అడవులలో పచ్చదనాన్ని సంరక్షించుకుందాం….. పర్యావరణాన్ని కాపాడుదాం…
చిత్తూరు డీఎఫ్ఓ భరణి
అడవుల్లో మొక్కలు ఏర్పాటు చేయడం అభినందనీయం= సీఈఓ నరేంద్రన్.
రామచంద్రాపురం(నేటి ధాత్రి) ఏప్రిల్ 30:
అటవీ శాఖకు చెందిన అడవులలో ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంపొందించి. పర్యావరణాన్ని కాపాడాలని చిత్తూరు జిల్లా అటవీ శాఖ అధికారిణి భరణి అన్నారు. మండలంలోని కొత్త కండ్రిగ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని పచ్చదనంగా మార్చేందుకు ప్రాణ యోగ ఆశ్రమం అటవీ ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన చిత్తూరు అటవీ శాఖ అధికారిణి భరణి, తిరుపతి బయో ట్రీమ్ సీఈవో నరేంద్రన్లకు ప్రాణ యోగ ఆశ్రమ వ్యవస్థాపకులు సి.కైలాస్ కుమార్తె కృపారాణి, సిబ్బంది పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడవుల సంరక్షణతోనే మానవ మనుగడ, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఆశ్రమం పక్కనున్న అటవీ భూమిలో ప్రాణ యోగ ఆశ్రమ నిర్వాహకులు 250 మర్రి,వేప, రావి చెట్లను నాటి సంరక్షించడం అభినందినీయమని ఆమె తెలిపారు. తిరుపతి బయోట్రీమ్ సీఈఓ నరేంద్రన్ మాట్లాడుతూ అటవీ భూముల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రాణ యోగ ఆశ్రమం వ్యవస్థాపకులు కైలాష్, కృపారాణిలు పెద్ద మొక్కలు నాటించి సంరక్షించడం హర్షినియమన్నారు.మొక్కల సంరక్షణకు ఆశ్రమ యాజమాన్యానికి ప్రత్యేక సూచనలు సలహాలు అందజేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ వన సంరక్షణే… మానసంరక్షణ నినాదాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆశ్రమంలోని ప్రకృతి వనం, పరిశుభ్రత… పచ్చదనం. యోగశాల, వసతులను పరిశీలించి ఆశ్రమ నిర్వాహకులకు శభాష్ అని కితాబు ఇచ్చారు. మొక్కల పెంపకానికి ముందుకొచ్చినందుకు ప్రాణ యోగ ఆశ్రమ నిర్వాహకులను అటవీ శాఖ అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటసుబ్బయ్యడిఆర్ఓ కారన్ సింగ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కుమార్, సిబ్బంది పద్మనాభం,ప్రాణ యోగ ఆశ్రమ ప్రతినిధులు మురళి,శివ యాదవ్, లక్ష్మయ్య, ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..