అన్యమత ఉద్యోగులని సస్పెండ్ చేసిన టీటీడీ.

అన్యమత ఉద్యోగులని సస్పెండ్ చేసిన టీటీడీ

నలుగురు అన్యమత ఉద్యోగులని తిరుమల తిరుపతి దేవస్థానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు శనివారం టీటీడీ ప్రకటన విడుదల చేసింది. వీరు టీటీడీ ప్రవర్తనా నియమావళిని పాటించకపోవడంతోనే సస్పెండ్ చేశామని టీటీడీ అధికారులు తెలిపారు.

తిరుపతి: నలుగురు అన్యమత ఉద్యోగులని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఇవాళ(శనివారం) టీటీడీ ప్రకటన విడుదల చేసింది. టీటీడీలో పనిచేస్తున్న బి.ఎలిజర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (క్వాలిటీ కంట్రోల్), ఎస్. రోసి, స్టాప్‌నర్స్(బర్డ్ ఆస్పత్రి), ఎం.ప్రేమావతి, గ్రేడ్ -1 ఫార్మసిస్ట్ (బర్డ్ ఆస్పత్రి), అదేవిధంగా డా.జి.అసుంత. ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీల్లో విధులు నిర్వహిస్తున్న ఈ నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

సదరు నలుగురు ఉద్యోగులు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారని.. అందుకు సంబంధించిన ఆధారాలు, వీరిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేశామని టీటీడీ అధికారులు చెప్పుకొచ్చారు. వీరు టీటీడీ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని అన్నారు. హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూ బాధ్యతారహితంగా వ్యవహరించారని చెప్పారు. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సదరు నలుగురు ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేశామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version