తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పాలన రావాలని తిరుమల శ్రీవారిని వేడుకున్న రవీందర్ యాదవ
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:
శేరిలింగంపల్లి నియోజకవర్గం యువనేత, బీఆర్ఎస్ సీనియర్ నేత రవీందర్ యాదవ్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, హైదరాబాద్ను కేటీఆర్ ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దారని రవీందర్ యాదవ్ కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి, కమీషన్ల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు. ప్రతి పనికి కమీషన్ల పేరుతో ప్రజలను వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని రవీందర్ యాదవ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని, బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ పాలన రావాలని శ్రీవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.