కోటగుళ్లలో ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు
భారీగా తరలివచ్చిన భక్తులు
స్వామివారికి రుద్రాభిషేకం పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో శ్రావణ మాస మొదటి శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం గణపతి పూజతో కార్యక్రమాలను ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ప్రారంభించారు. అనంతరం నందీశ్వరుడు, గణపేశ్వరునికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం స్వామి వారిని పట్టు వస్త్రాలతో వివిధ రకాల పూలమాలతో కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా మహిళలు భవానీ మాతకు చీరే సారే, ఓడి బియ్యం సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం తులసి, మారేడు, ఉసిరి, తెల్ల జిల్లేడు, మేడి, నాగదేవుని పుట్ట వద్ద దీపాలను వెలిగించారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు నాగరాజు భక్తులకు ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారికి పూజలు నిర్వహించారు.