మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు: ఎమ్మెల్యే నాయిని..

మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు: ఎమ్మెల్యే నాయిని..

#మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్ విడుదల..

#భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు..

#మున్సిపల్ కమిషనర్‌తో కలిసి ఏర్పాట్ల క్షేత్రస్థాయి పరిశీలన – రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే..

హన్మకొండ, నేటిధాత్రి:

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయంలో నిర్వహించనున్న వేడుకలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 14 నుంచి 18 వరకు జరిగే ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మంగళవారం నాడు జిల్లా జి డబ్ల్యూ ఎం సి కమిషనర్ శ్రీమతి చాహత్ బాజ్ పాయ్, పోలీస్ మరియు వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆలయ పరిసరాలను సందర్శించి, భక్తులకు అందించే సౌకర్యాలు, పారిశుధ్యం, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీటి వసతి, విద్యుత్ సరఫరా తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్యూ లైన్ల ఏర్పాటు, పార్కింగ్ ప్రాంతాలు, భక్తుల రాకపోకల మార్గాలు వంటి విషయాలపై సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ రుద్రేశ్వర స్వామి వారిని దర్శించుకుని వేదమంత్రాల సాక్షిగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు సమర్పించారు.
తదనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, వేయి స్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సదుపాయం, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసి అత్యవసర సేవలను అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించామని, రవాణా మరియు పోలీస్ శాఖల సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తుల భద్రత కోసం పోలీస్ యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతుందని పేర్కొన్నారు. ఉత్సవాలను విజయవంతం చేయడంలో భక్తులందరూ అధికారులకు సహకరించి, ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ పోతుల శ్రీమాన్, డివిజన్ అధ్యక్షులు కుమార్ యాదవ్, సతీష్, ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ, ఆలయ ఈఓ అనిల్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version