ముగ్గురు మున్సిపల్ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు..
జహీరాబాద్. నేటి ధాత్రి:
మున్సిపాలిటీలకు సంబంధించిన ఇంటి పన్నులు, ప్రాపర్టీ టాక్స్ , కుళాయి బిల్లుల వసూల్లో నిర్లక్ష్యం వహించిన సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్లు, మేనేజర్లు, బిల్ కలెక్టర్లకు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. ఈ నెలాఖరులోగా 100 శాతం ఇంటి పన్నులు, కుళాయి బిల్లులు వసూలు చేయాలని టార్గెట్ విధించగా మూడు మున్సిపాలిటీలలో బిల్లుల వసూలు పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహించడం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం రోజుల క్రితం కొంతమంది మున్సిపల్ బిల్ కలెక్టర్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మేనేజర్లకు సస్పెన్షన్, షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ సిబ్బంది పనితీరులో మార్పు రాకపోవడంతో జిల్లా కలెక్టర్, జహీరాబాద్ మున్సిపాలిటీ లో కమిషనర్ ఉమామహేశ్వరరావు, మేనేజర్ ఉమేశ్వర్ లాల్, బిల్ కలెక్టర్లు 8 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.సంగారెడ్డి మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ ఎస్సీ వీకే ఛావన్ , మేనేజర్ సూర్య ప్రకాష్ ,బిల్ కలెక్టర్లు 27 మందికి షోకాజు నోటీసులు జారీ చేశారు. సదాశివపేట మున్సిపాలిటీలో కమిషనర్ శ్రీమతి జే ఉమా, మేనేజర్ ఉమర్ సింగ్, 14 మంది బిల్ కలెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇంటి పన్నులు, కుళాయి బిల్లును, ప్రాపర్టీ టాక్స్ 100 శాతం వసూలు చేయాలని ఆదేశించారు. షోకాజ్ నోటీసులకు 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని లేకుంటే కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్టు నోటీసుల్లో పేర్కొన్నారు.