జనం గుండెల్లో ‘‘సారు’’..జూబ్లీ హిల్స్‌లో..’’కారుకే ఓటు’’.

`రాజ్యసభ సభ్యుడు ‘‘వద్దిరాజు రవిచంద్ర’’ చెబుతున్న..’’జూబ్లీహిల్స్‌ జనం మాట’’

`ఎవరి నోట విన్నా కారు కారునే గెలిపించుకుంటం

`ఓటుతోనే రౌడీ రాజకీయాల తిక్కకుదిరిస్తాం

`ఆరు గ్యారెంటీలలో ఒక్కటి కూడా అమలు చేయని దౌర్భాగ్యం

`రైతకు భరోసాకు ఆదిలోనే శఠగోపం

`రుణమాఫీ పచ్చి అబద్దానికి నిదర్శనం

`హైడ్రా పేరుతో హైదరాబాద్‌ సర్వనాశనం

`పేదల జీవితాలపై పగబట్టిన కాంగ్రెస్‌ పాపపు కాలం

`భస్మాసుర హస్తం… తెలంగాణకు శాపం!

`పచ్చగా వున్న తెలంగాణకు పట్టిన కాంగ్రెస్‌ దరిద్రం

`తొండి ప్రభుత్వం…తోడేళ్ల రాజకీయం

`ఒక్క చాన్స్‌ అంటే గెలిపించి వలవల ఏడుస్తున్న జనం

`కాంగ్రెస్‌ను నమ్మి నిండా మునిగిన ప్రజానీకం

`జూబ్లీ హిల్స్‌ దెబ్బకు హస్తానికి తద్దినం

`తెలంగాణలో కాంగ్రెస్‌ కనుమరుగు ఖాయం

`కాంగ్రెస్‌ మీద రైతుల్లో పెల్లుబికిన ఆగ్రహం

`మహిళల్లో కాంగ్రెస్‌ మీద పట్టలేనంత ఆవేశం

`కాంగ్రెస్‌ చెప్పిన వాగ్థానాలన్నీ అబద్ధం..

`అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌ నయ వంచన కుటిలత్వం

`కుర్చిల కొట్లాటల్లోనే కరుగుతున్న పుణ్యకాలం

`వాటాల పంపకాలలో మునిగితేలుతున్న మంత్రి వర్గం

`ఇంత మోసం చేసిన కాంగ్రెస్‌కు పాతాళమే శరణ్యం

`విద్యార్థులలో పెరుగుతున్న చైతన్యం

`నిరుద్యోగులలో పెరిగిన అసహనం

`రెండు లక్షల ఉద్యోగాల పేరు చెప్పి కాంగ్రెస్‌ చేసిన మోసం

`ప్రశ్నించే వారిపై కాంగ్రెస్‌ చూపిస్తున్న అధికార పైత్యం

`నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌ పైశాచికత్వం

`జూబ్లీ హిల్స్‌తో కాంగ్రెస్‌ పతనం

జూబ్లీహిల్స్‌ ప్రచారం జోరుగా సాగుతోంది. పాలక, ప్రతిపక్షాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. ప్రజలు ఏమనుకుంటున్నారు? బిఆర్‌ఎస్‌ ప్రచారం ఎలా వుంది? సునీత గెలుపు నల్లెరు మీద నడకే అని బిఆర్‌ఎస్‌ శ్రేణులే అంటున్నాయి.సారే రావాలి. కారే గెలవాలి. మళ్లీ తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే బిఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలి. అందుకు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నాంది పలకాలని ప్రజలు కోరుకుంటున్నారని బిఆర్‌ఎస్‌ శ్రేణులు చెబుతున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక మీద బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వద్ది రాజు రవిచంద్ర ప్రచార విశేషాలపై నేటి ధాత్రి ప్రత్యేక ఇంటర్వూ…

నేటిధాత్రి: నమస్తే రవిచంద్రగారు.

రవిచంద్ర: నమస్తే.

ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు :

జూబ్లీహిల్స్‌ ప్రచారం ఎలా సాగుతోంది?

జవాబు.. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : చాలా బాగా సాగుతోంది.
ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : జనం ఏమనుకుంటున్నారు..మీరేం అర్ధం చేసుకున్నారు?

జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : జనానికి పూర్తి స్పష్టత వుంది. ఎవరు గెలవాలి. ఎవరు ఓడాలి. ఎవరికి ఓటు వేయాలి. ఎవరిని ఓడిరచాలి అనే విషయంలో జూబ్లీహిల్స్‌ ప్రజలు స్ధిరనిర్ణయంతో వున్నారు. అది మేం ప్రచారానికి వెళ్లినప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. మా పార్టీ ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. జనం కూడా అంతే విదంగా బిఆర్‌ఎస్‌ ప్రచారానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. మాకు బస్తీలలో సాదర స్వాగతం పలుకుతున్నారు. అంతే కాదు మీరు ప్రచారానికి రాకున్నా గెలుస్తారంటూ ప్రజలే చెబుతుంటే ఎంతో సంతోషం అనిపిస్తోంది. అంటే జనం గుండెల్లో బిఆర్‌ఎస్‌ ఎంత బలంగా వుందో అర్ధం చేసుకోవచ్చు. కేసిఆర్‌ను ప్రజలు ఎంత మిస్‌ చేసుకుంటున్నారో కూడా ఈ సందర్భంగా తెలుస్తోంది. కేసిఆర్‌ పదేళ్ల పాలనలో ప్రజలు ఎంత సంతోషంగా వున్నారో, ఇప్పుడు ఎలా వున్నారో వారికి అర్ధమౌతోంది. కేసిఆర్‌ పాలనలో సమస్యలు లేవు. ఎలాంటి ఇబ్బందులు లేవు. రౌడీలు లేరు. ప్రజలను వేదించిన వారు లేరు. అప్పుడంతా సైలెంట్‌గా వున్నారు. భయంతో రౌడీలు దాక్కున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ రాగానే మళ్లీ రౌడీలు రాజ్యమేలుతున్నారు. కొన్ని బస్తీలలో ప్రజలు మాతో అనేక విషయాలు చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీనాయకులు, కార్యకర్తలు అరాచకాలు చేస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా నవీన్‌ యాదవ్‌ అనుచరులు తమ ఇష్టాను సారం వ్యవహరిస్తారని చెబుతున్నారు. వారిని కట్టడి చేయాలన్నా, తమ బస్తీలు మళ్లీ ప్రశాంతంగా వుండాలన్నా కేసిఆర్‌ సారు రావాలి. బిఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలి. మా ప్రాంతం చల్లగా వుండాలని కోరుకుంటున్నారు. రాత్రి వేళల్లో నవీన్‌ అనుచరులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు బస్తీలలో వుండే బైకులు కూడా ఎత్తుకెళ్తున్నట్లు కూడా కొంత మంది మహిళలు చెబుతున్నారు. రాత్రి సమయాల్లో గల్లీలలో తిరుగుతున్న వారిని చూస్తుంటే భయమేస్తుందని అంటున్నారు. సాయంత్రం సమాయాల్లో బైటకు రావాలంటే మహిళలు బెంబేలెత్తిపోతున్నారని అంటున్నారు. అంటే పరిస్ధితులు ఎలా వున్నాయో అర్దం చేసుకోవచ్చు. ప్రజలకు మళ్లీ ప్రశాంతమైన వాతావరణం రావాలంటే కేసిఆర్‌ వస్తేనే సాద్యమౌతుందని మహిళలు చెబుతున్నారు. అంటే మార్పు మార్పు అని కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను ఎంత మోసం చేసిందో అర్దం చేసుకోవచ్చు. అదికారంలోకి వచ్చి ప్రజలను ఎంత వేదిస్తుందో తెలుసుకోవచ్చు. అందుకే బస్తీలలో కాంగ్రెస్‌ నాయకులు ప్రచారానికి వెళ్లినప్పుడు ఇండ్ల నుంచి జనం బైటకు కూడా రావడం లేదు. ఇండ్ల బైట వున్న వాళ్లుకాంగ్రెస్‌ నాయకులను చూసి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటున్నారు. దాంతో ప్రస్టేషన్‌కు గురౌతున్న కాంగ్రెస్‌ నాయకులు బిఆర్‌ఎస్‌ నాయకులతో గొడవలు పడుతున్నారు. ప్రజలు బిఆర్‌ఎస్‌ నాయకులతో మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడే అర్ధం చేసుకోవచ్చు. ప్రజలు ఎవరి పక్షనా వున్నారో తేలిపోతోంది.

ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు అమలు చేసినట్లు చెబుతున్నారు? మీరేమో కాదంటున్నారు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : అబద్దాలు చెప్పడమే తెలిస్తే నోట్లో నుంచి వచ్చే మాటలన్నీ అబద్దాలే వుంటాయి. అసలు క్షేత్ర స్దాయి కాంగ్రెస్‌ కార్యకర్తలే ఆరు గ్యారెంటీలు ఏమిటో తెలియని దుస్తితి ఆ పార్టీది. ఆరు గ్యారెంటీలు అని చేతులు దులుపుకుందామనుకుంటున్నారు. కాని అందులో 13 గ్యారెంటీలున్నాయి. అవి ఇప్పుడు చెప్పడం లేదు. ఎన్నికల సమయంలో ఆరు అంటే పదమూడు అని చెప్పుకున్నారు. ఇప్పుడు అసలు ఆరు చెప్పుకోవడానికే కాంగ్రెస్‌ నాయకులు భయపడుతున్నారు. కలలో కూడా గుర్తుకొచ్చి వణుకుతున్నారు. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌ నాయకుల మొహం మీదనే అడుతున్నారు. మీకెందు ఓటెయ్యాలని కాంగ్రెస్‌ నాయకులను నిలదీస్తున్నారు. ఆరు గ్యారెంటీలలో ఒక్కటైనా అమలు చేశారా? అని ప్రశ్నిస్తున్నారు. దాంతో కాంగ్రెస్‌ నాయకులు తెల్ల మొహం వేసుకుంటున్నారు. సమాధానం చెప్పలేక పారిపోతున్నారు. అసలు కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం పేరుతో మా ముందుకు రావొద్దని అంటున్నారు. ఏమైనా అంటే ఉచిత బస్సు ఇస్తున్నామనే ముచ్చట తప్ప మరొకటి చెప్పుకోవడానికి లేదు. దాని వల్ల ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగమౌతున్నాయి. ఒకప్పుడు రెండు మూడు ఆటోలకు ఓనర్లు ఇప్పుడు వాటిని అమ్ముకుంటూ, కిరాయి ఆటోలు నడుపుకుంటున్నారు. పూట గడవక ఆందోళన చెందుతున్నారు. ఇక మిగతా గ్యారెంటీల అమలు ఎక్కడుందో తెలియదు. ఇస్తారన్న నమ్మకం ప్రజలకు లేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ను పొరపాటున ఆదరిస్తే ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ నరకం చూపించడం ఖాయం. ఆరు గ్యారెంటీలు అటకెక్కిస్తారు. ఆరు గ్యారెంటీలలో పించన్లు 4 వేలు ఇస్తామన్నారు. కాని ఇప్పటి వరకు వాటిని పెంచింది లేదు. కనీసం గతంలో కేసిఆర్‌ ఇచ్చిన రూ.2వేలు కూడా ఇప్పుడు కాంగ్రెస్‌ సకాలంలో ఇవ్వడం లేదు. దాంతో ప్రజలు ఆగ్రహంతోవున్నారు. అనవసరంగా నమ్మి మోసపోయామని అంటున్నారు. ఇవ్వలేనప్పుడు ఎందుకు చెప్పారంటూ కాంగ్రెస్‌ నాయకులను నిలదీస్తున్నారు. ప్రతి మహిళకు రూ.2500 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఆ పధకం అమలు గురించి ఆలోచనే లేదు. ఇస్తారన్న గ్యారెంటీ అసలే లేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకంలో లక్ష రూపాయలతోపాటు, తులం బంగారం ఇస్తామన్నారు. అది కూడా పెళ్లికి ముందే ఇస్తే పుస్తెలు చేయించుకోవచ్చన్నారు. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ తులం బంగారం ఇవ్వడం సాధ్యం కాదని చెప్పేశారు. ఇవ్వలేమన్నారు. మరో కాంగ్రెస్‌ నాయకుడు వి. హనునమంత రావు కూడా ఇదే విషయాన్ని తెల్చి చెప్పారు. అయినా జనం కాంగ్రెస్‌ను నమ్ముతారా? ప్రతి విద్యార్ధినికి ఒక ఎలక్రిక్‌ స్కూటీని ఇస్తామన్నారు. ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఇవ్వాలన్న చిత్తశుద్దికూడా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి లేదు.
ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : బిఆర్‌ఎస్‌కు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయని సిఎం. రేవంత్‌ అంటున్నారు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : బిఆర్‌ఎస్‌కు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయని కాదు. ఆపేస్తామని సిఎం. రేవంత్‌ రెడ్డి ప్రజలను బెదిరించారు. ఒక ముఖ్యమంత్రి ప్రజలను అలా బెదిరించడం ఎక్కడైనా చూశామా? అంటే జనమంటే కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి ఎంత చిన్న చూపో అర్ధం చేసుకోవచ్చు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయ్యకపోతే సన్న బియ్యం ఆపేస్తామని నేరుగానే బెదిరిస్తున్నారు. కాంగ్రెస్‌ను గెలిపించకపోతే ఉచిత కరంటు ఆగిపోతుందన్నారు. రేషన్‌ కార్డులు కట్‌ చేస్తామంటున్నారు. నిజంగా కాంగ్రెస్‌కు ఓటేస్తేనే ఇవన్నీ ఆగిపోతాయని చెప్పాలి. ఆరు గ్యారెంటీలు ఎలాగూ అమలు చేయడంలేదు. అందులో సన్న బియ్యం ఇవ్వడం ప్రభుత్వానికి సాద్యంకావడం లేదు. సన్న బియ్యం కూడా మూడునాళ్ల ముచ్చటలాగే కనిపిస్తోంది. 200 యూనిట్ల ఉచిత కరంటు ఎక్కడా రావడం లేదు. కాని ప్రభుత్వం దొంగ ప్రచారం చేసుకుంటోంది. రేషన్‌కార్డులు రిటన్‌ తీసుకుంటామని బెదిరిస్తేజనం భయపడతారనుకోవడం రేవంత్‌ రెడ్డి భ్రమ. ప్రజలు పెట్టిన భిక్షతోనే సిఎం. అయిన రేవంత్‌ రెడ్డి ప్రజలను బెదిరిస్తే ఊరుకుంటారా? మహా మహా నాయకులనే ప్రజలు ఓడిరచారు. రేవంత్‌రెడ్డి ఎంత? రేవంత్‌ రెడ్డి ఎక్కడికెళ్లినా జనం రావడం లేదు. రోడ్‌షోలు పెట్టినా జనం హజరు కావడం లేదు. చిత్రపురిలో సభ పెడితే కార్మికులు రాలేదు. ఇలా సిఎం. రేవంత్‌రెడ్డి ప్రచారానికి జనం రాకపోవడంతో ఆయనకు మరింత ప్రస్టేషన్‌ పెరిగిపోతోంది. అదే సమయంలో బిఆర్‌ఎస్‌ రోడ్‌షోలకు జనం ఇసకేస్తే రాలనంత వస్తున్నారు. పైగా జోరు వానలో కూడా జనం రోడ్‌షోలో పాలు పంచుకుంటున్నారు. వర్షంలో కూడా డ్యాన్సులు చేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్‌ నాయకులకు, ముఖ్యంగా సిఎం. రేవంత్‌రెడ్డికి కంటి మీదకి కునకు రావడం లేదు. రేవంత్‌ రెడ్డి మాట్లాడుతుంటే జనం వినడం లేదు.

ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : నన్ను చూసి ఈ ఒక్కసారి గెలిపించండి! అని రేవంత్‌ రెడ్డి అంటున్నారు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : ఇది వరకు నమ్మే తెలంగాణ ప్రజలు నిండా మునిపోయారు. రేవంత్‌ రెడ్డి మాటలు నమ్మి మోస పోయారు. ఆరు గ్యారెంటీలంటూ అబద్దాలు చెబితే నమ్మారు. ఇంకా నమ్మమంటే ఎలా నమ్ముతారు? ఎందుకు నమ్ముతారు? ఇది ప్రజాస్వామ్యం. పైగా ఈ రెండేళ్ల కాలంలో ఆయన ఒక్క నిజమైనా మాట్లాడారా? జనానికి పనికొచ్చే పని ఒక్కటైనా చేశారా? మచ్చుకు కూడా చెప్పుకోవడానికి ఒక్కటైనా వుందా? ఏ రంగమైనా ముందట పడిరదా? అన్ని ఫెయిల్యూర్లే. రుణమాఫీ చేస్తామన్నారు. చేశామని గొప్పలు చెప్పుకున్నారు. కాని రైతులేమంటున్నారో కాంగ్రెస్‌ నాయకులకు తెలియదా? కాంగ్రెస్‌ నాయకులకే రుణమాఫీ జరగలేదని చెప్పుకుంటున్నారు. రైతు భరోసా రూ.15వేలు ఇస్తామన్నారు. కనీసం గతంలో కేసిఆర్‌ ఇచ్చిందికూడా ఇవ్వడం లేదు. అది కూడా అందరికీ అందడం లేదు. ఇప్పటికే రెండు విడుతల బాకీ వున్నారు. మేమైనా దివానాగాళ్లమా? రైతు బంధు ఎందుకు ఆపేస్తామని సభల్లో రేవంత్‌ రెడ్డి అన్నారు. కేసిఆర్‌ ఇస్తున్న పది వేలకు బదులు రూ.15 వేలు ఎకరానికి ఇస్తామన్నారు. పాపం రైతన్నలు నమ్మారు. రేవంత్‌రెడ్డి ముందు నుంచి మోసం చేస్తానని చెబుతూనే వున్నారు. కాని ప్రజలు అమాయకులు నమ్మారు. కాని ఇంకా మోసం చేస్తామంటే, మోస పోవడానికి ప్రజలు సిద్దంగా లేరు. కౌలు రైతులకు కూడా ఏటా రూ.12000 ఇస్తామన్నారు. ఇలా ఎన్ని ఎన్ని అబద్దాలు ఆడారో తెలియంది కాదు. అందుకే ఆరు గ్యారెంటీలే కాదు, కాంగ్రెస్‌ ఇచ్చిన మొత్తం హమీలు 420. అంటేనే ఇక్కడే తేలిపోయింది. ఆ హమీలు అమలు కావన్నది అప్పుడే కాంగ్రెస్‌ చెప్పింది. కాని రాహుల్‌ గాందీ, ప్రియాంక గాందీ, సోనియా గాందీలను రప్పించి అబద్దాలు చెప్పించారు. జనాన్ని నమ్మించారు. ఒక్కసారి ఒక్క అవకాశం ప్లీజ్‌ ప్లీజ్‌ అంటూ రేవంత్‌ రెడ్డి బ్రతిమిలాడాడు. ఇప్పుడు ఓటెయ్యకపోతే పథకాలు అపేస్తామని బెదిరిస్తున్నాడు. అందుకే జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌ను తక్కు తుక్కుగా ఓడిరచేందుకు సిద్దపడుతున్నారు. పిక్సైయ్‌ వున్నారు.
ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : నన్ను చూసి ఓటెయ్యమని రేవంత్‌ అంటున్నాడు! నన్ను చూసి ఓటెయ్యమని నవీన్‌ అంటున్నాడు? జనం ఎవరిని చూసి ఓటేస్తారని అనుకుంటున్నారు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : ఈ ఇద్దరినీ చూసి కాంగ్రెస్‌కు ప్రజలు ఒక్క ఓటు కూడా వేయరు. రేవంత్‌రెడ్డిని నమ్మి ఇప్పటికే మోసపోయారు. అయినా ప్రజలు మోసపోయేందుకు సిద్దంగా లేరు. ఇక కాంగ్రెస్‌ అభ్యర్ది నవీన్‌ యాదవ్‌ గురించి బస్తీలలో ప్రజలే మాట్లాడుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఒప్పించుకోవాలి. మెప్పించుకోవాలి. గెలిస్తే ఏం చేస్తామనే విషయాలు చెప్పాలి. అంతే కాని బిఆర్‌ఎస్‌ నాయకుల మీద దాడులు చేస్తే ప్రజలు ఓట్లేస్తారా? బిఆర్‌ఎస్‌ నాయకులు ఇళ్లలో నుంచి బైటకు రారు. బైటకు వెళ్తే ఇంటికి రారు అని బెదిరిస్తుంటే జనం ఒప్పుకుంటారా? ఓట్లేస్తారా? రాజకీయ ప్రత్యర్ధుల మీద ఇలాంటి రౌడీ భాషలు మాట్లాడుతుంటే ఈసి స్పందించాలి. రేవంత్‌ రెడ్డిని చూసి ఎందుకు ఓటేయ్యాలి? అనేది జనానికి స్పష్టత వుంది. ఓటు కాంగ్రెస్‌కే వేసే ప్రసక్తి లేదని నిర్ణయం తీసకొని వున్నారు. పోలింగ్‌ రోజున బిఆర్‌ఎస్‌కు, కారు గుర్తుకు ఓటేయ్యాలని సిద్దంగా వున్నారు. అందుకే రేవంత్‌ రెడ్డి ప్రస్టేషన్‌లోకి వెళ్లిపోతున్నాడు. జూబ్లీహిల్స్‌ ఓడిపోతే తన పదవి కాస్త ఊడిపోతుందని భయం పట్టుకున్నది. అందుకే అడ్డదారులు తొక్కైనా సరే గెలవాలిన కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడు. కాని కుదరడం లేదు. జనం ఆదరించడం లేదు. ఖర్మ పాలోస్‌ అన్నట్లు ఏ నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని బిఆర్‌ఎస్‌ మీద కాంగ్రెస్‌ పార్టీ అసత్య ప్రచారం చేసిందో అదే నిరుద్యోగులు ఇప్పుడు కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తున్నారు. సిఎం. రేవంత్‌రెడ్డికి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. పెద్దఎత్తున నిరుద్యోగ జేఏసి కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని ప్రచారం సాగిస్తోంది. గత ఎన్నికల్లో నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి రెండు లక్షల ఉద్యోగాలిస్తామని నమ్మించి వారిని తప్పు దోవ పట్టించారు. ఇప్పుడు నిజం తేలింది. కాంగ్రెస్‌ నిరుద్యోగులను మోసం చేసింది. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెట్టిన పరీక్షల ఫలితాలను ప్రకటించి, ఆ ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు ప్రకటించుకోవడాన్ని నిరుద్యోగులే సహించలేకపోతున్నారు. పైగా నోటిఫికేషన్లు వేయకుండా, ఆ నెపం నిరుద్యోగుల మీదే నెట్టేస్తూ సిఎం. రేవంత్‌ రెడ్డి అసత్య ప్రచారం సాగిస్తున్నారు. వరస నోటిఫికేషన్లు నిరుద్యోగులే వద్దంటున్నారంటూ సాక్ష్యాత్తు సిఎం. రేవంత్‌ ఇంత పచ్చి అబద్దాలు ఆడడాన్ని తెలంగాణ యువత జీర్ణించుకోలేకపోతోంది. అంతే కాకుండా గ్రూప్‌ వన్‌లో ఏం జరిగిందో చూస్తూనే వున్నారు. గ్రూప్‌ 2లో ఎలాంటి అవతకవకలు జరిగాయో నిరుద్యోగులే చెబుతున్నారు. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి.
ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : అభివృద్ది అంటే ఏమిటో చూపిస్తానని రేవంత్‌ రెడ్డి అంటున్నారు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : అసలు అభివృద్ది అంటే అర్ధం కూడా తెలియని పాలకుడు రేవంత్‌రెడ్డి. రెండేళ్ల కాలంలో తెలంగాణలో చేసిన ఒక్క మంచి పని చూపించండి. ఒక్కటంటే ఒక్కటే..అలాంటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివృద్ది అంటే ఏమిటో చేసి చూపిస్తానంటే ఎవరు నమ్ముతారు. అయినా అదికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చెబుతున్నారో చూడడం లేదా? మాకు చేతిలో చిల్లి గవ్వలేదంటున్నారు. సిఎం. ఇవ్వడం లేదంటున్నారు. మరో వైపు సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలంగాణకు వస్తున్న ఆదాయం 18500 కోట్లు అంటున్నారు. అంతకు మించి ఒక్క రూపాయి రావడం లేదని స్వయంగా ఆయన చెబుతున్నారు. నన్ను కోసినా ఒక్క రూపాయి లేదనంటున్నాడు. బ్యాంకులకు వెళ్తే చులకనగా చూస్తున్నారని అంటున్నాడు. డిల్లీకిపోతే అప్పాయింటు మెంటు కూడా ఇవ్వడం లేదంటున్నాడు. ఎక్కడ చెప్పులు ఎత్తుకుపోతారో అన్నట్లు చూస్తున్నారని సిఎం. రేవంత్‌రెడ్డే అంటున్నాడు. అలాంటి సిఎం. రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లో అభివృద్ది అంటే ఏమిటో చూపిస్తామంటున్నారు. అంటే జనం అంత వెర్రిబాగులోల్లా? అయినా రేవంత్‌ రెడ్డి తెలంగాణ మొత్తానికి సిఎం అనుకుంటున్నాడా? లేక జూబ్లీహిల్స్‌కు సిఎం. అనుకుంటున్నాడో ఆయనకే క్లారిటీ లేదు. తన సొంత జిల్లా పాలమూరు ఎమ్మెల్యేలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. పెళ్లిళ్లకు, చావులకు వెళ్లాలంటే కూడా భయపడుతున్నామని ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి అంటున్నారు. లక్ష రూపాయల పనులు కూడా సాంక్షన్‌ చేయాలంటే ధైర్యం చేయలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధులు ఇవ్వకపోవడంతో జనం ముందుకు వెళ్లాలేక ముఖం చాటేస్తున్నామని చెబుతున్నాడు. పల్లెల్లో పారిశుద్యం కరువైందని స్వయంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అంటుంటే, జూబ్లీహిల్స్‌ అభివృద్ది చేస్తామనడం హాస్వాస్పదం కాదా? ఇంతకన్నా అబద్దం మరొకటి వుంటుందా? కంటోన్‌మెంట్‌ ఉప ఎన్నికల్లో ఇలాగే అబద్దాలు చెప్పి గెలిచారు. కంటోన్‌ మెంట్‌లో వేల కోట్లు ఖర్చు చేస్తున్నామంటున్నారు. అదే నిజమైతే ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్‌ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారు. ఆయన నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వడంలేదు? నోరు తెరిస్తే అబద్దాలు తప్ప ఒక్క నిజం రేవంత్‌ రెడ్డి నుంచి రాదు. ఇది జనానికి ఎప్పుడో తెలిసిపోయింది. ఇంకా బుకాయిస్తామంటే ఎవరూ నమ్మరు. ప్రజలు చాల చైతన్యవంతులు.
ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : సునీత విషయంలో మంత్రుల వ్యాఖ్యలు ఎలా అర్ధం చేసుకోవచ్చు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : అసలు వాళ్లు మనుషులేనా? కనీసం మానవత్వం వారికి వుందా? ఒక మహిళగురించి ఇలాగే మాట్లాడతారా? జూబ్లీహిల్స్‌ బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి సునీత భర్తను పోగొట్టుకొని వుంది. ఆరు నెలల సమయం కూడా కాలేదు. జనం ముందుకు వచ్చినప్పుడు, ప్రజలు గుర్తు చేస్తున్నప్పుడు సహజంగా ఏ మహిళనైన కన్నీళ్లు ఆపుకోలేదు. దాన్ని కూడా రాజకీయం చేయడం కాంగ్రెస్‌ పార్టీకే చెల్లింది. ఇలాంటి దుష్ట రాజకీయాలు మంత్రులు చేస్తుంటే ప్రజల చీ కొడుతున్నారు. సానుభూతి కోసం సునీత కన్నీళ్లు పెట్టుకుంటుందంటూ దిగజారుడు రాజకీయాలు కాంగ్రెస్‌ చేయడం దుర్మార్గం. అందుకే ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి బుద్ది చెప్పడానికి సిద్దంగా వున్నారు. కాంగ్రెస్‌ రాజకీయానికి చరమగీతం పాడేందుకు రెడీగా వున్నారు.
ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : రోడ్డు షోలకు జనం ఎగబడుతున్నారు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : బిఆర్‌ఎస్‌ పార్టీకి జనం నీరాజనం పలుకుతున్నారు. బ్రహ్మరథం పడుతున్నారు. బిఆర్‌ఎస్‌ ప్రచారంలో స్వయంగా ప్రజలే పాలు పంచుకుంటున్నారు. ఇంతకన్నా ఒక పార్టీకి గొప్ప సమయం ఏముంటుంది. అంతగా బిఆర్‌ఎస్‌ ప్రజల్లో వుంది. కేసిఆర్‌ కోసం తపిస్తున్నారు. మళ్లీ కేసిఆర్‌ పాలన రావాలనుకుంటున్నారు. అది మళ్లీ జూబ్లీహిల్స్‌ నుంచే నాంది కావాలని చూస్తున్నారు. అందుకు ఈ ఉప ఎన్నికలను వేదిక చేసుకుంటున్నారు. సునీత గెలుపు నల్లేరు మీద నడకే.. మెజార్టీ కోసమే మా ప్రచారం. ఇక కేటిఆర్‌ రోడ్‌ షోలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. నిజం చెప్పాలంటే జూబ్లీహిల్స్‌లో వున్న ఏడు డివిజన్ల ప్రజలు స్వచ్చందంగా రోడ్‌షోలకు తరలి వస్తున్నారు. కేటిఆర్‌ చెప్పే మాటలు వినడానికి వస్తున్నారు. కేటిఆర్‌ను చూడాలని జనం ఎగడతున్నారు. అసలు రోడ్‌ షోలకు వస్తున్న ప్రజలను చూసి కాంగ్రెస్‌ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వేలాది మంది జనంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. జనమే కేసిఆర్‌ పాటలు పెడుతున్నారు. కేరింతలు కొడుతున్నారు. డ్యాన్సులు చేస్తున్నారు. కేసిఆర్‌, కేసిఆర్‌ అంటూ నినాదాలు చేస్తున్నారు. చిన్న పిల్లలు సైతం బిల్డింగుల మీద నుంచి చూస్తూ, కేటిఆర్‌కు సెల్యూట్‌ చేస్తున్నారు. నమస్తే అంటుంటే పిల్లల్లో కూడా కేసిఆర్‌, కేటిఆర్‌ అంటే ఎంత అభిమానముందో తెలుస్తోంది. నిజంగా అంత మంది జనాలు వస్తున్నారంటే కేసిఆర్‌ పాలన లేని లోటు వారికి స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు రోడ్‌ షోలకు వస్తున్న ఆదరణ అంతా ఇంతా కాదు. 2015లో ముస్సిపల్‌ ఎన్నికల సమయంలో కేటిఆర్‌ను చూసేందుకు జనం ఎలా ఎగబడ్డారో అంతకు మించి ఇప్పుడు వస్తున్నారు. బోరబండలో వచ్చిన జనాన్ని చూస్తే మతిపోతుంది. అలాగే అన్ని డివిజన్లలో కూడా రోడ్‌ షోలు ఎంతోవిజయవంతమౌతున్నాయి.
ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : జనం కేసిఆర్‌ను ఎంతగా గుర్తించుకున్నారు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : జూబ్లీహిల్స్‌లో వుంటే ప్రజానీకానికి పల్లె గురించి తెలియంది కాదు. పట్నం జీవితం తెలియంది కాదు. ఆ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ గురించి మొత్తం తెలుసు. ఎందుకంటే జూబ్లీహిల్స్‌లోని ఏడు డివిజన్లలో తెలంగాణ పల్లెలనుంచి వచ్చినా ఇప్పటికీ ఆ మూలాలున్న వాళ్లు ఎక్కువ. వారికి పల్లెలతోఇప్పటికీ అనుబంధం వుంది. చాలా మందికి పల్లెల్లో భూములన్నాయి. ఇండ్లున్నాయి. అందువల్ల మేం ప్రచారానికి వెళ్లినప్పుడు ఒకప్పటి తెలంగాణ ఎలా వుండేది? కేసిఆర్‌ తెచ్చిన తెలంగాణ ఎలావుంది అనేది పూసగుచ్చినట్లు చెబుతున్నారు. పల్లెల్లో తెలంగాణ రాకముందు పడిన కష్టాలు ఏమిటో వారికి పూర్తిగా తెలుసు. పల్లెల్లో బతకలేక పట్నం వచ్చి ఇక్కడ చిన్నా చితకా వ్యాపారాలు, పనులు చేసుకుంటూ ఇక్కడే స్ధిరపడిన వారున్నారు. అయినా వారికి పల్లెల్లోనే బంధువులు, అయిన వారున్నారు. ఇక్కడి పరిస్దితులు, అక్కడి పరిస్దితులు అందరికీ తెలుసు. అందుకే కేసిఆర్‌ తెలంగాణ తేకముందు, తెచ్చిన తర్వాత అన్ని విషయాలు వాళ్లే మాకు చెబుతున్నారు. ప్రచారానికి ఉదయం వెళ్లి ఒక గల్లీ మధ్నాహ్నం వరకు ప్రచారం అక్కడ ముగిద్దామనుకుంటే నాలుగు ఇండ్లు దాటి వెళ్లలేకపోతున్నాం. అంటే ఆ ప్రజలు మమ్మల్ని చూసిన తర్వాత కేసిఆర్‌ను చూసినట్లు భావిస్తున్నారు. మాతో మాట్లాడుతుంటే కేసిఆర్‌తో మాట్లాడుతున్నట్లే అనుకుంటున్నారు. అంతలా కేసిఆర్‌ను జూబ్లిహిల్స్‌ ప్రజలు అభిమానిస్తున్నారు. ఒకప్పుడున్న కష్టాలకు ఇప్పుడు కేసిఆర్‌ వచ్చిన తర్వాత లేవని గుర్తు చేస్తున్నారు. కేసిఆర్‌ తెచ్చిన పథకాలను మాకే గుర్తు చేస్తున్నారు. వాటి వల్ల వారి జీవితాల్లో వచ్చిన మార్పులను గురించి చెబుతున్నారు. రైతు బంధు దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని రకాల సౌకర్యాలు చెబుతున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌లో వుండే పేదల బస్తీలకు ఒకప్పుడు వారం రోజులకు కూడా సరైన మంచినీటి సరఫరా వుండేదికాదు. ఎండా కాలం జూబ్లిహిల్స్‌ ప్రజలు మంచినీటి కోసం పడే కష్టం అంతా ఇంతా కాదు. బోర బండ మీదకు రోడ్లు వేయడంతోపాటు, మంచినీటి సౌకర్యం కల్పించిన తీరు అద్భుతం. అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. రోజుకూ 20వేల లీటర్ల మంచినీరు అందుతోంది. అంతకుముందు వారం రోజులకు నీళ్లు వచ్చినా, తాగేందుకు మాత్రమే సరిపోయేవి. ముఖ్యంగా పించన్లు పొందుతున్న పెద్దలు మాత్రం కేసిఆర్‌ను దేవుడిలాగా కొలస్తున్నారు. ఇక వైద్యసేవల విషయంలో ఒకప్పుడు ఎలా వుండేది? ఇప్పుడు ఎలా వుందనేది గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చేసిన సహాయం అంతా ఇంత కాదు. ఒకప్పుడు మహిళ పురుడు పోసుకునే వరకు పడే ఇబ్బందులు అయ్యే ఖర్చులు తల్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి నెల ప్రభుత్వమే ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లోనే మందులు ఇస్తున్నారు. ప్రసవ సమయంలో ప్రభుత్వ వాహనం వస్తుంది. గర్బిణీ మహిళను తీసుకెళ్తుంది. ప్రసవం తర్వాత మళ్లీ ఇంటి దగ్గర దింపుతుంది. పైగా కేసిఆర్‌ ప్రసవమైన తర్వాత రూ.13వేలు ఇచ్చారు. కేసిఆర్‌ కిట్‌ ఇచ్చారు. కాని ఇప్పుడు అవి ఇవ్వడం లేదు. దాంతో ప్రజలు మళ్లీ ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందంటున్నారు. ఇలా ప్రతి సమస్యను చెప్పుకుంటూ కాంగ్రెస్‌ను తూర్పారపడుతున్నారు.
ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : ఎంత మెజార్టీతో గెలుస్తున్నారు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : ఊహించనంత మెజార్టీ సొంతం చేసుకుంటాం. జూబ్లీహిల్స్‌ నుంచి మళ్లీ విజయయాత్ర కొనసాగిస్తాం. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ జెండా ఎగరేస్తాం. కేసిఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూస్తాం.
నేటిధాత్రి: ఆల్‌ది బెస్ట్‌.
రవిచంద్ర: ధంక్యూ..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version