ఆరోగ్యకర జీవనశైలి – పర్యావరణ హిత వినియోగంపై వర్క్షాప్
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు పర్యావరణ అవగాహన
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో ఏకో క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ చైతన్యంపై ప్రత్యేక అవగాహన వర్క్షాప్ నిర్వహించారు. తెలంగాణ పర్యావరణ పరిరక్షణ సంస్థ అనుబంధంగా, తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్స్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మిల్లెట్స్, ఫ్రూట్ సలాడ్ వినియోగం, ప్లాస్టిక్ నిషేధం, జూట్ బ్యాగుల తయారీ, పేపర్ వినియోగ ప్రాధాన్యత వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవరచుకోవడంతో పాటు ప్రకృతికి మేలు చేసే జీవనశైలిని అవలంబించాలని సూచించారు. మిల్లెట్స్ వినియోగం ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ప్లాస్టిక్ వినియోగం ప్రకృతికి హానికరమని తెలిపారు. గ్రామస్థాయిలో సేంద్రియ ఆహారాలపై కూడా అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు.కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి సత్యనారాయణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ఒకరోజు కార్యక్రమం కాదని, ప్రతి రోజు పాటించాల్సిన జీవన విధానమని తెలిపారు. ప్లాస్టిక్కు బదులుగా జూట్ బ్యాగులు, పేపర్ ఉత్పత్తులు, సహజ వనరులతో తయారైన వస్తువులు ఉపయోగించడం ద్వారా ప్రకృతిని కాపాడవచ్చని చెప్పారు.అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ కందాల సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి పర్యావరణ అవగాహన కూడా ఎంతో అవసరమని, సహజ ఆహారాలు మరియు పర్యావరణ హిత వస్తువుల వినియోగం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.ఏకో క్లబ్ కన్వీనర్ డాక్టర్ ఎం. రాంబాబు మిల్లెట్స్ వినియోగం, ఫ్రూట్ సలాడ్ ఆరోగ్య ప్రయోజనాలు, ప్లాస్టిక్ వల్ల కలిగే దుష్పరిణామాలు, జూట్ బ్యాగుల తయారీ విధానం, పేపర్ వినియోగ ప్రాముఖ్యత వంటి అంశాలపై విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఎస్. కమలాకర్, స్టాఫ్ సెక్రటరీ రహీముద్దీన్, అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
