వరి సాగులో నూకలతో కలుపు నివారణపై అవగాహన
పాల్గొన్న.. పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డి.
బాలానగర్ /నేటి ధాత్రి
బాలానగర్ మండలంలోని హేమాజీపూర్ గ్రామంలో బుధవారం వరి సాగులో నూకల వినియోగంతో కలుపు నివారణపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మట్టి మనిషిగా పేరుగాంచిన పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ప్రకృతి సేద్యంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల రసాయన ఎరువుల వినియోగం అధికమవుతోందన్నారు.దీని కారణంగా భూమి సారం క్రమంగా తగ్గిపోతోందని, రసాయనాలతో పండించిన ఆహారం ఆరోగ్యానికి హానికరమవుతోందని సూచించారు. నూకలతో కలుపు నివారణ చేయడం ద్వారా ఖర్చులు తగ్గడమే కాకుండా, నేల సారాన్ని కూడా కాపాడుకోవచ్చని వివరించారు. ఈ అవగాహన కార్యక్రమానికి మండలంలోని పెద్ద రేవల్లి, చిన్న రేవల్లి, మధురాపూర్, లింగారం తదితర ప్రాంతాల నుంచి రైతులు భారీగా హాజరయ్యారు. అనంతరం పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డిని గ్రామస్తులు పూలదండ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో హేమాజీపూర్ మాజీ సర్పంచ్ మురళీధర్ రెడ్డి, స్థానిక రైతులు ఆంజనేయులు, వెంకటరెడ్డి, నగేష్, నరసింహారెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
