కొడుకు ఎంట్రీపై విష్ణు ఎమోషనల్ పోస్ట్
మోహన్ బాబు, విష్ణు, అతని పిల్లలు కలిసి నటించిన సినిమా ‘కన్నప్ప’.
ఆ రకంగా మంచు కుటుంబానికి చెందిన మూడు తరాల నటీనటులను డైరెక్ట్ చేసే ఛాన్స్ ముఖేష్ కుమార్ సింగ్ కు లభించింది.
మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) జూన్ 27న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో రాబోతోంది.
అందులో మోహన్ బాబు (Mohan babu) తో పాటు మోహన్ లాల్ (Mohan Lal), శరత్ కుమార్, అక్షయ్ కుమార్, ప్రభాస్ కీలక పాత్రలను పోషించారు.
ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటించిన
ఈ సినిమాలో మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానాతో పాటు కొడుకు అవ్రామ్ సైతం చిన్నప్పటి తిన్నడుగా తెర మీద మెరిశాడు.
‘కన్నప్ప’ సినిమాలో విష్ణు తిన్నడు పాత్రను పోషించాడు. గూడెంలోని మూఢాచారాల కారణంగా దేవుడంటే ఇష్టం లేని తిన్నడు…
చివరకు శివయ్యకు ఎలా దాసోహమయ్యాడు…
తన ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి ఎలా సిద్థమయ్యాడు అనేదే ‘కన్నప్ప’ చిత్రం.
ఇందులో చిన్నప్పటి తిన్నడుగా అవ్రామ్ నటించాడు.
అతని మీద కూడా కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ చిత్రీకరించాడు.
మోహన్ బాబు, విష్ణు, అతని కుమార్తెలు, కుమారుడు ఇందులో యాక్ట్ చేయడంతో మొత్తం మూడు తరాలను కవర్ చేసినట్టు అయ్యింది.
ఇదో రేర్ ఫీట్.
ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంటూనే విష్ణు…
తాజాగా అవ్రామ్ షూటింగ్ సమయంలో చేసిన చిలిపి పనులను, అతని పై చిత్రీకరించిన సన్నివేశాలకు సంబంధించిన సీన్స్ ను ఓ మేకింగ్ వీడియోగా చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
‘కన్నప్ప’తో నా తనయుడు అవ్రామ్ తెరంగేట్రం చేస్తున్నారు.
అవ్రామ్ సెట్లోకి అడుగు పెట్టడం, కెమెరా ఎదుట నిల్చోవడం, డైలాగ్స్ చెప్పడం…
ఇలా ప్రతీదీ నా జీవితంలో భావోద్వేగపూరితమైన క్షణాలు.
ఓ తండ్రిగా, ఒకప్పుడు నేను కలలుగన్న అదే ప్రపంచంలోకి నా తనయుడు అడుగు పెట్టడం చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది.
ఈ క్షణంలో నేను అనుభవిస్తున్న ఆనందానికి ఏదీ సాటి రాదు.
ఇది అవ్రామ్ తెరంగేట్రం మాత్రమే కాదు..
నా జీవితాంతం గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం.
నాపై చూపించిన ప్రేమాభిమానాలే నా కుమారుడిపైనా చూపిస్తారని భావిస్తున్నాను.
అవ్రామ్ ప్రయాణం ‘కన్నప్ప’తో మొదలైంది’ అని విష్ణు ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు.