భారత్ సంస్కృతుల సంగమం…!
– మహామండలేశ్వర్ సిద్దేశ్వరానందగిరి
– వైభవంగా శ్రీ కాలభైరవ విగ్రహ ప్రతిష్టాపన
– హాజరైన ప్రముఖ పీఠాధిపతులు
– భక్తిశ్రద్ధలతో ముగిసిన ఉత్సవాలు
జహీరాబాద్. నేటి ధాత్రి:
భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు వేర్వేరుగా ఉన్న అన్ని మతాలు, వర్ణాలు, కులాల, వర్గాల సమష్టి కలయిక అని మహామండలేశ్వర్ బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 1008 డాక్టర్. మహంత్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ పేర్కొన్నారు. వివిధ భాషలు, మతాలు, సంగీతం, నృత్యం, ఆహారం, నిర్మాణ కళ , ఆచారాలు, వ్యవహారాలు దేశంలో ఒక్కో ప్రాంతానికి ఎంతో భిన్నంగా ఉంటాయన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని ధర్మాపూర్ లో వెలసిన శ్రీ లలిత కోటి పార్దివ లింగ దేవస్థానంలో శ్రీ శ్రీ కాలభైరవ ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పంచవటి కాశీనాథ్ బాబా, బసవలింగ అవధూత గిరి మహారాజ్, వీరేశ్వర శివాచార్య మహా స్వామీజీ, రాచయ్య స్వామి తదితరులు హాజరయ్యారు.
దేవాలయంలో గణపతి పూజ, గోపూజ, రుద్రాభిషేకం అనంతరం వేద బ్రాహ్మణులు నిర్ణయించిన శుభమూర్తము ఉదయం 8:30 నిమిషాలకు శ్రీ కాలభైరవ ధ్వజస్తంభం విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వివిధ ఆశ్రమాల పీఠాధిపతులు మాట్లాడుతూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా భక్తులు నాలుగు రకాలు ఉంటారని వారు ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్థార్థి, జ్ఞానులు ఉంటారన్నారు.
ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుచుకోవాలని భక్తులకు పిలుపునిచ్చారు. భగవత్ నామస్మరణతోనే మనిషికి ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు, గురువులు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని భక్తులకు పిలుపునిచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థాన వ్యవస్థాపకులు సుధీర్ పాటిల్, దేవాలయ కమిటీ అధ్యక్షులు నేతి జ్ఞానేశ్వర్, ఓం ప్రకాష్ గోయల్, భీమన్న పాటిల్, హరీష్ పాటిల్, దినేష్ పాటిల్ గ్రామస్తులు భక్తులకు తగు ఏర్పాట్లు చేశారు.