ఆదర్శ నేత పుచ్చలపల్లి సుందరయ్య స్పూర్తితో ఉద్యమించాలి
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు
ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు..
నర్సంపేట, నేటిధాత్రి:
ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన పుచ్చలపల్లి సుందరయ్య స్పూర్తితో ఉద్యమించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు పిలుపునిచ్చారు.
పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి వేడుకలు నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం దగ్గర సుందరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈసందర్బంగా సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెళ్లి బాబు మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు.
కులవ్యవస్థను నిరసించిన సుందరయ్య అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డిలోని రెడ్డి అనే కులసూచికను తొలగించుకున్నాడని కొనియాడారు.
సహచరులు పుచ్చలపల్లి సుందరయ్యను “కామ్రేడ్ పి.ఎస్.” అని పిలిచేవారని అన్నారు.
సుందరయ్య మార్క్సిస్ట్ పార్టీ నిరాడంబరతతో ఆదర్శ జీవితం గడిపాడు.
స్వాతంత్ర్య సమరంలోని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు.
సుందరయ్య భార్య కూడా సీపీఐ-ఎంలోని ముఖ్య నాయకురాలు.
తెలంగాణ ప్రజల పోరాటం – దాని పాఠాలు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం వంటి పుస్తకాలు, నివేదికలు రాశాడు గొప్ప కమ్యూనిస్టు నాయకుడు అని పేర్కొన్నారు.
పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘ కాలం పనిచేసిన సుందరయ్య ఆ సమయంలో పార్లమెంటుకు కూడా సైకిల్ మీద వెళ్లి ఆదర్శ కమ్యూనిస్ట్ పార్టీ నేతగా మన్నన్నలు పొందాడన్నారు.
నిజాం పాలన కాలంలో సాగిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ఒక ముఖ్యమైన ఘట్టం.
ఆ పోరాటానికి నాయకత్వం వహించిన వాళ్లులో ముఖ్యులు సుందరయ్య అని ఆ పోరాటం చివరి దశలో 1948 నుండి 1952 వరకు సుందరయ్య అజ్ఞాతంలో గడిపాడని అన్నారు.
భూస్వామి విధానాలకు వ్యతిరేకంగా జాగిరిదారులకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన కమ్యూనిస్టు ఉద్యమనేత అని చెప్పారు. ఆ పోరాటంలో 10 లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేశారని ఈ సందర్భంగా గుర్తుకు చేశారు.
పేదల ఆకలి తీర్చేందుకు అంబలి కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు.
పేదల నిత్యవసర అవసరాలు తీర్చేందుకు పట్టణం నుండి తన సైకిల్ పై నిత్యవసర వస్తువులు తెచ్చి గ్రామంలో పేదలకు పంపిణీ చేసేవారని, పేదల కోసం ఆసుపత్రి ఏర్పాటు, యువకుల కోసం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారని వివరించారు.
1930 లోనే సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి కుల వివక్షత వ్యతిరేకంగా పోరాడారన్నారు, ప్రజల భాగస్వామ్యంతో బందరు కాల్వ పూడిక తీసి రైతులకు మేలు చేశారన్నారు.
ఆనాడే కూలి సంఘం,కర్షక సంఘం, కార్మిక సంఘాలను స్థాపించారని గుర్తు చేశారు.
చివరి శ్వాస వరకు అను నిత్యం పేదప్రజల కోసం పోరాడిన సుందరయ్య పోరాట స్ఫూర్తిని పునికిపుచ్చుకొని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు అయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి,పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, పట్టణ కమిటీ సభ్యులు గడ్డమీది బాలకృష్ణ, కంది కొండ రాజు బేంబెలి మలహల్ రావు, కలకోట అనిల్, ఎండీ ఫరిదా, బిట్ర స్వప్న, ఉదయగిరి నాగమణి,రుద్రరపు లక్ష్మి నాయకులు జగన్నాధం కార్తీక్, గణిపాక ఇంద్ర,యాక లక్ష్మి, ఎల్లయ్య, సంతోష్, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.