కాశీబుగ్గలో ఘనంగా హిందూ ధర్మ సమ్మేళనం ఏర్పాట్లు
కాశీబుగ్గ, నేటిధాత్రి:
కాశీబుగ్గలో హిందూ ధర్మ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ శనివారం సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీ కాశీ విశ్వేశ్వర రంగనాథ స్వామి ఆలయం ఎదుట “హిందూ ధర్మ సమ్మేళనం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమితి అధ్యక్షులు కాంచనపల్లి కృష్ణాకర్ రాజు తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, ఈ సమ్మేళనానికి బ్రహ్మశ్రీ జ్ఞాన చైతన్యానంద స్వామీజీ (శ్రీ జగద్గురు గీతా ఆశ్రమం), తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది కశింశెట్టి కరుణా సాగర్, ఢిల్లీ మెహరౌలి ప్రాంతానికి చెందిన మాతృశక్తి సంయోజిక నీలం నిర్మల హాజరై జాతీయ సమైక్యత, ధార్మిక విలువలు, దేశభక్తి అంశాలపై ప్రసంగాలు చేయనున్నట్లు తెలిపారు.
సమితి గౌరవ అధ్యక్షులు గోనె జగదీశ్వర్ మాట్లాడుతూ, సనాతన ధర్మ పరిరక్షణ, సంప్రదాయాల పరిరక్షణ, సామాజిక ఐక్యత పెంపొందించడం లక్ష్యంగా ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నామని చెప్పారు.
ప్రధాన కార్యదర్శి ములుకుంట్ల విష్ణు మాట్లాడుతూ, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని, వేలాది భక్తులతో కలిసి భారతమాత హారతి నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
సమితి గౌరవ సలహాదారు సముద్రాల పరమేశ్వర్ మాట్లాడుతూ, మహిళలకు జోగులాంబ అమ్మవారి ఆలయం నుండి తీసుకువచ్చిన గాజులు, కుంకుమలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
అలాగే, ఏప్రిల్ 17న శుక్రవారం సాయంత్రం 5 గంటలకు శోభాయాత్ర నిర్వహించనున్నట్లు సమితి వెల్లడించింది.
ఈ ప్రెస్ మీట్లో కోశాధికారి మండల చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు రాపెల్లి బాలరాజు, కార్యవర్గ సభ్యులు గోగికార్ శ్రావణ్, మార్త సందీప్, గోగికార్ క్రాంతి, మడిపల్లి నాగరాజు గౌడ్ తదితరులు, అలాగే మహిళా సభ్యులు పాల్గొన్నారు.
