మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
2వ సాధారణ మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరుగనున్న పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో పి.ఓ., ఎ.పి.ఓ. లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ మాట్లాడుతూ 2వ సాధారణ మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా పోలింగ్ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.ప్రతి పోలింగ్ కేంద్రంలో 800 ఓటర్లకు మించకుండా పోలింగ్ జరిగేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రతి పోలింగ్ కేంద్రంలో కేటాయించబడిన సిబ్బందికి పోలింగ్ ప్రక్రియలోని ప్రతి అంశం తెలిసి ఉండాలని,ఓటింగ్ కంపార్ట్మెంట్ గోప్యత నిర్వహణ సక్రమంగా చేయాలని తెలిపారు.ఇతరులకు బదులుగా ఓటు వేయడం, ఒకటికి మించి ఓటు వేయడం జరగకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని,పోలింగ్ ముగిశాక తీసుకోవలసిన జాగ్రత్తలు,పాటించవలసిన నియమాలపై శిక్షణలో తెలియజేయడం జరుగుతుందని తెలిపారు.పోలింగ్ అధికారులకు కేంద్రాలలో త్రాగునీరు,మూత్రశాలలు, లైటింగ్,ఫ్యాన్ వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, గర్భిణీ స్త్రీలు,బాలింతలు మినహాయింపు కోరినట్లయితే ఆమోదించడం జరుగుతుందని,మిగతా వారికి అత్యవసర ఆరోగ్య పరిస్థితులు,ఇతర ఇబ్బందులు తలెత్తితే తప్ప పోలింగ్ విధులలో మినహాయింపు ఉండదని తెలిపారు.11వ తేదీన పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని,12 రీపోలింగ్ (ఏమైనా ఉన్నట్లయితే),13వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల నగరపాలక సంస్థ కమిషనర్ అన్వేష్, మాస్టర్ ట్రైనర్ హరిప్రసాద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
