హమాలీ కార్మికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి
నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కు వినతిపత్రం.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట వ్యవసాయ మార్కెట్ లో పనిచేయుచున్న హమాలీ కార్మికులకు వెంటనే సభ్యత్వం ఇచ్చి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ఏఐఎఫ్టియు (న్యూ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మోడెం మల్లేశం గౌడ్ కోరారు. ఈ మేరకు అఖిలభారత కార్మిక సంఘాల సమైక్య (న్యూ) అనుబంధ వ్యవసాయ మార్కెట్ హమాలి కార్మిక సంఘం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ కు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఏఐఎఫ్టీయూ (న్యూ) రాష్ట్ర అధ్యక్షులు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు గత కొన్ని సంవత్సరాల క్రితం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సభ్యత్వం మరియు గుర్తింపు కార్డులు ఇచ్చారని ఆనాటి నుండి నేటి వరకు రెన్యువల్ చేస్తున్నారే తప్ప నూతన సభ్యత్వం గుర్తింపు కార్డులు ఇవ్వడంలేదని ఆరొపంచారు.వివిధ ముఠాలలో పనిచేయుచున్న హమాలీ కార్మికులు 60 యేండ్లు పైబడినవారు హమాలీ పనులు చేయలేక పనిని మానుకోవటం, కొంతమంది కార్మికులు అనారోగ్యములతో మరణించటం,కొంతమంది పనుల నుండి వెళ్లిపోవడం జరుగుచున్నది వారి స్థానంలో వచ్చిన కార్మికులకు ప్రభుత్వం నుండి రావలసిన బట్టలు, తదితర రాయితీలు పొంద లేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా మార్కెట్ చైర్మన్, మార్కెట్ కమిటీ కార్యదర్శి స్పందించి
నూతన సభ్యత్వం ప్రభుత్వ గుర్తింపు కార్డులు అందజేయాలని మల్లేష్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం పట్టణ అధ్యక్షులు మంద మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మెరుగు జనార్ధన్, కోశాధికారి బొల్లెన రమేష్, సంఘం నాయకులు ఇప్ప బాబు, ఎద్దు రాములు, రమేషు, రవీందర్, కుమారస్వామి, రాజు, వెంకన్న, సతీష్, వీరన్న, రాజాలు రమేష్ తదితరులు పాల్గొన్నారు.