ఉగ్రవాదుల చర్యలను పసిగట్టడంలో కేంద్రం విఫలం
మతోన్మాద విధానాలతో లౌకికత్వానికి ప్రమాదం
ఎంసిపిఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్
నర్సంపేట/వరంగల్ జిల్లా ప్రతినిధినేటిధాత్రి:
దేశంలో ఉగ్రవాదుల పన్నాగాలను పసిగట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందని ఈ క్రమంలోనే పహెల్గాంలో పర్యటకులపై ఉగ్రవాదుల పైశాచిక దాడి జరిగిందని ఎంసిపిఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్ అన్నారు.
మంగళవారం భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య)- ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం కామ్రేడ్ షేక్ నజీర్ అధ్యక్షతన వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఓంకార్ భవన్ లో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్ మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వ విధానాల వల్ల కార్మికులు కర్షకులు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆదాని అంబానీ లాంటి పెట్టుబడుదారులు ఎదేచ్ఛగా దేశ సంపదను అనుభవిస్తున్నారని ఆరోపించారు. శ్రమజీవులకు ఎలాంటి కనీస సౌకర్యాలు తగిన విధంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి దేశ లౌకికత్వాన్ని సమగ్రతను దెబ్బతీసేందుకు మతపరమైన విధానాలకు చర్యలు చేపట్టడం ఆందోళన కలిగిస్తున్నదని ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక తరగతులకు తీరని నష్టం జరుగుతున్నదని అలాగే దేశాన్ని రక్షించాల్సిన కీలక బాధ్యతను నిర్వర్తించాల్సిన పాలకులు అది విస్మరించి తగిన విధంగా భద్రతను ఏర్పాటు చేయకుండా, నియామకాలు చేపట్టకుండా, ఉగ్రవాదులు పర్యాటకుల ప్రాణాలు బలి కొనడానికి కారణమయ్యారని ఆరోపించారు ఏ లక్ష్యం లేకుండానే పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించి ఎంతో సాధించామని ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు. ఏ రకమైన మతోన్మాదం అయినా ప్రజలకు తీవ్రమైన హాని కలిగిస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో వామపక్ష సామాజిక ప్రజా సంఘాలు రాజకీయాలకతీతంగా ప్రజలను సమీకరించి ఉద్యమాలను చేపట్టేందుకు శ్రీకారం చుట్టాలని అందులో ఎంసిపిఐ(యు) కార్యకర్తలు ముందు ఉండాలని పిలుపునిచ్చారు. సమావేశానికి ముందు ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన పర్యటకుల మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలియజేశారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, వనం సుధాకర్,కుంభం సుకన్య, వసుకుల మట్టయ్య, వరికుప్పల వెంకన్న,గోనె కుమారస్వామి, పెద్దారపు రమేష్, ఎన్ రెడ్డి హంసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.