సీనియారిటీ కంటే సిన్సియారిటీకి గౌరవం..

సీనియారిటీ కంటే సిన్సియారిటీకి గౌరవం..

కమిట్మెంట్‌కు రాజ్యసభ బహుమతి

టికెట్ కోసం ఆరాటపడకుండా పార్టీ కోసం పనిచేసిన వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ అవకాశం

నేటిధాత్రి, వరంగల్.

 

రాజకీయాల్లో స్నేహం, త్యాగం, కమిట్మెంట్‌లకు విలువ ఉండదని సాధారణంగా అనిపించినా సరైన సమయం వచ్చినప్పుడు అవే నాయకుడి మెరిట్స్‌గా మారి పదవులను అందించే ఉదాహరణగా వేం నరేందర్ రెడ్డి నిలిచారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు ఎన్నిక కావడం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీనియర్ నాయకులను పక్కనపెట్టి ఆయనకు అవకాశం ఇవ్వడం కాంగ్రెస్‌లోని ఒక వర్గంలో అసంతృప్తిని రగిలించినా, సీనియారిటీ కంటే సిన్సియారిటీకి ప్రాధాన్యం ఇచ్చి అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గత రెండు అసెంబ్లీ ఎన్నికలు (2018, 2023) అలాగే 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ టికెట్ కోసం ఆరాటపడకుండా పార్టీ కోసం తెరవెనుక పనిచేసిన వేం నరేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ వచ్చారు. అదే ఓపిక ఇప్పుడు ఆయనకు మెరిట్‌గా మారి రాజ్యసభ స్థానం దక్కేలా చేసింది.

ఉమ్మడి వరంగల్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన వేం నరేందర్ రెడ్డి కుటుంబానికి ప్రాంతంలో రాజకీయంగా మంచి పట్టు ఉంది. రజాకార్ల వ్యతిరేక పోరాటంలో ఆయన కుటుంబం పాల్గొనగా, ఆయన తాత పుల్లారెడ్డి ఆ పోరాటంలో పాల్గొన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన తండ్రి చెన్నకృష్ణారెడ్డి సర్పంచ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్‌గా పనిచేయగా, సోదరుడు పురుషోత్తం రెడ్డి జడ్పీటీసీగా, వదిన ఉమా సర్పంచ్‌గా పనిచేశారు.

మొదట జనతాపార్టీలో క్రియాశీలకంగా ఉన్న వేం నరేందర్ రెడ్డి తరువాత టీడీపీలో చేరి రాజకీయాల్లో కొనసాగారు. 2001 జిల్లా పరిషత్ ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ లక్ష్యంగా నల్లబెల్లి మండలం నుంచి పోటీ చేసి తెరాస అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

అయితే 2004 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా మహబూబాబాద్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్, జనతా పార్టీ అభ్యర్థుల మధ్య ఓట్ల చీలికతో కేవలం మూడు వేల మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డికి 50,348 ఓట్లు రాగా, భరత్ చంద్రారెడ్డికి 47,059, రాజవర్ధన్ రెడ్డికి 41,757 ఓట్లు వచ్చాయి.

తర్వాతి రాజకీయ పరిణామాల్లో 2009లో వరంగల్ ఈస్ట్ నుంచి నామినేషన్ వేసినప్పటికీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో విత్‌డ్రా చేసుకున్నారు. 2010 ఉపఎన్నికల్లో పోటీ చేసినా గణనీయమైన ఓట్లు రాకపోవడంతో డిపాజిట్ కోల్పోయారు.

2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జరిగిన ఓటుకు నోటు కేసు తర్వాత రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిల మధ్య బంధం మరింత బలపడింది. 2017లో రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన వేం నరేందర్ రెడ్డి అప్పటి నుంచి పార్టీకి బ్యాక్ ఆఫీస్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో పాత, కొత్త నాయకుల మధ్య వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధిష్టానం మాత్రం పార్టీకి ఉపయోగపడే నాయకులకు అవకాశాలు ఇవ్వాలనే విధానాన్ని కొనసాగిస్తోంది. జీవన్ రెడ్డి, కోదండరెడ్డి, మధు యాష్కీ వంటి సీనియర్ నాయకులు పోటీలో ఉన్నప్పటికీ సీఎం కోటాలో వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ దక్కడం ఆయన పార్టీ పట్ల చూపిన కమిట్మెంట్‌కు గుర్తింపుగా భావిస్తున్నారు.

రాజకీయాల్లో ఓపికతో, నిబద్ధతతో పనిచేస్తూ అవకాశాల కోసం వేచిచూసిన నాయకుడికి చివరకు ఫలితం దక్కుతుందనే విషయాన్ని వేం నరేందర్ రెడ్డి రాజకీయ ప్రయాణం మరోసారి రుజువు చేసింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version