గుట్కా, పొగాకు విక్రయదారునిపై కేసు నమోదు
పోలీసుల దాడిలో నిషేధిత గుట్కా స్వాధీనం
రూ.12,190 విలువైన పొగాకు ఉత్పత్తులు సీజ్
నర్సంపేట/గీసుగొండ,నేటిధాత్రి:
నిబంధనలను ఉల్లంఘించి గుట్కా, పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న వ్యక్తిపై గీసుగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వంచనగిరి గ్రామానికి చెందిన బొల్లం బిక్షపతి మారుతి ఇంటర్నెట్ , జనరల్ స్టోర్స్ నిర్వహిస్తూ విద్యాసంస్థలకు సమీపంలో నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది.ఈ మేరకు దాడి నిర్వహించి దుకాణాన్ని తనిఖీ చేయగా నిషేధిత గుట్కా,పొగాకు ఉత్పత్తులు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకొని మొత్తం రూ.12,190 విలువైన సరుకును సీజ్ చేసి నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీ.ఐ విశ్వేశ్వర్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి నిషేధిత సరుకులు అమ్మిన, కొనుగోలు చేసిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
