*ఆలయ పనుల పురోగతిపై సమీక్షించిన ఎమ్మెల్యే..
*భక్తులకు అనుగుణంగా నిర్మాణాలు ఉండాలని సూచనలు..
*త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు…
పలమనేరు(నేటిధాత్రి:
పలమనేరు శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ పునరుద్ధరణ పనుల పురోగతిపై ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి మంగళవారం అధికారులు మరియు అర్చకులతో పాటు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ గోపుర పనులు ఎంతవరకు వచ్చాయని ఈవో రమణారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రస్తుతమున్న శివాలయ గర్భగుడి పునర్నిర్మాణానికి చేపడుతున్న చర్యలపై క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ద్వారా అందిన నిధులను త్వరగా వినియోగించుకుని ఆలయ నిర్మాణ పనులు పూర్తిచేయాలని సూచించారు. అయితే ప్రధాన ఆలయంతో పాటు ఇతర ఆలయాల నిర్మాణానికి సరిపడా నిధులు లేవని ఇందుకు దాతల సహకారం అవసరం ఉంటుందని ఎమ్మెల్యే వారు వివరించారు. అయితే ప్రస్తుతానికి ప్రధాన ఆలయ పనులు పూర్తి చేయాలని భవిష్యత్తులో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇతర నిర్మాణాలను చేపడతామని ఆయన వారికి తెలియజేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఆధ్యాత్మికత ఉట్టిపడడమే గాక భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ పునర్ నిర్మాణం, నూతన ధ్వజ స్తంభము మరియు నంది మండపము, సుబ్రహ్మణ్య, కాలభైరవ,అయ్యప్ప ఆలయాల నిర్మాణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వారికి ఆయన సూచించారు. వాటితో పాటు స్వామి వారి నివేదనకు పోటు, అలంకార మండపం, కోనేరు అనుసంధానంతో నూతన వాహనాల మండపం,భక్తుల సౌకర్యర్థం సేద తీరడానికి మరియు ప్రసాద వినియోగానికి షెడ్డు నిర్మాణం, ఈశన్య భాగంలో ఆర్చి ఉండేలా చూసుకోవాలన్నారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని వారిని ఆదేశించారు.
12 ఏళ్లకో సారి జరగాల్సిన కుంభాభిషేకం 2003తో ఆగిందని ఇప్పటిదాకా ఆ కార్యక్రమం జరగలేదంటు అర్చకులు ఎమ్మెల్యేకు తెలుపగా ఆరు నెలల్లో పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది 2027 కు కుంభాభిషేకం జరిగేలా చూడాలని అధికారులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఈవో రమణా రెడ్డి, గంగమ్మ గుడి చైర్మన్ శ్రీధర్, అర్చకులు కుమార్ గురుకుల్, రాఘవేంద్ర, చంద్ర మౌళిలతో పాటు ఆలయ కమిటీ సభ్యులు మురళీ కృష్ణ, బాబు, రెడ్డెప్ప, వీరప్ప, మంజునాథ్, ఆది మరియు టీడీపీ పట్టణ అధ్యక్షులు ఆర్బీసీ కుట్టి తదితరు
లు పాల్గొన్నారు…
