ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ వర్సెస్ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌..

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ వర్సెస్ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ, సస్పెన్షన్‌లో ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్‌ల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతోంది. ఇద్దరూ సవాళ్లు, ప్రతి సవాళ్లతో తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

అమరావతి, మార్చి 01: ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్‌ అధికారి పీవీ.సునీల్‌ కుమార్‌ల మధ్య సోషల్ మీడియా వేదికగా వేడి రాజుకుంది. సామాజిక, ప్రసార మాధ్యమాల వేదికగా ఒకరిపై మరొకరు వ్యంగ్యాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఎమ్మెల్యేల క్రీడాపోటీల్లో క్రికెట్ ఆడుతున్న క్రమంలో ఇటీవల రఘురామ కిందపడి గాయపడ్డారు. ఆయన చేతికి మణికట్టుకు గాయవ్వగా.. చేతికి కట్టుతోనే అసెంబ్లీకి హాజరయ్యారు. రఘురామ గాయంపై సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘రఘురామ.. కస్టోడియల్‌ టార్చర్‌ కథ అబద్ధం. ఆటలో పడిపోతేనే రెండు ఎముకలు విరిగాయి. అలాంటిది నిజంగా కొట్టి ఉంటే.. ఎన్ని ఎముకలు విరిగేవి అధ్యక్షా?’ అని వ్యంగ్యంగా పోస్ట్ చేశారు.
దీనికి డిప్యూటీ స్పీకర్ రఘురామ దీటుగా బదులిచ్చారు. ‘సర్వీస్‌ కాల సస్పెన్షన్‌లో ఉన్న సునీల్‌ కుమార్‌ అనుమతిస్తే నాకు కేవలం అరగంట చాలు.. కస్టడీలో నన్ను హింసించినట్టుగా.. కాళ్లు కట్టేసి పాదాలపై కర్ర, రబ్బర్ బెల్ట్‌తో రక్తపు చారల మచ్చలు పడేలా కొట్టగలను. సునీల్‌ కుమార్‌ వచ్చి కొట్టించుకుని, నిరూపించుకుంటాను అంటే బహిరంగంగానే ఈ కార్యక్రమం పెట్టేందుకు సిద్ధం’ అని రఘురామ సవాల్‌ విసిరారు.

న్యాయ వ్యవస్థపై తనకు పూర్తిగా నమ్మకముందని ఈ సందర్భంగా రఘురామ అన్నారు. ‘న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. నాపై కస్టోడియల్‌ హింసకు పాల్పడిన సునీల్‌ కుమార్‌ అరెస్ట్‌ తథ్యం’ అని ఆయన హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version