కార్గో సేవలు పునఃప్రారంభానికి పెరుగుతున్న డిమాండ్
పరకాల,నేటిధాత్రి
పట్టణంలో ఆర్టీసీ కార్గో సేవలు నిలిచిపోవడం స్థానిక ప్రజలకు గణనీయమైన ఇబ్బందులను కలిగిస్తోంది.గతంలో పట్టణంలోనే అందుబాటులో ఉన్న ఈ సేవలు ప్రస్తుతం నిలిచిపోవడంతో సరుకుల పంపిణీ,స్వీకరణ కోసం ప్రజలు హన్మకొండకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ప్రయాణ ఖర్చులు పెరగడంతో పాటు సమయం కూడా వృథా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రత్యేకంగా చిన్న స్థాయి వ్యాపారులు,ఆన్లైన్ వ్యాపార దారులు,విద్యార్థులు ఈ సమస్యతో తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. వ్యాపార అవసరాలకు సంబంధించిన సరుకులు సమయానికి అందకపోవడం వల్ల వ్యాపార కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.స్థానికుల ప్రకారం,పరకాల వంటి అభివృద్ధి చెందుతున్న పట్టణానికి ఆర్టీసీ కార్గో సేవలు కీలకంగా ఉంటాయని,ఇవి అందుబాటులో లేకపోవడం వల్ల పట్టణ అభివృద్ధికి కూడా కొంతమేర ఆటంకం కలుగుతోందని అభిప్రాయపడుతున్నారు. హన్మకొండకు వెళ్లాల్సి రావడం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరింత కష్టసాధ్యంగా మారిందని వారు పేర్కొంటున్నారు.పట్టణంలో ఆర్టీసీ కార్గో సేవలు పునఃప్రారంభమైతే,ప్రజలకు సమయసౌలభ్యం కలగడంతో పాటు వ్యాపార వ్యవహారాలు వేగవంతమవుతాయని,రవాణా ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి పరకాలలో ఆర్టీసీ కార్గో సేవలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు, వ్యాపార వర్గాలు కోరుతున్నాయి.త్వరితగతిన నిర్ణయం తీసుకుని సేవలు పునరుద్ధరించాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది.
కార్గో లేకపోయేసరికి హన్మకొండకు వెళ్లాల్సి వస్తుంది
పట్టణంలో ఆర్టీసీ కార్గో సేవలు లేకపోవడంతో ఏవైనా వస్తువులు గాని ఇతర పార్సిల్ లు గాని పంపిచడానికి,తీసుకోవడానికి హన్మకొండకు వెళ్లాల్సి వస్తోంది.ఆర్టీసీ కార్గో సేవలు నిలిచిపోవడం వల్ల స్థానిక వ్యాపార కార్యకలాపాలు మందగిస్తున్నాయి.ముఖ్యంగా చిన్న వ్యాపారులు సరుకుల రవాణాలో ఆలస్యాలు ఎదుర్కొంటున్నారు.కార్గో సేవలు అందుబాటులోకి వస్తే వ్యాపారాలకు ఊతం లభించడమే కాకుండా ప్రజలకు సౌకర్యం కలుగుతుంది.కాబట్టి సంబంధిత అధికారులు స్పందించి కార్గో సేవలను తిరిగి ప్రారంభించాలి.
-ఓదెల శివ పరకాల వాసి
