వేతన బకాయిలు డిమాండ్ చేస్తూ ట్రైడెంట్ కార్మికుల ఆందోళన….

వేతన బకాయిలు డిమాండ్ చేస్తూ ట్రైడెంట్ కార్మికుల ఆందోళన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: వేతన బకాయిలు చెల్లించాలన్న ప్రధాన డిమాండ్తో కార్మిక సంఘం అధ్యక్షులు ఎంజీ.రాముల ఆధ్వర్యంలో ట్రైడెంట్ కార్మికులు కంపెనీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత రెండు సంవత్సరాలుగా యాజమాన్యం తమ బకాయి డబ్బులను చెల్లించకుండా రేపు మాపంటూ కాలయాపన చేస్తోందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. కంపెనీ కార్మికులు కాదని యూపీ, బీహార్ కు చెందిన దినసరి కూలీలతో చట్టవిరుద్ధంగా పని చేయిస్తున్నారన్నారు. రూ.5 కోట్లు వేతన బకాయిలు చెల్లించి తమకు పనులు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కంపెనీ, కార్మిక చట్టాలకు విరుద్ధంగా యూపీ, బీహార్లకు చెందిన 300 మంది కార్మికులతో పనిచేయిస్తున్నారని ఆరోపించారు. వీరిలో చాలామంది కూలీలు బాల కార్మికులేనని పేర్కొన్నారు.ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి పని కల్పిస్తూ తమకు మాత్రం బకాయిలు చెల్లించకుండా పని కల్పించకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. యాజమాన్యం దిగొచ్చేంత వరకు నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇటీవల డీసీఎల్ వద్ద సమావేశమైన యాజమాన్యాలు ఉమర్, ఓంకార్ షుగర్స్ లతో ఫిబ్రవరి 2వ తేదీ వరకు బకాయిలు చెల్లించేలా జరిగిన ఒప్పందం ప్రకారం ఈరోజు చెల్లించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా యాజమాన్యం వ్యవహరించడంతో ఆగ్రహించిన కార్మికులు కంపెనీ గేటు ముందు బైఠాయించారు. తమ డిమాండ్లు పరిష్కరించే అంతవరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్మిక సంఘం అధ్యక్షులు ఎంజీ.రాములతో పాటు నాయకులు రాజశేఖర్, నాగేష్ పాటిల్, జగదీష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ…

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ

సింగరేణి యాజమాన్యం ముక్కు పిండి కార్మికుల జీతాలు వసూల్ చేస్తాం

సింగరేణి యాజమాన్యం పైన ఘాటు వ్యాఖ్యలు చేసిన మహేష్ వర్మ

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహించిన ధర్నా,నిరసన కార్యక్రమానికి మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు తెలిపింది.కాంట్రాక్ట్ కార్మికులకు 4నెలల జీతాలను ఇవ్వకుండా,విధులకు తీసుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తూన్నారన్న విషయంపై టీఆర్పీ పార్టీ మంచిర్యాల జిల్లా నాయకులు మహేష్ వర్మ మాట్లాడుతూ.. సిఆర్ఆర్ కంపెనీ,ఉదయ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కాంట్రాక్ట్ కార్మికులతో 4 నెలలుగా జీతాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, కార్మికులను విధులకు కూడా తీసుకోకుండా కంపెనీ పూర్తిగా ఎత్తేశారని అన్నారు.కాంట్రాక్ట్ యాజమాన్యానికి సంబంధించి ఎవరు లేకపోవడంతో ఎవరిని సంప్రదించాలని కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ఈ విషయం పై సింగరేణి జనరల్ మేనేజర్ ని కలవగా డబ్బులు ఇప్పిస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి ఇప్పుడు మాకు సంబంధం లేదని మాట మార్చారని మండిపడ్డారు.కార్మికుల జీతాలు ఇప్పిస్తానని మాటమార్చిన జనరల్ మేనేజర్ అధికారిగా అనర్హుడని అన్నారు.కీలక బాధ్యత ఉద్యోగంలో ఉండి కార్మికుల జీతాలు ఇప్పించడం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.ఇలాంటి మోసపూరిత కంపెనీలకు కాంటాక్ట్ ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు.కార్మికుల శ్రమ దోచుకున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని,వాటిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని,వాటి లైసెన్సులు పేపర్ ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.కార్మికుల జీతాలు వడ్డీతోసహా చెల్లించాలని లేనిపక్షంలో రానున్న రోజుల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సింగరేణి యాజమాన్యంపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంటాక్ట్ కంపెనీల,సింగరేణి యాజమాన్యం ముక్కు పిండి వసూల్ చేస్తామని,బాధిత కార్మికులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు పాకాల దినకర్,దాస్యపు దీపక్ కుమార్,పడాల శివతేజ, సిపతి సాయి కుమార్,ఎండి లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version