణపై గత రెండేళ్లుగా కిరికిరి నడుస్తూనే వుంది. తెలంగాణలో వరి ధాన్యం బియ్యంగా మార్చే క్రమంలో రా రైస్ తక్కువగా వస్తుందని కేంద్రానికి ఎంత చెప్పినా వినకంత మొండితనం ఎందుకు? నూకలు ప్రజలను తినమనండి అన్నంత వ్యాఖ్యలతో విషం చిమ్మడం ఎందుకు? దేశమంతా ధరల మోత! యూపిఏ అధికారంలో వున్నప్పుడు పెట్రోల్ ధరపై ధర్నాలు… సిలిండర్ ధరపై గగ్గోలు…ఉల్లి రేట్లు పెరిగితే దండలు…మరి ఇప్పుడు సామాన్యుడి నడ్డి విరిచే ధరలు….మాయా మశ్చీంద్ర మాటలు….? అంతా జనం ఖర్మం…బిజేపి పుణ్యం…!!!