మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం:

మందమర్రి నేటి ధాత్రి :

 

 

మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం: బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్
గంజాయి నిర్మూలనే ధ్యేయంగా పోలీస్ శాఖ భారీ అవగాహన ర్యాలీ
మందమర్రి: మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించాలనే గొప్ప లక్ష్యంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని, మందమర్రి సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలో “మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీ”ని గురువారం ఘనంగా నిర్వహించారు.

 

 

 

 

ఈ ర్యాలీని ఏసీపీ రవి కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.
మందమర్రి సింగరేణి గ్రౌండ్ నుండి మార్కెట్ మీదుగా సాగిన ఈ భారీ ర్యాలీలో సింగరేణి మందమర్రి ఏరియా జీఎం దేవేందర్, ఇతర సింగరేణి అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, యువత, రాజకీయ నాయకులు, మహిళలు, పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. “మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకండి” వంటి నినాదాలతో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి ప్రజలలో చైతన్యం నింపారు. అనంతరం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత ప్రతిజ్ఞ చేసి, “యాంటీ డ్రగ్ సోల్జర్స్”గా సంతకాలు చేశారు.

 

 

 

 

ఈ సందర్భంగా ఏసీపీ రవి కుమార్ మాట్లాడుతూ, “దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. అలాంటి యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలై పురోగతికి, ఉజ్వల భవిష్యత్తుకు స్వయంగా అవరోధాలు సృష్టించుకోవద్దు. సమాజం నుండి మాదకద్రవ్యాలను సమూలంగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. పోలీస్ శాఖ గంజాయి వంటి మత్తుపదార్థాల అమ్మకం మరియు వాడకంపై కఠినంగా వ్యవహరిస్తుంది,” అని హెచ్చరించారు.

 

 

 

సింగరేణి జీఎం దేవేందర్ మాట్లాడుతూ, “చెడు వ్యసనాల వల్ల యువత ఆరోగ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాకుండా, చట్టవ్యతిరేక కార్యకలాపాలలో చిక్కుకుంటున్నారు. ఈ మత్తు అనే మహమ్మారి నుండి మన యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది,” అని అన్నారు.

 

 

 

మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, “సరదాగా మొదలయ్యే అలవాటే వ్యసనంగా మారి జీవితాలను నాశనం చేస్తుంది. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా విద్యార్థులు తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలి. గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనలో యువత భాగస్వామ్యం కావాలి,” అని కోరారు.
మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే ఉపాధ్యాయులకు, యాంటీ-డ్రగ్ కమిటీలకు లేదా డయల్ 100, 1908 నంబర్లకు ఫోన్ చేసి పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

 

 

 

 

ఈ కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఎస్ఐలు, సింగరేణి పర్సనల్ మేనేజర్, ఎస్ఓ టూ జీఎం, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులు, పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version