బతుకమ్మ తెలియని వాళ్లంతా తెలంగాణ బతుకులు మార్చేవాళ్లే!
మీ అయ్య గుర్తులేడున్నవో చూపియ్యి షర్మిలా?
పోతిరెడ్డిపాడు పొక్క మూసి నీళ్లాపి మాట్లాడు..
తెలంగాణకు రావాల్సిన విభజన హామీల మీద కొట్లాడు..
తెలంగాణ వరి నేరుగా ఎందుకు తీసుకోరో కేంద్రాన్ని అడుగు?
ఎవరెట్లా పోతే నాకేంది, నేను నడుసుంట పోతా…
రాజకీయం చేస్తా…అంటే ఎట్ల షర్మిలా!
తెలంగాణలో నాలుగేళ్లలో ప్రాజెక్టులు పూర్తి…
17 లక్షల ఎకరాల నుంచి 70 లక్షల ఎకరాల సాగుబడి…
తెలంగాణ కొట్లాడి తెచ్చి కల నిజం చేసింది కేసిఆర్…
చుక్క నీటి జాడ లేని చోట, పరవళ్లు తెచ్చింది కేసిఆర్..
ఎండల్లో చెరువులు మత్తళ్లు దుంకుతున్నది తెలంగాణలో…
బోరు చెయ్యకుండా వాల్టా తెచ్చింది వైఎస్…
తెలంగాణ ఎండబెట్టింది వైఎస్…
తెలంగాణ భూములమ్మి, ఆంధ్రాకు పంచింది వైఎస్…
జలయజ్ఞం పేరుతో తెలంగాణ నిధులు కొల్లగొట్డింది వైస్…
ఝంజాయతీ కట్టి, ప్రాణహిత-చేవెళ్ల పండవెట్డింది వైఎస్…
కాలువలు తవ్వి కాసులు నింపుకున్నది వైఎస్…
షర్మిల పాదయాత్ర యాభై రోజులు కాదు, మరో యాభై ఏళ్ల పాటు సాగినా లాభం లేదు…భవిష్యత్తు తెలంగాణ చరిత్రలో షర్మిలకు, వైఎస్ కుటుంబానికి చోటు లేదు…..తెలంగాణ గోస పుచ్చుకున్న వైఎస్ కు ఇక్కడ స్థానం లేదు…పాదయాత్రలు కాదు, ఆ పార్టీ పిడికెడు మంది కార్యకర్తలు తెలంగాణ మొత్తం పొర్లు దండాలు పెట్టినా షర్మిలకు ఓట్లు పడవు. తెలంగాణను ఎవరూ మోసం చేయలేరు…మన వాళ్లెవరో, పరాయి వాళ్లెవరో తెలంగాణ కు తెలుసు.. ఓట్ల కోసం వచ్చేదెవరో, ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారో తెలుసు… గెలిపిస్తే గతంలో నిండా ముంచిందెవరో తెలుసు…ఉచిత విద్యుత్ పేరుతో తెలంగాణను ఊడ్చేసిందెవరో ప్రజలకు తెలుసు…పాదయాత్ర చేసి తెలంగాణ భూములు చెరబట్టిందెవరో తెలుసు…మళ్లీ, మళ్ళీ మోసం చేసే అవకాశం కోసం అర్రులు చాచుతున్నదెవరో తెలుసు…
చెప్పుకునేంత గొప్ప చరిత్ర తెలంగాణలో వైఎస్ కు ఏమీ లేదు…వేధనలు మిగిల్చి, విలువలు మరిచి తెలంగాణ గోస పుచ్చుకున్నది వైఎస్…పైకి ముసి ముసి నవ్వులు, లోన కత్తులతో కుత్సితం నింపుకున్నది వైఎస్… తెలంగాణ కుత్తుక మీద కత్తి పెట్టింది వైఎస్… గొంతు నులుమింది వైఎస్…నమ్మించి మోసం చేసింది వైఎస్…వంచనకు మారు రూపు వైఎస్…తెలంగాణను నిర్వీర్యం చేసింది వైఎస్. తెలంగాణను దోచుకున్నది వైఎస్…తెలంగాణ భూముల చెరబట్టింది వైఎస్… తెలంగాణలో బయ్యారం బుట్టలో వేసుకోవాలని చూసింది వైఎస్… నమ్మిన వారిని నట్టెట ముంచింది వైఎస్…నమ్మి ఓట్లేసి గెలిపిస్తే తెలంగాణను ఎండబెట్టింది వైఎస్…తెలంగాణను బొందల గడ్డ చేసింది వైఎస్…తలా తోక లేకుండా, తెలంగాణను అడుగడుగునా అవహేళన అనేక సార్లు చేసింది వైఎస్..
కొట్లాడి తెలంగాణ తెచ్చింది కేసిఆర్… అరవై ఏండ్ల గోసకు చరమ గీతం పాడింది కేసిఆర్… తొండలు గుడ్లు కూడా పెట్టయని ఎగతాళి చేసిన వారి నోరు మూయించింది కేసిఆర్…వెలుగుల తెలంగాణ చేసింది కేసిఆర్…పాడి పంటల తెలంగాణ చేసింది కేసిఆర్… పల్లేరు మొలిచే పొలాల్లో పసిడి పంటలు పండేలా చేసింది కేసిఆర్… జీవ ధారలైన జలధారల సవ్వడితో పొలాలను మురిపించింది కేసిఆర్… పల్లె బతుకుల్లో పరవశం నింపింది కేసిఆర్… బతకడానికి అప్పులు చేసి దుబాయి, ఇళ్లూ వాకిలి వదిలి బొంబాయి, ప్రాణాలకు తెగించి బొగ్గు బాయి బతుకుల నుంచి విముక్తి చేసింది కేసిఆర్…. మళ్ళీ పల్లెలు కళకళలాడేలా చేసింది కేసిఆర్…బతకపోయిన వాళ్లకు పల్లెల బతుకు బంగారం చేసింది కేసిఆర్…
ఇది తెలంగాణ… తెగువ తెలంగాణ. తెగింపు తెలంగాణ. తెలివాహన నదంత స్వచ్చమైన తెలంగాణ. మనసులొ మర్మం లేని తెలంగాణ. మాటలో వెనకడుగు లేని తెలంగాణ. ఆత్మ గౌరవ తెలంగాణ… మాట మీద నిలకడ, నీతి మాటల నిప్పు కణిక తెలంగాణ… మాయా మర్మం తెలియని తెలంగాణ… అలాంటి తెలంగాణ కే నీతులు, సుద్దులు చెప్పే స్థాయి, సోయి షర్మిలకు వున్నాయా? ఇక్కడ తెలంగాణ అంటే ఉద్యమం… పోరాటం…జీవితం…! తెలంగాణ మనుగడే ఈ మూడిటి మిశ్రమం…సమ్మితం. అది కేసిఆర్ సొంతం… తెలంగాణ రాష్ట్ర సమితి సొంతం. ఇది జనం నినాదం…ప్రజా ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం మీద మాట్లాడే ముందు ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే చాలా మంచిది… ఇంతకీ షర్మిల తెలంగాణకు పాస్ పోర్ట్ తీసుకొనే వచ్చిందా? అన్న దానికి సమాధానం చెప్పాలి. పాస్ పోర్ట్ లేకుండా వస్తే ఆనాడు తన తండ్రి వైఎస్ఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలి. వైఎస్ తరుపున షర్మిల క్షమాపణలు చెప్పాలి. ఒక వేళ పాస్ పోర్ట్ తెచ్చుకొని వుంటే ప్రజల ముందుంచాలి.
తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా అహంకార పూరితమైన మాటలు నాడు వైఎస్ఆర్, నేడు షర్మిల మాట్లాడొచ్చా! కేవలం తన అధికారం నిలబెట్టుకోవాలనే స్వార్థం వైఎస్ఆర్ ది. తెలంగాణ రైతులు పండించే వరి కొనుగోలు అన్నది రాష్ట్రం కోసం…ఒక నాడు తెలంగాణపై విషం చిమ్మే వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్ ఎవరికి మేలు చేశాడు? జలయజ్ఞం పేరు చెప్పి కాగితాలలో లెక్కలు తెలంగాణకు, పారిన నీళ్లు ఆంధ్రాకు….శంకుస్థాపనలు తెలంగాణలో, ప్రాజెక్టుల పూర్తి ఆంధ్రాలో….విజయనగరం లో ఝంజావతి పూర్తయిందే గాని, తెలంగాణలో ఒక్క ఊరన్నా బాగు పడిందా? చెరువు నిండిందా? మడి తడిసిందా? కనీసం కాకతీయ కాలువ ఎండకుండా నీళ్లు చూసిందా? తెలంగాణలో ఒక్క ఎకరం స్థిరీకరణ పెరిగిందా? 2004 లో వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చి, 2006 జనవరి 1 నాటికి దేశంలోనే తొలి రబ్బరు డ్యాం పూర్తి చేశారు…తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులు పండబెట్టారు…పాలమూరు-రంగారెడ్డి పాతర పెట్టారు…దుమ్ము గూడానకి దుమ్ముకొట్టారు…దేవాదులను గాలికొదిలేశారు…కాని పోతిరెడ్డిపాడుకు పొక్క పెద్దది చేసుకున్నారు…తెలంగాణకు ఏం ఒరగబెట్టారు…నిలువు కాదు నేను అడ్డం కాదని నోరుంది కదా! అని అడ్డదిడ్డం మాటలు మాత్రం మాట్లాడాడు.
తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బకొట్టాడు…రాజకీయ విలువలు మంటగలిపాడు…పొత్తు పొడుపుల్లో కత్తులు దింపాడు…తెలంగాణలో పొద్దు పొడుపులకు తేడా లేకుండా చేశాడు…పగలు కరంటు లేదు, రాత్రి కరంటు రాదు…తెలంగాణను చీకటి చేశాడు…తెలంగాణ ఎమ్మేల్యేలను చీల్చాడు…అవకాశవాదులతో దుష్ట రాజకీయం చేశాడు. నీచ పాలనకు తెరతీశాడు…తెలంగాణ రాకుండా సర్వ విధాల ప్రయత్నం చేశాడు…
ఏ ముందమ్మా షర్మిల వైఎస్ గొప్ప… నిజామాబాదు ఎర్ర జొన్న రైతులను ఆదుకున్నాడా? పసుపు రైతులను పట్టించుకున్నాడా? ఆనాటి బకాయిలు తెలంగాణ వచ్చాక రూ. 350 కోట్ల పరిహారం ముఖ్యమంత్రి కేసిఆర్ విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ లో వడగళ్ళు పడి పైర్లు పాడైపోతే, మామిడి పిందెలు రాలిపోతే, గాలి వానలకు గడ్డి వాములు కొట్టుకుపోతే, కళ్లాలు చెల్లా చెదురైతే పరిహారమిచ్చిన పాపాన పోయాడా? అదే ఆంధ్రలో తుఫాను పేరుతో నష్టానికి మించి పరిహారాలు పప్పు బెల్లాలు పెంచినట్లు పంచింది నిజం కాదా! తెలంగాణ రైతుకు రూపాయి ఇవ్వంది నిజం కాదా? వడగళ్ళ వానకు తడిసిన వరిని కొనకుండా రైతును అరగోస పెట్టింది వైఎస్ కాదా? మూడు గంటలు పగలు, మూడు గంటలు రాత్రి రైతులకు ఉచిత విద్యుత్ పేరుతో ఇండ్లకు కరంటు లేకుండా చేయలేదా!
మా అయ్య పాలన…మా అయ్య పాలన అని తెలంగాణలో షర్మిల చెప్పుకోవడానికి ఏమీ లేదు…కరంటు చాలక, నీళ్లు అందక అవస్థలు పడుతూ కొత్త బోర్లు వేసుకుందామంటా వాల్టా చట్టంతో రైతులను ఆగం చేసింది వైఎస్ కాదా? రైతులను జైలు పాలు చేసింది వైఎస్ కాదా? ఇప్పుడు తగుదనమ్మా! మీ తాతల నేతుల వాసన చూపిస్తా…చూస్తారా! చెల్లదు.. ఇక్కడ వైఎస్ రైతులకు పెట్టిన వాతలే తప్ప మరేం లేవు…తెలంగాణ భూములు తెగనమ్మి, ఆంధ్రా అభివృద్ధికి తరలించి, తెలంగాణను అన్యాయం చేసిందే వైఎస్…అది జనం ఎప్పుడూ మర్చిపోరు..ఆ గాయాలు చెరిగిపోవు…జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే యోగ లేక, సిఎం కల నెరవేర్చుకోవడం తెలంగాణ రాజకీయం అడ్డం పెట్టుకున్నాడు…గెలిచాక కారడ్డమాడిండు.. తెలంగాణను అరిగోస పెట్టించి ఆగం చేసిండు….ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కరువులో కూడా నాడు వైఎస్ కనికరం చూపకపోయినా, మానవత్వంతో ఇప్పుడు సీమాంధ్ర కు సాయం చేసిన నాయకుడు, పాలకుడు కేసిఆర్.
రాష్ట్రం విడిపోయిన కొంత కాలానికి హుద్ హుద్ తుఫాను తాకిడికి చిగురుటాకులా ఒనికిపోయిన ఆంద్రప్రదేశ్ కు చేయూతనిచ్చాడు…ఆర్థిక సాయం చేశాడు…విద్యుత్ సామాగ్రి పంపించాడు…ఆఖరుకు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులను కూడా పంపించి, విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి చేయించాడు…అదీ కేసిఆర్ అంటే…ఇలా చెప్పుకుంటూ పోతే, వందలున్నాయి…చెప్పుకోవడానికి మీ అయ్య చేసింది ఒక్కటి కూడా లేని చోట, నోరు పెద్దది చేసుకుంటే సరిపోదు…నాలుక వుంది కదా? అని మాట్లాడితే చాలదు…రాజకీయం చేస్తున్నామని ఏది పడితే అది అంటామంటే జనం హర్షించరు… నాలుగు దశాబ్దాలుగా రాజకీయాలలో ఓటమెరుగని నాయకుడు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను ఏక వచనంతో సంభోదించి, తూలనాడితే జనం షర్మిలను మెచ్చుకుంటారనుకుంటే పొరపాటు… తెలంగాణ అంటే ఏమిటో, దాని సరిహద్దులేమిటో కూడా సరిగ్గా తెలియని షర్మిల కూడా పాలించాలని చూస్తే, అరవై ఏళ్ల పోరాటానికి అర్థముంటుందా? ఆశకు కూడా ఓ హద్దుండాలి….రవ్వంత నిజం కూడా లేని మాటలతో రాజకీయం సాగదు…యాత్ర పేరుతో కాలం వృధా…!