వేసవి వేడి మధ్య కూలీలకు రక్షణ… ఉపాధి హామీలో కలెక్టర్ కట్టుదిత్తమైన చర్యలు
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులలో ఉపాధి హామీ కూలీల సంక్షేమం దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని భీమిని మండల కేంద్రంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పని ప్రదేశాలను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి గంగామోహన్ లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉష్ణోగ్రత తీవ్రమవుతున్న దృష్ట్యా ఉదయం 6 గంటలకు పని ప్రదేశానికి చేరుకొని 11 గంటల లోగా ఇళ్లకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని,పని ప్రదేశాలలో నీడ,త్రాగునీరు,ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు,మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు.ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో రహదారులు, నిబంధనల ప్రకారం వ్యక్తిగత సంబంధిత పనులు మంజూరు చేస్తామని,కూలీలు 100 రోజుల పని పూర్తి చేసుకోవాలని తెలిపారు.గ్రామ సభల ద్వారా గుర్తించిన పనుల నిర్వహణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని,ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు 90 రోజుల పని దినాలను ఉపాధి హామీ పథకం ద్వారా కల్పించడం జరుగుతుందని తెలిపారు.అవసరం అయిన వారికి ఇంకుడు గుంతలు, పశువుల షెడ్లు,ఫారం పాండ్లు, చాపల చెరువులు వంటి పనులను మంజూరు చేస్తామని తెలిపారు.పనుల నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తున్న భీమిని, బిట్టూరుపల్లి,చిన్న గుడిపేట క్షేత్ర సహాయకులు లీలావతి, సాయిరాం,సత్యనారాయణ లను శాలువాలతో సత్కరించి నగదు బహుమతి అందజేశారు.
భూభారతి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వార్డులు,రిజిస్టర్లు,పరిసరాలను పరిశీలించారు.ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని,గర్భిణులు ఆసుపత్రులలోనే ప్రసవాలు చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు.సాధారణ ప్రసవాలు,సిజేరియన్ల వివరాలు తెలుసుకొని వైద్యులకు పలు సూచనలు చేశారు.ఆసుపత్రిలో ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు,మందుల నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి తహసిల్దార్ బి.కర్ణదాస్ తో కలిసి హాజరు పట్టిక,భూభారతి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు.ఉద్యోగులు, అధికారులు,సిబ్బంది విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని,భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులతో సరిచూసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు
భీమిని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామసభకు అధికారులతో కలిసి హాజరయ్యారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయితీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామ అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని,పరిపాలన సౌలభ్యం కొరకు గ్రామ సర్పంచ్, ఎంపిటిసి,ఎంపిపి,జిల్లా పరిషత్ వ్యవస్థల ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని తెలిపారు.ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాలని,క్షేత్రస్థాయిలో స్థానికత కలిగిన ప్రజా ప్రతినిధులకు సమస్యలపై పూర్తి అవగాహన ఉంటుందని,తద్వారా సమస్యల పరిష్కారం సులభతరం అవుతుందని,అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అద్దుతాయని తెలిపారు. ఉపాధి హామీ పథకం,రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు వంటి ప్రభుత్వం పథకాలు విజయవంతం కావడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలిపారు.గ్రామ అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభకు అధికారులు,ప్రజా ప్రతినిధులు బాధ్యతలు హాజరుకావాలని,గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు.
వైద్య సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలి
అనంతరం కన్నేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు,మందుల నిల్వలు,పరిసరాలను పరిశీలించారు.వేసవి అయినందున వడదెబ్బకు గురి కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని తెలిపారు.ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని,వైద్యులు,సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని తెలిపారు.ఈ కార్యక్రమంల సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
