కాంగ్రెస్ “గ్యారంటీ” తో కొత్త మలుపు… బీఆర్ఎస్ లో కుదుపు

Congress Party :

తెలంగాణలో కాంగ్రెస్ సంచలనంగా మారుతోంది. రాహుల్ ఖమ్మం వేదికగా గర్జించారు. పార్టీ గెలుపు “గ్యారంటీ” చేసారు. బీఆర్ఎస్ ఆయువు పట్టునే దెబ్బ తీసారు. కర్ణాటక తరహాలో గెలుపుకు నాంది పలికారు. భట్టి యాత్రతో మొదలై..ఖమ్మంలో  తుఫాను గా మారిన కాంగ్రెస్ ప్రభంజనం ఇప్పుడు “గ్యారెంటీ ” తో అధికారం దిశగా దూసుకెళ్తోంది. రాహుల్ గాంధీ ప్రకటించిన చేయూత పథకం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలకు కారణమవుతోంది. పక్కా ప్రణాళికతో ప్రతీ కుటుంబానికి దగ్గరయ్యేలా ప్రకటించిన చేయూత బీఆర్ఎస్ కోటను కదిలించి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ నే టార్గెట్ చేసారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేయూత పథకం ద్వారా రూ. 4000 పెన్షన్ ఇస్తామని ప్రకటన చేసారు.ఆదివాసీలకు పోడు భూములు ఇచ్చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్‌ బాదితులు, డయాలసిస్‌ రోగులకు రూ.4వేల చొప్పున పెన్షన్‌ అందిస్తామని తెలిపారు. అక్కడ ఫార్ములానే ఇక్కడ అమలు చేయటానికి రాహుల్ నిర్ణయించారు. బీఆర్ఎస్ తొలి నుంచి తాము అందిస్తున్న పెన్షన్ ..సంక్షేమం పైన భారీగా ప్రచారం చేసుకుంటోంది. అయినా..అమలులో మాత్రం భారీగా వైఫల్యం కనిపిస్తోంది.

ఈ సమయంలో రాహుల్ చేసిన ప్రకటన పైన పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇది ఓట్ల వర్షం కురిపిస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. పెన్షన్ల పంపిణీలో కొర్రీలు..ఆలస్యం..సక్రమంగా లేని అమలు వంటి వాటితో లబ్దిదారులు విసుగు చెందారు. కర్ణాటకలో అమలు చేస్తున్న తరహా విధానం ఇప్పుడు ప్రజలను ఆకట్టుకుంటోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా రూ 75 ఉన్న పెన్షన్ ను రూ 200 కి పెంచి అమలు చేసి నమ్మకం నిలబెట్టుకుంది. తిరిగి ఇప్పుడు మరోసారి కాంగ్రెస్..అందునా రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటన చేయటంతో ప్రజల్లో నమ్మకం కనిపిస్తోంది. తెలంగాణలో మెజార్టీ ఓట్ బ్యాంక్ గా ఉన్న వర్గాలకు  మేలు చేయనుంది. ఫలితంగా పార్టీకి ప్రయోజనంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు, వారి ధనిక మిత్రులు ఓవైపు ఉంటే.. మరోవైపు రైతులు, దళితులు, మైనారిటీలు, ఆదివాసీలు, చిరు వ్యాపారులు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లో ఆలోచన మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వరంగల్‌లో రైతు డిక్లరేషన్ మరియు హైదరాబాద్‌లో యువజన డిక్లరేషన్‌ను ప్రకటించింది, నిన్న రాహుల్ గాంధీ సీనియర్ సిటిజన్‌లు మరియు వితంతువులకు నెలకు రూ.4,000 గ్యారెంటీ పెన్షన్ ప్రకటించారు. .

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పోడు భూమిని ఆదివాసీలకు తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు. ఇవన్నీ తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారం కు దగ్గర చేసే నిర్ణయాలుగా కనిపిస్తున్నాయి. కర్టాటకలో ఇవే తరహా హామీలతో ఓట్ల వర్షం కురిసింది. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే తరహా ప్లాన్ రాహుల్ అమలు చేస్తుండటంతో అధికార బీఆర్ఎస్ కు షాక్ గా మారింది. కేసీఆర్ ఓట్ బ్యాంక్ చెల్లా చెదురు అవ్వటం ఖాయమనే విశ్లేషణలు మొదలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!