ఎమ్మెల్యే గాంధీ నివాసంలో ‘అనధికార’ సమీక్షలు..

ఎమ్మెల్యే గాంధీ నివాసంలో ‘అనధికార’ సమీక్షలు..

ప్రొటోకాల్‌ను గాలికొదిలేసిన అధికారులు!
​క్యాంపు కార్యాలయం ఉండగా ఎమ్మెల్యే ఇంటికి అధికారుల పరుగులు
​ మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకోవడంపై బొబ్బ నవతా రెడ్డి ఆగ్రహం

పదవి లేని వారు అధికారుల పక్కన కూర్చోవడానికి హక్కు ఎక్కడిది?
​ జోనల్ కమిషనర్ హేమంత్‌కు మాజీ కార్పొరేటర్ ఫిర్యాదు

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అధికార యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధుల తీరుపై బీఆర్ఎస్ సీనియర్ మహిళా నేత, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో ప్రొటోకాల్ నిబంధనలు తుంగలో తొక్కబడ్డాయని, అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరిందని ఆమె ఆరోపించారు. మంగళవారం ఆమె సిఎంసి జోనల్ కమిషనర్ హేమంత్ గారిని కలిసి, నియోజకవర్గంలో సాగుతున్న అనధికారిక సమీక్షా సమావేశాలపై రాతపూర్వక ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా బొబ్బ నవతా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అధికారిక సమావేశాల నిర్వహణ కోసం మియాపూర్‌లో అన్ని వసతులతో కూడిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారని గుర్తు చేశారు. ఇంతటి ఆధునిక భవనం అందుబాటులో ఉండగా, మియాపూర్, శేరిలింగంపల్లి, ఆల్విన్ కాలనీ సర్కిళ్ల అధికారులను కూకట్‌పల్లిలోని ఎమ్మెల్యే వ్యక్తిగత నివాసానికి పిలిపించుకుని అధికారిక సమీక్షలు నిర్వహించడం వెనుక అంతర్యమేమిటని నిలదీశారు. “ప్రభుత్వ నిధులతో కట్టిన కార్యాలయం ఏమైంది? అది వాడుకలో లేనప్పుడు దానిని సిఎంసి అధికారులకే అప్పగించాలి కదా?” అని ఆమె ప్రశ్నించారు.
మహిళా అధికారుల పట్ల అగౌరవం

 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారిక సమీక్షలు ప్రభుత్వ కార్యాలయాల్లోనే జరగాలని, కానీ ఎమ్మెల్యే తన ఇంటి వద్ద మీటింగ్స్ ఏర్పాటు చేసి అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా ఈఈ శిరీష, డీఈలు శ్రీదేవి, మౌనిక వంటి మహిళా అధికారులను ఎమ్మెల్యే నివాసానికి పిలిపించుకోవడం మహిళలను అవమానించడమేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “మహిళా అధికారులకు హుందాతనం కల్పించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై లేదా?” అని ఆమె సూటిగా ప్రశ్నించారు. అధికారులు కూడా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలను అతిక్రమించడం సరికాదని హితవు పలికారు.అధికారులతో నిర్వహించే ఈ సమీక్షల్లో ప్రస్తుతం ఎలాంటి అధికారిక పదవి లేని మాజీ కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ వంటి వారు ఏ హోదాలో కూర్చుంటున్నారని ఆమె నిలదీశారు.
చట్టపరమైన చర్యలకు సిద్ధం
అధికారులు చట్టానికి లోబడి విధులు నిర్వర్తించాలని, పద్ధతి మార్చుకోని పక్షంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోరాడతామని నవతా రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదు కార్యక్రమంలో ఏఈలు భాస్కర్, యుగేంధర్, వర్క్ ఇన్‌స్పెక్టర్ల తీరుపై కూడా ఆమె విస్మయం వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version