ఈ నెల 20 న సార్వత్రిక సమ్మెకు మద్దత్తుగా గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్
కరీంనగర్ నేటిధాత్రి:
దేశంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, వ్యవసాయ, రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 20 తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దత్తుగా గ్రామాల్లో వ్యవసాయ కూలీలు గ్రామీణ బంద్ నిర్వహించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల సమావేశం జరిగింది. ఈసందర్బంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ చాయ్ వాలా పేరుతో దేశంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా నిర్లక్ష్యం చేస్తూ, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ, హక్కులను హరిస్తున్నారని, నలబై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తెచ్చారని, ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ దేశ సంపదను అధాని, అంబానిలకు కట్టబేడుతున్నారని ఆరోపించారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పెద బడుగు బలహీన వర్గాలకు చేతి నిండా పని కల్పించాలనే లక్ష్యంతో యుపిఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అమలు చేసి కోట్లాది మంది కూలీలకు పని కల్పిస్తుంటే నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపులో కోత విధిస్తున్నారని, పని రోజులు తగ్గిస్తున్నారని, పని ప్రదేశాల్లో పనికి ముందు పనికి తర్వాత కూలీలను ఫోటో అప్లోడ్ చేసే విదానాన్ని తెచ్చారని అన్నారు. ఉపాధి కూలీలకు రెండు వందల రోజుల పని కల్పించాలని, రోజు వారి కూలీ ఆరు వందలు చెల్లించాలని, వేసవి భృతి యధావిధిగా కొనసాగించాలని, పని ప్రదేశాల్లో కొలుతలు లేకుండా పని కల్పించి బిల్లులు చెల్లించాలని, ఆధార్, జాబ్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనుసంధానం చేయడం ఆపాలనే, ఉపాధి కూలీలకు ఇన్స్యూరెన్స్ అవకాశం కల్పించాలని, ఉపాధి హామీ పథకం రద్దు చేసే కుట్రలను మానుకోవాలని కోరుతూ 20 వ తేదీన కూలీలు ఉపాధి హామీ పనులను బంద్ చేసి దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్ ను జయప్రదం చేయాలని సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. ఈసమావేశంలో బికెయంయు జిల్లా అధ్యక్షులు బోయిని అశోక్, ఏఐఏడబ్లుయు జిల్లా ఉపాధ్యక్షులు రాయికంటి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి సుంకరి సంపత్, నాయకులు నల్లగొండ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.