‘‘కాజా’’ తిన్నంత సులువుగా కబ్జా చేస్తాడు?

`అధికారుల వత్తాసుతో భూ ఆక్రమణ..

`ప్రభుత్వ స్థలం హాంపట్‌….

`రోడ్డును మింగేసి షెడ్డు నిర్మాణం…

`చోద్యం చూస్తున్న టౌన్‌ ప్లానింగ్‌ విభాగం.

`జూబ్లీ హిల్స్‌ క్లబ్‌ మెంబర్‌ షిప్‌ కు డిప్యూటీ కమిషనర్‌ కక్కుర్తి?

`కోట్లాది రూపాయల భూమి సంతర్పణం.

`అక్కడ గజం మూడు లక్షల పైమాటే.

`ముందు ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేశారు.

`వెనక వున్న ప్రభుత్వ భూమిని సొంతం చేసుకున్నారు.

`అడిగేవారు లేడు…పట్టించుకోవాల్సిన అధికారి రాడు.

`ఇష్టారాజ్యం…పిల్మ్‌ నగర్లో భూములు భోజ్యం.

`ఫిల్మ్‌ నగర్‌ చుట్టూ ఆక్రమణలే…ప్రభుత్వ భూములు చెరబట్టుడే.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కనిపిస్తే కన్నేయడమే! కాజా తిన్నంత సులువుగా భూమిని కబ్జాపెట్టేయడమే! అతని పని. ఇది జూబ్లిహిల్స్‌లో చాలా మందికి తెలిసిన బాగోతమే! అది ప్రభుత్వ స్ధలమైనా సరే అతను కబ్జా చేస్తాడు. అది జనం నడవాల్సిన రోడ్డైనా సరే…ఆక్రమించేసుకుంటాడు. అక్కడ షెడ్లు నిర్మాణం చేసేస్తుంటాడు. పేరు మాత్రం చాలా పెద్దది. అందుకే ఇలాంటివి చేస్తుంటాడు. ఆ పేరును అడ్డం పెట్టుకొని అడ్డదడ్డమైన పనులు చేయపోతే ఎలా అనుకుంటాడో ఏమో! కాని చెప్పలేనన్ని ఆరోపణలు మూటగట్టుకున్నాడు. అనేక కేసులు కూడా ఎదుర్కొంటున్నాడు. అయినా కబ్జా మాత్రం ఆపడు. ఆక్రమణలు వదిలిపెట్టడు. జూబ్లీహిల్స్‌ ఏరియాలో రోడ్డు కూడా ఖాళీగా కనిపించకూడదు. కనిపిస్తే ఇక అంతే…వాటిని ఆక్రమించేయడం…అమ్ముకోవడం..సొమ్ము చేసుకోవడం….కోట్లు కూడబెట్టుకోవడమే…ఆతని పని. ఏ భూమి ఆక్రమించినా దానికో మతలబు ముడిపెడుతుంటాడు. చెప్పడానికో సాకు వుంటుంది. పెద్దోళ్లందరూ ఆయన వెనకాలే వుంటారు. అధికారులు కూడా అతనికే వంతపాడుతుంటారు. ఇక భూములు ఎందుకు ఆక్రమించడు? ఒక రకంగా ఆయన జూబ్లిహిల్స్‌ మున్సిపల్‌ సర్కిల్‌లో ఆయన ఎంత చెబితే? అంత? ఏది చెబితే? అది? చెల్లుబాటు కావాల్సిందే…ఇప్పటిదాకా అవుతున్నదే? అది…ఏ అధికారైనా సరే ఊ అనాల్సిందే..ఊ కొట్టాల్సిందే…! అతను చేసే ఆక్రమణలన్నీంటికీ అధికారులనుంచి అనధికార అనుమతి వున్నట్లే లెక్క. అలాంటిదే ఈ కొత్త భూ ఆక్రమణం…!

  అది జూబ్లీహిల్స్‌లోని మెయిన్‌ రోడ్డు స్ధలం.

 120 ఫీట్ల రోడ్డు. ఆ రోడ్డు మీద గతంలో కొందరు మహానీయుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆ పక్కనే కొంత ప్రభుత్వ స్థలం వుంది. దానిపై ఆ వ్యక్తి కన్ను పడిరది. ఎలాగైనా ఆ స్ధలం సొంతం చేసుకోవాలనుకున్నాడు. అందుకు ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు సమయం ఆసరాగా తీసుకున్నాడు. అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు సహకరించాడు. తొలుత జిహెచ్‌ఎంసి ఒప్పుకోలేదు. దాని వెనకాల ఈ వ్యక్తివున్నాడని తెలియక జిహెచ్‌ఎంసి అధికారులు కాదన్నారు. అసలు విషయం తెలిశాక ఓకే చెప్పేశారు. ఆ తర్వాత ఓ ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకోవడంతో అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇదే అదునుగా అటు విగ్రహ నిర్మాణం చేపట్టారు. ఆ విగ్రహావిష్కరణ పూర్తి పూర్తిచేశారు. ఆ విగ్రహం వెనక వున్న స్ధలం అతను కబ్జా చేశాడు. దానిలో నిర్మాణాల మొదలుపెట్టేశాడు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం అని అనుమానం రాకుండా పూర్తి చేస్తున్నాడు. అందుకు జిహెచ్‌ఎంసికి చెందిన డిప్యూటీ కమీషనర్‌ వ్యవహార శైలి ఉపయోగపడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో కీలక పాత్ర దారిగా వున్న అతను, డిప్యూటీ కమీషనర్‌కు క్లబ్‌లో సభ్యత్వం ఇస్తానన్న వాగ్ధానం చేసినట్లు తెలుస్తోంది. దాంతో జిహెచ్‌ఎంసి అటు వైపు చూడడం కాని జరగడంలేదు. ఇక టౌన్‌ ప్లానింగ్‌కు చెందిన ఓ అధికారిని కూడా అందుకు సహకరిస్తోందన్న విమర్శలు వున్నాయి. ఫిల్మ్‌ నగర్‌లోని మెయిన్‌ రోడ్డులో స్థలం కాజేయడం అంటే మాటలు కాదు. అధికారుల పూర్తి సహకారంతోనే జరుగుతోంది. 

  ఈ స్ధలంలో వివాదం చాల రోజుల నుంచి నడుతున్నాడు. 

గతంలోనే ఇక్కడ ఓ సదరు వ్యక్తి ఓ రూం వేయడం జరిగింది. దాన్ని కొందరు స్ధానికులు ప్రశ్నించారు. అది జూబ్లీహిల్స్‌ సొసైటీకి చెందిన స్ధలం కాదంటే వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. స్దానిక నేతలు కొందరు గట్టిగా నిలబడడంతో కొంత కాలం ఆ నిర్మాణం ఆపేశాడు. అది ప్రభుత్వ స్ధలమన్న పక్కా ఆధారాలతో సదరు వ్యక్తిని స్ధానిక నాయకులు అడ్డుకోగలిగారు. అయితే ఎలాగైనా ఆ స్థలం కొట్టేయాలనుకున్న వ్యక్తి, అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుతో మళ్లీ కట్టడం మొదలుపెట్టాడు. ఓ దశలో ఆ విగ్రహ ఏర్పాటును కూడా స్ధానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీని వెనక జరుగుతున్న అసలు విషయం తెలియని ఎమ్మెల్యే విగ్రహ ఏర్పాటును అడ్డుకోవద్దని సూచించారు. అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తేనే స్థలం కబ్జా సులువౌతుందని గ్రహించిన సదరు వ్యక్తి, తన అనుకున్నది పూర్తి చేశారు. ముందు ఒక రూం వేశాడు. ప్రహారీ నిర్మాణం చేశాడు. ఎన్నీఆర్‌ విగ్రహం ఏర్పాటు కోసమంటూ చుట్టూ పరదా ఏర్పాటుచేసి, వెనక వున్న స్ధలంలో నిర్మాణం కూడా పూర్తి చేశాడు. అక్కడ అక్రమ నిర్మాణం జరగుతోందని కొందరు వ్యక్తులు జూన్‌నెలలోనే జిహెచ్‌ఎంసికి పిర్యాధు చేశారు. అయితే కేవలం పిల్మ్‌ నగర్‌లో సభ్యత్వం కోసం కోట్లాది రూపాయల ప్రభుత్వ స్ధలంలో డిప్యూటీ కమీషనర్‌ ఆ స్ధలంలో నిర్మాణాలను అడ్డుకోకపోవడం విడ్డూరం. 

 ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటును తొలుత అధికారులు కూడా అనుమతివ్వలేదు.

 విగ్రహ ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన పిల్లర్లు కూడా అధికారులే కూల్చేశారు. అదే అదికారులు అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఆ పక్కనే వున్న స్థలంలో సదరు వ్యక్తి అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే చూస్తూ వంత పాడుతున్నారు. ఇలా ప్రభుత్వ స్దలాలను కబ్జా చేయడం ఆ వ్యక్తికి కొత్త కాదని స్ధానికులు అంంటున్నారు. జూబ్లీహిల్స్‌ ప్రాంతమంటేనే ఇప్పుడు హాట్‌కేక్‌ లాంటిది. అక్కడ గజం ధర సుమారు రూ.3లక్షల పైమాటే. అలాంటి అక్కడ సుమారు 150 గజాల స్థలం ఆక్రమణకు గురైంది. సర్వే నెంబర్‌ 403లో వున్న ఈ స్ధలంలో అక్రమంగా చేపట్టిన నిర్మాణం తొలగించాలని స్ధానికులు డిమాండ్‌ చేస్తున్నారు. రోడ్డును ఆక్రమించుకొని ఇలా నిర్మాణాలు చేయడం నేరం. అయినా అధికారుల అవినీతి మూలంగా, స్వార్ధపరులు ప్రభుత్వ స్ధలాలను ఆక్రమించుకోడం అలవాటు చేసుకుంటున్నారు. అందుకు టౌన్‌ ప్లానింగ్‌ అధికారికి సహాయకుడైన మరో ఉద్యోగి సహాకారంతో స్థలం కబ్జా బాగోతం తంతుపూర్తయినట్లు సమాచారం. ఇప్పటికే జూబ్లిహిల్స్‌ సొసైటీలో కీలకభూమిక పోషించే ఆ వ్యక్తి గతంలో ప్రభుత్వ స్థలాలను ఇదే విధంగా కబ్జాలు పెట్టి, నిర్మాణాలు చేసి అమ్ముకున్నట్లు అనేక విమర్శలున్నాయి. వాటిపై కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. ఆ కేసులు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. అయినా అతని దుష్ట చేష్టలు ఆగడం లేదని స్దానిక నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రభుత్వ స్ధలాలను కబ్జా చేస్తున్నవారిని ప్రభుత్వం నిలువరించకపోతే, భవిష్యత్తులో ప్రభుత్వ స్థలాలు వుండవని ప్రజలు కోరుతున్నారు. ఏకంగా రోడ్డు స్థలాన్నే మింగేయాలని చూస్తున ఆ వ్యక్తిని ఇలాగే వదిలేస్తే జూబ్లిహిల్స్‌లో స్ధలాలను మిగలనివ్వడని కూడా అంటున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అయ్యప్ప భక్తుల అన్నదానానికి ఎంపీ రవిచంద్ర వితరణ

ఖమ్మం, నవంబర్, 5:

అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో

నగరంలోని వీడీవోస్ కాలనీలో నిర్వహిస్తోన్న అన్నప్రసాద వితరణ (అన్నదానం) కు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర భూరి విరాళం అందజేశారు. అన్నదానానికి అవసరమైన పలు నిత్యావసర

సరుకులను ఆయన సమకూర్చారు. ఈ సరుకులను శనివారం ఎంపీ రవిచంద్ర తనయుడు వద్దిరాజు నిఖిల్ అయ్యప్ప భక్తుల సమక్షంలో నిర్వాహకులకు అందజేశారు. తొలుత ఆయనకు స్వాములు ఘన స్వాగతం పలికి.. పీఠం లోనికి తోడ్కొని వెళ్లారు. అక్కడ అభిషేకం, పూజలు నిర్వహించి అన్నదానం ప్రారంభించారు. నిఖిల్ స్వయంగా అయ్యప్ప భక్తులకు వడ్డించి.. వారి ఆశీస్సులు స్వీకరించారు. అయ్యప్ప భక్తుల ఆకలి తీర్చడం కోసం పెద్ద మనసుతో అన్నదానానికి అవసరమైన సరుకులు అందజేసిన ఎంపీ రవిచంద్రకు పీఠం నిర్వాహకులు, అయ్యప్ప భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఠం వ్యవస్థాపకులు తాండ్ర రాంప్రసాద్ గురుస్వామి, పగడాల కిషోర్, శీలంశెట్టి జానకిరామ్, గుత్తా శేఖర్, శీలం గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేనేంటో చూపిస్త!

`బిజేపి చేత చుక్కలు లెక్కబెట్టిస్త!

`ప్రభుత్వాలను పడగొట్టుడు గొప్పదనమా?

`బిజేపి దురాగతాలు దేశమంతా వివరిస్తా!

`ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న బిజేపిని ఎండగడత.

`ప్రజలను అప్రమత్తం చేస్తా!

`రాష్ట్రాల నాయకత్వాలను ఐక్యం చేస్తా!

`ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?

`ప్రపంచం ముందు దేశం పరువుతీస్తున్న వారిని ఉపేక్షించాలా.

`దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి. 

`ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాలలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.

`ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల మీద పడాలని చూస్తున్నారు.

` ఈ దుర్మార్గులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలి.

`రాజకీయాలలో అహంకారానికి తావులేదు.

`ప్రజలను కోసం పని చేయని పార్టీలకు మనుగడ వుండదు.

`అబద్ధాలు పదే పదే చెప్పి ప్రతి సారీ నమ్మించలేరు..

` ప్రజలను వంచించే పాలన ఎల్లకాలం సాగదు.

`ఇప్పటి దాకా ఒక లెక్క…ఇప్పటి నుంచి కేసిఆర్‌ లెక్క..

`రాసిపెట్టుకోండి…మీ గడియలు లెక్కబెట్టుకోండి.

                            తెలంగాణతో గోక్కున్నోళ్లు ఎవరూ ముందట పడలే! తెలంగాణను ఇబ్బందులకు గురిచేసినవాళ్లేవరూ చరిత్రలో గొప్ప స్ధానం పొందలే…అందులోనూ చరిత్రకే భాష్యం చెప్పిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ను నిందించిన వాళ్లు తమ రాజకీయ సన్యాసాన్ని వాళ్లే కొని తెచ్చుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమకాలంలో కేసిఆర్‌తో కలిసొచ్చిన వాళ్లు తప్ప,కేసిఆర్‌ను తూలనాడిన వాళ్లేవరూ తెలంగాణ రాజకీయాల్లో స్ధానం లేకుండా చేసుకున్నారు. ఇప్పుడు కూడా అంతే…భవిష్యత్తులో జరగేదదే! అరవై ఏళ్ల గోస తీర్చడం కోసం, పద్నాలుగేళ్ల పాటు నిరంతర ఉద్యమం చేపట్టిన నాయకుడు కేసిఆర్‌. చరిత్రలో దేశ స్వాతంత్య్ర పోరాటం తప్ప, మరో పోరాటం ఇంత సుధీర్ఘమైనది ప్రపంచంలోనే లేదు. అంతటి విశిష్టమైనది మలితరం, కేసిఆర్‌ నేతృత్వ తెలంగాణ ఉద్యమం. ఒక రకంగా పవిత్రమైనది. ఉన్నతమైనది. తెలంగాణ వస్తే ఎలా వుండాలో అన్నదానిపై కూడా బ్లూ ప్రింట్‌ తయారు చేసుకొని మరీ తెలంగాణను తీర్చిదిద్దుతున్న నాయకుడు కేసిఆర్‌. అలాంటి తెలంగాణలో రాజకీయాలను అస్ధిర పర్చాలని చూస్తే ప్రజలే క్షమించరు. కేసిఆర్‌ కూడా ఉపేంక్షించరు. పండిరచిన వాడికి తెలుసు పంట విలువ. వండినవారికి తెలుసు వంట విలువ. కుప్ప మీద కూర్చొని తింటా అనేవాడికి ఈ రెండూ తెలియదు. ఇప్పుడు బిజేపి చేస్తున్నది, చేయాలని చూస్తున్నది అదే…అసలు తెలంగాణ ఉద్యమ సమయంలో కలిసి రాని బిజేపి నేతలకు తెలంగాణలో రాజకీయాలు చేసే నైతిక హక్కే లేదు. అయినా ప్రజాస్వామ్య వ్యవస్ధలో రాజకీయం అన్నది అందరి హక్కు. దానిని నైతికంగా నిర్వహించాలి. ప్రజల మన్ననలు పొందాలి. ప్రజల ఆశీస్సులు కావాలి. అంతే గాని ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు కోట్లు ఖర్చు చేస్తాం…రాజకీయాలను అస్థిరపర్చుదామని చూస్తే తెలంగాణలో వున్నది కేసిఆర్‌. ఆయన చూపు ఎంత చల్లనిదో..కోపం నిప్పులు కురిపిస్తది.  

                         తెలంగాణ ఎమ్మెల్యేలను కొనగోలు చేయాలని చూసిన వ్యవహరాన్ని కేసిఆర్‌ ప్రపంచం ముందు వుంచారు. ఇలా జరుగుతుందని బిజేపి కూడా ఊహించలేదు. పైగా నలుగురు ఎమ్మెల్యేల విషయంలో జరిగిన దాన్ని టిఆర్‌ఎస్‌ బైట పెట్టిన నాడు బిజేపి మాట్లాడిన మాటలకు ఏమైనా అర్ధముందా? అంతే కాదు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఓ అడుగు ముందుకేసి యాదాద్రి వెళ్లి మరీ తడిబట్టలతో ప్రమాణం చేశారు. ఇంత దిగజారుడు తనం రాజకీయాలు ఎక్కడా లేవు. దేశంలో ఇప్పటికే 8 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చేశాం. ఇక కూల్చాల్సినవి మూడు అంటూ ఎమ్మెల్యేలను పిలిచుకొని మరీ చర్చలు జరిపడం అంటే రాజకీయాల్లో బరితెగింపు తనం తప్ప మరొకటి కాదు. ఇప్పుడున్న దేశ రాజకీయాల్లో కేసిఆర్‌ లాంటి విజ్ఞత,విజ్ఞానం, రాజనీతి వున్న నాయకుడు మరొకరు లేదు. ఆసేతు హిమాచలం వరకు ఏ ప్రాంతం ఏమిటి? అక్కడి ప్రజల పరిస్ధితి ఏమిటి? భౌగోళిక పరిస్దితులు ఎలాంటివి? ప్రజల జీవన విధానం ఎలాంటింది? వంటి అనేక అంశాల మీద అవగాహన వున్న నాయకుడు కేసిఆర్‌. అలాంటి నాయకుడు కొట్లాడి సాధించిన తెలంగాణను ప్రగతి వైపు నడుపుతుంటే సహకారం విస్మరించారు. తెలంగాణకు న్యాయంగా విభజన సమయంలో ఇచ్చిన హమీల మేరకు నిధులు రాలేదు. ఆస్ధుల పంపకాలు పూర్తి కాలేదు. తర్వాత తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. నీతి ఆయోగ్‌ చెప్పిన మిషన్‌ భగీరధకు నిధులు కేటాయించడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే బిజేపి తెలంగాణకు చేస్తున్న అన్యాయం అంతా ఇంతా కాదు. వీటికి తోడు తెలంగాణకు గతంలోనే ఇచ్చిన అనేక ప్రాజెక్టులు కూడా గుజరాత్‌కు తరలించుకుపోయారు. ఖాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ వెళ్లిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన ఉక్కుఫ్యాక్టరీ కుదరదన్నారు. ఇలా అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేస్తూనే వున్నారు. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ అస్ధితరను సృష్టించి చలి కాచుకోవాలనుకుంటున్నారు. ఇది ఎంత దుర్మార్గమో దేశం మొత్తం తెలిసేలా చేస్తానని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. 

                          దేశమంతా తిరుగుతా! దేశంలోని అన్ని రాష్ట్రాలను చైతన్యం చేస్తా అని ముఖ్యమంత్రి చెబుతున్నారు. అయినా ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలను కూల్చడం అన్నది నైతికత కాదు. గతంలో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అదే పని చేసింది. కాని ఏమైంది. ప్రజలు తిరగబడ్డారు. మళ్లీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించుకున్నారు. ఎన్టీఆర్‌ను అంతకు మించి మెజార్టీతో ముఖ్యమంత్రిని చేశారు. ప్రపంచమంతా కీర్తించిన ఇందిరాగాంధీ ఇక తనకు తిరగులేదని, ఎదురులేదనే ఆలోచనకు వచ్చాక చేసిన ఎమర్జెన్సీ, ఎన్టీఆర్‌ను గద్దెదించడం వంటి పనులు మూలంగా ఆమె కీర్తి మసకబారింది. ఇప్పుడు అదే దారిలో బిజేపి కేంద్ర ప్రభుత్వం నడుస్తోందనేది కేసిఆర్‌ చేస్తున్న ప్రధాన ఆరోపణం. మహారాష్ట్ర, గోవా, మధ్య ప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలలో ఏం జరిగిందో తెలిసిందే. అక్కడ ఎలాగైతే ప్రభుత్వాలను కూలదోసి, బిజేపి ప్రభుత్వాలను ఏర్పాటు చేశారో…తెలంగాణ,డిల్లీ,రాజస్ధాన్‌లలో కూడా అమలు చేసేందుకు బిజేపి కుయుక్తులు పన్నుతున్నారన్నదానిని ముఖ్యమంత్రి కేసిఆర్‌ బైటపెట్టారు. బిజేపి కటప బుద్దిని చీల్చి చెండాడాడు. 

                  ఇలా ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న బిజేపిని ప్రజల్లోనే ఎండగట్టేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ దేశ పర్యటన కూడా చేపట్టే అవకాశం వుంది. ఎందుకంటే దేశ ప్రధాని ఎంతో హుందాగా వ్యవహారించాల్సి వుంది. కాని బెంగాల్‌ రాష్ట్రంలో అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో వున్నారని చెప్పడం ఏమిటని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రశ్నించారు. ఎంత సేపు రాజకీయాలేనా? ప్రగతి గురించి ఆలోచించేందేమైనా వుందా? అని నిలదీశారు. ఈ ఎనమిదేళ్ల కాలంలో ప్రభుత్వాలను కూల్చడం తప్ప, ఏ ఒక్క ప్రాజెక్టైనా నిర్మాణం చేశారా? అని అన్నారు. ప్రభుత్వ ఆస్ధులు అమ్మకాలకు పెట్టడమే పనిగా బిజేపి పెట్టుకున్నదని ఆరోపించారు. ఇందుకోసమే స్వాముల అవతారంలో వున్న బ్రోకర్లు పనిచేయడం ఏమిటన్నారు. ఎక్కడైనా చూశామా? ఇలాంటి దురాగాతాలు అని ప్రశ్నించారు. అందుకే ప్రజలు అప్రమత్తం చేయాల్సిన అవసరం వుంది. గతంలో ఇలాగే చంద్రబాబు తెలంగాణ అస్ధిరతకు పాల్పడే కుట్ర చేశారు. కాని జరగలేదు. ఇప్పుడు బిజేపి తెలంగాణ రాజకీయాలను కలుషితం చేయాలని చూస్తోంది. అసలు తెలంగాణ రావడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఏనాడు జీర్ణించుకోలేదు. అవకాశం వచ్చిన ప్రతీసారి దేశంలో ఏ సమస్య లేనట్లు తెలంగాణ మీద మాట్లాడడం ప్రధానికి అలవాటైపోయింది. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని ఆంద్రప్రదేశ్‌ ఎన్నికల సమయంలో అన్నాడు. తాజాగా పార్లమెంటు తలుపులు మూసి, తెలంగాణ ఇచ్చారని అన్నాడు. అంటే ఆయనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం సుతారం ఇష్టం లేదని చెప్పకనే పలు మార్లు ప్రస్తావించారన్నది ఎప్పుడో తెలిపోయింది. 

                        తెలంగాణలోని సాగు విషయంలో ప్రతీసారి కేంద్ర ప్రభుత్వం కిరికిరి పెడుతూనే వుంది. బియ్యం కొనుగోలులోనూ ఇదే తంతు. ప్రతి సారి ఏదో రకమైన ఇబ్బందులకు గురిచేయడం పరిపాటిగా మారింది. తెలంగాణలోని రైతులు వినియోగిస్తున్న కరంటు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం బిజేపికి ఇష్టం లేదు. సాగు మోటార్లకు విద్యుత్‌ మీటర్లు పెట్టాలన్నది బిజేపి నిర్ణయం. దాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్‌ వ్యతిరేకిస్తున్నాడు. అందువల్ల తెలంగాణలో రాజకీయాలు అస్ధిరం చేయాలి. ప్రజల మద్దతుతో గెలిచే అవకాశం రాదు. కేంద్ర అధికారాలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని కూలదోస్తే తమ ఇస్టానుసారం వ్యవహరించొచ్చన్నది బిజేపి వ్యూహం. కాని ఇక్కడ వున్నది కేసిఆర్‌…ఆయన ఒక్కసారి కమిటైతే… మిగతాది మీ అందరికీ తెలిసిందే!!

మునుగోడు కారుదే!

`అనూహ్యమైన మెజారిటీతో టిఆర్‌ఎస్‌ గెలుపు!

`20 వేల నుంచి 25 వేల మెజారిటీ అవకాశం.

`నేటిధాత్రి ఎగ్జిట్‌ పోల్‌ రిజల్ట్‌.

`ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతృప్తి.

`విద్యుత్‌ మోటార్లకు మీటర్లు ఒక అంశమైంది.

`రాజగోపాల్‌ రెడ్డిపై టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ చేసిన కాంట్రాక్టు విమర్శలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి.

`ఫ్లోరైడ్‌ బాధ తీర్చిన పార్టీగా టిఆర్‌ఎస్‌ వైపు నిలిచిన జనం.

`ఈ ఎన్నికలలో సురక్షితమైన మంచి నీటి ప్రభావం కూడా రాజకీయంలో భాగమైంది.

`ఫ్లోరైడ్‌ రహిత మునుగోడులో టిఆర్‌ఎస్‌ పాత్రపై మొదటి సారి నేటిధాత్రి ప్రస్తావన.

`అదే ప్రతిపక్ష పార్టీల చిత్తశుద్ధిని ప్రశ్నించే దాకా వెళ్లింది.

`ఒక దశలో ఫ్లోరైడ్‌ సమస్యపైనే ప్రచారమంతా కేంద్రీకృతమైంది.

`ఆ క్రెడిట్‌ అంతా టిఆర్‌ఎస్‌ కే వెళ్లింది.

`కాంగ్రెస్‌ కు డిపాజిట్‌ దక్కే అవకాశం లేకపోలేదు.

`రాజగోపాల్‌ రెడ్డిపై అసలైన బిజేపి శ్రేణుల అసంతృప్తి.

`రాజగోపాల్‌ రెడ్డి నాన్‌ లోకల్‌… కూసుకుంట్ల లోకల్‌ అనేది కూడా ప్రజలను ఆలోచింపజేసింది.

`ఎన్నికలైపోగానే రాజగోపాల్‌ రెడ్డి ఆస్ట్రేలియా ప్రయాణం అన్న అంశం కూడా తోడైంది.

`చండూరులో సిఎం సభ ప్రభావం కూడా కనిపించింది.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

మునుగోడులో కారు జోరు కొనసాగింది. ప్రతిపక్ష పార్టీలైన బిజేపి, కాంగ్రెస్‌ ల పరిస్థితి ప్రచారం జరిగినంతగా పోలింగ్‌ రోజు కనిపించలేదు. పోలింగ్‌ సరళిని బట్టి చూసినా బిజేపి, కాంగ్రెస్‌ లకు ఆశనిపాతమే ఎదురైంది. రాజగోపాల్‌ రెడ్డి తనకు తానుగా ఊహించుకున్నంత ఓటు బ్యాంకు ఆయనకు కనిపించలేదు. మునుగోడు ఉప ఎన్నిక కు ముందు నెల రోజుల పాటు నేటిధాత్రి సర్వే నిర్వహించింది. దాదాపు అన్ని గ్రామాల ప్రజలను నేటిధాత్రి బృందం కలిసింది. ఆ గ్రామాలలో ప్రజల ఆలోచనా సరళి తెలుసుకునే ప్రయత్నం చేసింది. ప్రతి గ్రామంలోనూ కొంతమందిని నేరుగా ప్రశ్నించడంతో పాటు, ఆయా గ్రామాలలో ప్రజల చర్చలను కూడా ఆసక్తిగా నేటిధాత్రి బృందం వినడం జరిగింది. ఏ ఉప ఎన్నికైనా ఏదొ ఒక బలమైన కారణం అంటూ వుంటుంది. ఈ మధ్య గత మూడేళ్ల కాలంలో తెలంగాణలో వచ్చిన ఉప ఎన్నికల విషయానికి వస్తే ముందుగా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక జరిగింది. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎంపిగా ఆయన పోటీ చేసి గెలిచారు. దాంతో హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికలో టిఆర్‌ఎస్‌ పార్టీ గెలిచింది. ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే అక్కడ బిజేపి గెలిచింది. దుబ్బాక నుంచి బిజేపి అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘునందన్‌ రావు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడంతో పాటు గతంలో రెండు సార్లు ఓటమి సానుభూతి ఆయనకు కలిసివచ్చింది. అయినా ఆయన గెలిచింది కేవలం పదకొండు వందల ఓట్ల మెజారిటీ మాత్రమే. అయినా అది రఘునందన్‌ రావు వ్యక్తి గత గెలుపు ఖాతానే. తర్వాత నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక లో టిఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. దుబ్బాక గెలుపుతో బిజేపి నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికపై బోలెడు ఆశలు పెట్టుకున్నది. కానీ బొక్కబోర్లా పడిరది. తర్వాత హుజూరాబాద్‌ ఉప ఎన్నిక. అది బలమైన రాజకీయ కారణం వల్ల వచ్చింది. అది కూడా ఈటెల వ్యక్తి గత గెలుపు ఖాతాలోనే పడిరది. ఈ ఉప ఎన్నికలన్నీ సహజ సిద్ధంగా వచ్చినవి. మునుగోడు అలా కాదు. రాజగోపాల్‌ రెడ్డి స్వార్థంతో వచ్చిందనేది ప్రజలు కూడా బలంగా నమ్మారు. రాజగోపాల్‌ రెడ్డి స్వార్థ పూరిత రాజకీయాన్ని ఎండ గట్టడంలోనూ, ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ టిఆర్‌ఎస్‌ సక్సెస్‌ అయ్యింది.మునుగోడు మొదటి నుంచి బిజేపి హైప్‌ క్రియేట్‌ చేసి, దానిని వాడుకుందామని చూసింది. 

కానీ బిజేపి అనుకున్నంతగా ప్రజలు నమ్మలేదు. అంతే కాకుండా మునుగోడు ఉప ఎన్నిక హుజూరాబాద్‌ ను మించి కాస్ట్లీ అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే రాజకీయ పార్టీలన్నీ ప్రచారం చేశాయి. రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేసిన మరుసటి రోజు నుంచే అన్ని పార్టీల ప్రచారం మొదలైంది. అభ్యర్థుల ప్రకటనతో ప్రచారం మరింత ఊపందుకున్నది. ఈ దశలో టిఆర్‌ఎస్‌ పార్టీ పూర్తిగా గ్రౌండ్‌ ప్రచారం విసృతంగా చేపట్టింది. టిఆర్‌ఎస్‌ కు చెందిన మంత్రులు రోడ్‌ షోలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు గ్రామ స్థాయి దాకా వెళ్ళి ప్రచారం చేశారు. ప్రజలను విసృతంగా కలిసి, ప్రభుత్వ పథకాల అమలు తీరు ప్రచారం చేశారు. ధరల పెరుగుదల, విద్యుత్‌ మోటర్లకు మీటర్లు వంటి అంశాలను ప్రజలకు మరింతగా వివరించారు. ప్రజల్లో వున్న కొన్ని అపోహలను టిఆర్‌ఎస్‌ నాయకులు నివృత్తి చేశారు. గతంలో పడిన గోసను గుర్తు చేశారు. ఇప్పటి పరిస్థితులకు, అప్పటి పరిస్థితులను ప్రజలు బేరీజు వేసుకునేలా చేశారు. కుల సంఘాల ప్రత్యేక సమావేశాలు టిఆర్‌ఎస్‌ విసృతంగా నిర్వహించింది. బిజేపి తెలంగాణ కు చేస్తున్న అన్యాయం బాగానే వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మునుగోడు ఫ్లోరైడ్‌ సమస్య తీరడంలో టిఆర్‌ఎస్‌ పార్టీ పాత్ర, ముఖ్యమంత్రి కేసిఆర్‌ చొరవ, ప్రభుత్వ పనితీరు, మిషన్‌ భగీరథ విజయం వంటి అంశాలపై నేటిధాత్రి కొన్ని రోజుల పాటు ప్రస్తావిస్తూ వచ్చింది. అది మునుగోడులో అనేక చర్చలకు దారి తీసింది. చర్చా వేదికలలో ప్రధాన అంశమైంది. టిఆర్‌ఎస్‌ ఆ విషయాన్ని బాగా ఓన్‌ చేసుకున్నది. ప్రజలను కదిలించింది. ఫ్లోరైడ్‌ పై పోరాటం చేసిన స్వామి చేత ప్రజలను నిజాలు చెప్పించే ప్రయత్నం టిఆర్‌ఎస్‌ చేసింది. మంత్రి కేటిఆర్‌ కూడా ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. మీడియా కూడా ఫ్లోరైడ్‌ పై రకరకాల చర్చలు చేపట్డింది. ప్రతిపక్షాలు కూడా ఫ్లోరైడ్‌ రహిత మునుగోడులో తమ పాత్ర చూపించుకోలేకపోయారు. బిజేపికి చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. అయినా అబద్దాలు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ వికటించింది. కాంగ్రెస్‌ ఫ్లోరైడ్‌ జోలికి వెళ్లే ధైర్యం చేయలేదు. అప్పటికే విమర్శల జడివాన కాంగ్రెస్‌ ను అతలా కుతలం చేసింది. రాజగోపాల్‌ రెడ్డి ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇక ఏం చేయాలో తోచని స్థితిలో రాజగోపాల్‌ రెడ్డి ప్రకటించిన మునుగోడు మ్యానిఫెస్టో మొదటికే మోసం చేసింది. ప్రజలు ఆ మ్యానిఫెస్టోను చూసి నవ్వుకున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే గా మునుగోడును అభివృద్ధి చేయలేననే చేతులెత్తేసిన రాజగోపాల్‌ రెడ్డి మళ్ళీ గెలిచినా చేసేదేమీ వుండదని ప్రజలు నిర్ణయించుకున్నారు. టిఆర్‌ఎస్‌ కు ఓటేశారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర్లోనే వున్నందున ఈ ఏడాది కాలంలో అధికారంలో వున్న టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మునుగోడును తీర్చిదిద్దుతుందని నిర్ణయానికి వచ్చారు. ఓట్లేశారు. సంక్షేమ పథకాలే టిఆర్‌ఎస్‌ పార్టీకి శ్రీరామ రక్ష. ఎవరు ఎన్ని చెప్పినా, ప్రజలకు వాస్తవాలు తెలుసు. వారిని మోసం చేయడం ఎవరి వల్ల కాదు. ప్రతిపక్షాలు చెప్పే ప్రతి మాటను ప్రజలు గమనిస్తూనే వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు. వున్నా తెలంగాణలో అమలవుతున్న పెన్షన్లు ఇతర రాష్ట్రాలలో అందడం లేదు. ఇక కరంటు కష్టాలు చూసిన తెలంగాణలో నిరంతర విద్యుత్‌ అందుతోంది. రైతులకు అవసరమైన విద్యుత్‌ ఉచితంగా అందుతోంది. దేశంలో ఎక్కడా లేని రైతు బంధు తెలంగాణలో అమలౌతోంది. ఇక ఆసరా పింఛన్లు వయసు మళ్ళిన వారి జీవితాలను నిలబెడుతున్నాయి.

దివ్యాంగుల పింఛన్లు ఏ రాష్ట్రంలో లేనంతగా ఇస్తున్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతృప్తికరంగా వున్నారు. వీటికి తోడు మంచినీరు. గత ఎన్నికలలో రాజగోపాల్‌ రెడ్డిని నమ్మి గెలిపించినందుకు ఆయన పార్టీ మారడం ప్రజలకు నచ్చలేదు. రాజగోపాల్‌ రెడ్డి తన స్వార్థం కోసం మునుగోడు ఉప ఎన్నిక తెచ్చాడని ప్రజల బలంగా నమ్మారు. మళ్ళీ రాజగోపాల్‌ రెడ్డి ని గెలిపించినా, రాజకీయం తప్ప, అభివృద్ధి చేసేదేమీ వుండదని ప్రజలు గ్రహించారు. ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తెచ్చి పనులన్నీ పూర్తి చేస్తానని చెప్పిన రాజగోపాల్‌ రెడ్డి చేతులెత్తేశాడు. పోరాటం చేయాల్సిన సమయంలో మరో పార్టీలొకి వెళ్లాడు. మళ్ళీ ఎన్నిక తెచ్చినా, ఆయన గెలిచినా మళ్ళీ ప్రభుత్వం పనులు ఇవ్వడం లేదని చేతులెత్తేస్తాడు. తన చేతగాని తనాన్ని ప్రభుత్వం మీద నెట్టేస్తాడు. అందువల్ల వున్న ఈ ఏడాదైనా అభివృద్ధి జరగాలంటే టిఆర్‌ఎస్‌ నే గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇక రాజగోపాల్‌ రెడ్డి ముందు పార్టీ శ్రేణులను నమ్మించి, చివరికి చేతులెత్తేశాడు. వచ్చే ఎన్నికలలో చూసుకుందామని చెప్పి కార్యకర్తలను నారాజ్‌ చేశాడు. బిజేపి లో కూడా రాజగోపాల్‌ రెడ్డి అంటే అసంతృప్తి పెరిగిపోయింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ సరిగ్గా ఎన్నిక దగ్గరకు రాగానే రాహుల్‌ గాంధీ జోడో యాత్ర తెలంగాణ లోకి ప్రవేశించింది. నాయకులంతా మునుగోడును వదిలేశారు. పాల్వాయి స్రవంతిని ఒంటరిని చేశారు. అయితే ఆ పార్టీ నాయకులు, అభిమానులు మాత్రం కాంగ్రెస్‌ కే ఓటు వేశారు. ఇక బిఎస్పి కూడా డబ్బు పంపకం అంతొ ఇంతో చేసినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ కూడా ఓట్లు చీలుస్తోంది. మొత్తం టిఆర్‌ఎస్‌ పార్టీ సంస్థాగత ఓటు బ్యాంకు, ఆసరా, ఇతర పించన్‌ దారులు, రైతులు మొత్తంగా టిఆర్‌ఎస్‌ వైపే నిలిచారు. కారుకు ఓటేశారు. కేసిఆర్‌ నాయకత్వానికి మరో సారి మునుగోడు ద్వారా మద్దతుగా నిలిచారు.

వనభోజనాలకు ముఖ్య అతిథిగా హాజరు కావలసిందిగా ఎంపీ రవిచంద్రను ఆహ్వానించిన కొండాపూర్ మున్నూరుకాపులు

హైదరాబాద్: కార్తీక మాసం సందర్భంగా ఈనెల 6వ తేదీన తమ ఆధ్వర్యంలో నగరంలోని

బొటానికల్ గార్డెన్స్ లో జరిగే వనభోజన మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావలసిందిగా కొండాపూర్ కాపు, మున్నూరుకాపు సంఘం రాజ్యసభ సభ్యులు

వద్దిరాజు రవిచంద్రను ఆహ్వానించింది.తెలంగాణ మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు డాక్టర్ కొండా దేవయ్య, ప్రముఖులు ఆర్వీ మహేందర్,వాసాల వెంకటేష్ ల నాయకత్వంలో కొండాపూర్ సంఘానికి చెందిన పలువురు నాయకులు గురువారంఎంపీ రవిచంద్రను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన కాపు, మున్నూరు కాపు, తూర్పు కాపు, బలిజ,ఒంటరి కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొనే ఈ మహోత్సవానికి తప్పకుండా హాజరు కావలసిందిగా ఎంపీని కోరగా,అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.ఈ సందర్భంగా కొండాపూర్ సంఘం ప్రముఖులు రమేష్, శివకుమార్,రమణ,వసంత రావు, వెంకటేశ్వర్లు, రామకృష్ణ,బి.వెంకటేశ్వర్లు తదితరులు ఎంపీ వద్దిరాజును శాలువాతో సత్కరించారు.

ఓటు నీ ఆయుధం

దానిని అమ్మకానికి పెట్టకు…

నోటు కోసం ఎదురుచూడకు..

నోటు పట్టుకొచ్చేవాడిని చీకొట్టు…

ప్రలోభాలకు గురికాకు…

ఆగం‌ కాకు..

నిజాయితీ గా ఓటేసి గర్వపడు…

మనస్సాక్షి చెప్పిందే విను..

ఓటు పవిత్రమైనది…

మీ జీవితాలను మార్చేది.

ఒకనాడు ఎన్నికలంటే ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఓటు వేసే సమయంలో మనస్సాక్షి, ఆత్మసాక్షితో వేసేవారు. కానీ ఇప్పుడు ప్రలోభాలకు గురై నాయకులు చెప్పిన మాటలకు తలొగ్గుతున్నారు. ఓటును అపహాస్యం చేస్తున్నారు. ఓటు ఎంతో పవిత్రమైనది. ఇప్పుడున్న కాలంలో నిస్వార్ధ నాయకులు లేరు. స్వార్థపరులు తప్ప నిజాయితీ పరులు కానరారు. ఈ డెబ్బై ఏళ్ల ప్రజాస్వామ్యంలో ప్రజలు నాయకులను చెడగొడుతున్నారా? నాయకులు ప్రజలను ప్రలోభ పెట్టి ఎన్నికలలో గెలుస్తున్నారా? అన్న దానిపై ఎంత చర్చ జీడిపాకంలా సాగుతుందే తప్ప, ముగింపు గురించి ఆలోచించే వారు లేకపోతున్నారు. ఎన్నికలలో గెలిచి నాయకులు చేసేదేమీ లేదు. తమకు ఉపయోగపడేదేమీ లేదు. అందుకే ఓటుకు నోటు తీసుకుంటున్నామనేది కొందరి వాదన. ప్రజలు అడిగి మరీ తీసుకుంటుంటే పోటీ ప్రపంచంలో నోటు పంచక తప్పడం లేదంటున్నారు నాయకులు. ‌ఎవరు ఎవరికి ఈ జాఢ్యం అంటించారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ అపవాదును జనం మీదకు తోసేస్తున్నారు నాయకులు. ఓ ముప్పై ఏళ్ల క్రితం వరకు ఓటుకు నోటు పంచడం అన్నది లేదు. తెలియదు కూడా… అయితే అప్పుడు నాయకుడు కూడా ప్రజలకు పెద్దగా తెలియదు. పార్టీని చూసి ఓటు వేసేవారు. ఇప్పుడూ జనం అదే చేస్తున్నారు. కానీ నాయకుడు గురించి తెలుసుకుంటున్నారు. నాయకుడు ఎంత మంచివాడైనా నోటు పంచకపోతే ఓటు వేసే పరిస్థితి లేదు. అంతెందుకు తెలంగాణ ఉద్యమ కాలంలో సైతం నోటు పంచక తప్పని పరిస్థితి. ఇది ప్రజల బలహీనత అని మాత్రం అంటే తప్పవుతుంది. ప్రజలకు నాయకులే అలవాటు చేశారు. ఎన్నికలలో పోటీ నాయకులు ఖర్చు చేయాల్సిన దెంత? ఖర్చు చేస్తున్నదెంత? ప్రజలకిచ్చేవి లెక్కలోకి రాని ఖర్చు. గెలిచాక ఆ నాయకుడు సంపాదన అంతకు వందల రెట్లు. ఇది ప్రజలు గమనించడం లేదు. నోటు తీసుకున్నాక అడిగే హక్కు ఓటరు కోల్పోతున్నాడు. ఒకప్పుడు నాయకుడు ఎన్నికల సమయమైనా, మామూలు సమయమైనా ప్రజలంటే వంగి వంగి దండాలు పెట్టేవారు. కానీ ఇప్పుడు జనం చేతనే దండాలు పెట్టించుకుంటున్నారు. దండలు వేయించుకుంటున్నారు. ఎన్నికలలో గెలిచాక దండం‌ పట్టుకొని వాయిస్తున్నారు. పన్నుల వడ్డింపులతో నడ్డి వాయగొడుతున్నారు. అయినా జనంలో మార్పు రావడం లేదు. ఎన్నికల నాడు జనానికి రూకలు పంచడం కోసం నాయకులు వ్యాపార మార్గాలు ఎంచుకుంటున్నారు. ప్రజాసేవ గాలికి వదిలేస్తున్నారు. అక్రమ సంపాదనకు ఎగబడుతున్నారు. గెలుపు గుర్రాలు కావడానికి చేయకూడని పనులన్నీ చేసి సంపాదిస్తున్నారు. ఎన్నికల నాడు మెతుకులు విదిల్చి ఓట్లు కొంటున్నారు. ప్రజలను ప్రలోభ పెట్టి, ఓటరు తనను తాను నిందించుకునే స్థితి తెచ్చిన నాయకుడి నోట నోటు అన్న పదం రానీయకుండా చేయండి. ఓటును కొనుక్కోవచ్చన్న దరిద్రపు ఆలోచన వున్న నాయకుడి భరతం పట్టండి. నోటు కాదు నగరం బాగు చేయండి అని చెప్పండి. ధరల మోత కాదు, సరసమైన ధరలుండేలా చూడమని నిలదీయండి. రోడ్లేయమని అడగండి. విద్య, వైద్యం ఉచితంగా అందివ్వాలని డిమాండ్ చేయండి. యువతకు ఉపాధి చూపించమని చెప్పండి. వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు ప్రభుత్వం ద్వారా సహకారం చేయమని సూచించండి. లేకపోతే నాయకుడి మాట నీళ్ల మూట అవుతుంది. డబ్బులు తీసుకొని ఓటేస్తే రాసిచ్చిన బాండ్ పేపర్లకు కూడా విలువుండదు. ఎన్నికల సమయంలో అలా రాసిచ్చే తప్పుడు వాగ్థానాలకు చట్ట బద్దత వుండదు. నైతికత అన్నది రాజకీయాలలో ఏనాడో కనుమరుగైంది. నీతి, న్యాయం మాటలకే పరిమితమైంది. అవినీతి రాజ్యమేలుతోంది. పేదోడి జీవితంతో రాజకీయం ఆటాడుకుంటోంది. అది మారాలి. సమాజంలో మార్పు రావాలి. అందుకు ముందు ఓటరు మారాలి. నోటు పట్టుకొని వచ్చి ఓటు కొనజూచిన వాళ్లను చెప్పుతో కొట్టాలి. ఆ పార్టీ ఇవ్వలేదు, ఈ పార్టీ ఇవ్వలేదని లెక్కలేసుకునేవి కాదు ఎన్నికలు. ప్రజల తలరాత మార్చేవి ఎన్నికలు. ప్రజా పరిపాలనలో ప్రజలు అమ్ముడుపోవద్దు. నాయకుడికి ఓటును కొనుగోలు చేసే అవకాశం ఇవ్వొద్దు. మనల్ని పాలిచేందుకు ముందుకొచ్చిన వారిలో మంచి నేతను ఎన్నుకునేందుకు ఓటు ఒక మార్గం. ఆ మార్గంలో అనేక ప్రలోభాలుంటాయి. వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్లాలి. ఏయే పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న నాయకులు ఎలాంటివారు? వారి పరిస్ధితి ఏమిటి? వారు ఎంత వరకు మేలు చేయగలరు? ఎవరు ఎంత స్వార్ధపరులు.. ..నిస్వార్ధపరులు. ఎంతోకాలం నుంచి రాజకీయల్లో ఉన్నవారు ఎవరు? ఇంత కాలం ఏంచేశారు. ఎవరు ఎక్కవకాలం సామాజిక సేవ చేస్తున్నారు. ప్రజల కోసం జీవితాలను త్యాగం చేసినవారు ఎవరు? ఇలా అన్ని రకాల విషయాలు పరిగణలోకి తీసుకొని ఓటు వేయడం అన్నది ప్రతి ఓటరు విధి. నాకు వీలు కాలేదు..నేను వెళ్లలేదు?

ఇలాంటి మాటలు చెప్పకండి. మరీ ఇబ్బంది పడి వెళ్లలేని పరిస్ధితి ఉన్నవారు తప్ప ఓటు వేయడానికి అనుకూలంగా,ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయండి. ఎంత దూరంలో ఉన్నా వెళ్లి ఓటు వేయండి. అంతే కాదు మంచో చెడో గాని ఆయా గ్రామాలలో ఓటు ఉండి, దూరం ఉన్న వారిని పార్టీలు కూడా రప్పించేందుకు సహకరిస్తాయి. కనీసం అలాంటి అవకాశాన్ని వినియోగించుకోండి. ఒక్క పూట పనిపోతే, నష్టపోయేదేమీ ఉండదు. కాని ఆ ఒక్క రోజు సమాజం మీద ఎంతో ప్రభావం చూపే రోజు కూడా. ప్రజల తలరాతల్ని మార్చే రోజు కూడా…అందువల్ల ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ముఖ్యంగా విద్యావంతులు ఓటు హక్కుపై ప్రజలకు అవాహన కల్పించాలి. కొందరు మేధావులు ప్రజలకు చైతన్యం నేర్పేవారు కూడా ఓటు వేయని వారు వున్నారు. ఓటు వేయం అనడం నైతికత కాదు. ఓటు వేయొద్దని చెప్పడం నేరం. అయితే సమాజంలో కొన్ని వ్యవస్ధలు ఓటును భహిష్కరించడం వంటివి చేసేవారు. అది కూడా నిరసనలో ఒక భాగమన్న మాట చెప్పేవారు. కాని అది సరైంది కాదు. అందుకే ఎన్నికల సంఘం నోటా కూడా తెచ్చింది. దాంతో ఓటును భహిష్కరించడం తగదు. ఎవరూ నచ్చకపోతే నచ్చలేదని చెప్పడానికి కూడా మార్గం వుంది. అందువల్ల ఓటు వేయండి. నిత్యం సోషల్‌ మీడియాలో సమాజం గురించి, దేశం గురించి చెప్పేవాళ్లు కూడా చాల మంది ఓటు వేయరు. నిజానికి వాళ్లే ముందు ఓటు వేయాలి. ఇక మరి కొందరు పెద్ద క్యూలైన్‌ వుందని, తర్వాత చూద్దామంటారు. ఆఖరుకు ఓటు వేసే సమయం పూర్తయ్యాక బయలుదేరుతుంటారు. ఓటు వేయకుండనే వెనక్కి వస్తుంటారు. మరి కొందరు తమ పోలీంగ్‌ బూత్‌ను ఎక్కడో అర్ధం కావడం లేదని తిరిగి వచ్చేవారు వున్నారు. ఇలా రకరకాల కారణాలతో ఓటు వేయకుండా వుండేవాళ్లు కూడా సమజంలో సగం మంది వుంటున్నారు. అందుకే నూటికి నూరు శాతం కాకపోయినా, కనీసం 90శాతం ఓటింగ్‌ కావాలి. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి ఎక్కడా మొత్తం ఓటింగ్‌ అయిన దాఖలాలు లేవు. కనీసం 70శాతం కూడా ఓటింగ్‌ నమోదు కాని సందర్భాలు అనేకం వున్నాయి. కొన్ని సార్లు మరీ ఘోరం. కనీసం 50శాతం కూడా పోలింగ్‌ కాని రోజులున్నాయి. ముపై ఐదుశాతం దాటని ఎన్నికలు కూడ వున్నాయి. ఇలాంటి పరిస్ధితులు వుంటాయని రాజ్యాంగ పెద్దలు ఊహించి వుండరు. అవగాహన లేకనో, అర్ధం కాకనో, ఓటు వేయడానికి రాని వారుంటారేమోగాని, ఓటు వేయడానికి బద్దకించి రాని వారు వుంటారని మన పెద్దలు అనుకోని వుండరు. ఈ తరం కన్నా…గత తరమే మిన్న గత ఇరవై ఏళ్ల క్రితం ఓటు పోతే, ఎన్నికల సంఘం తయారు చేసిన ఓటరు లిస్టులో పేరు లేకుంటే నానా హంగామా చేసేవారు. ఓటు లేకపోతే పోయినట్లే అని అనుకునేవారు. అంతగా ఓటును పవిత్రంగా చూసుకునేవారు. ఇప్పుడు ఓటు ఉండాలి. అంత వరకే. ఓటు వేయడానికి మాత్రం రావడానికి ఇష్టపడరు. ఆ రోజు సెలవైనా రారు. ఒక్కరోజు సెలవు దొరికిందని ఎంజాయ్‌ చేసే రకాలు కూడా ఉన్నారు. ఇక ఐటి రంగం పెరిగిన తర్వాత ఓటు అంటే మరీ లెక్కలేకుండా పోయింది. ఉద్యోగానికి మాత్రం ఓటరు కార్డు కావాలి. కాని ఓటు వేయడానికి మాత్రం రారు. ఇప్పటికీ ఓటు ఒక వేళ గళ్లంతైతే ఆగం చేసేది నిన్నటి తరమే కాని, నేటి తరం ఓటు వుందా? లేదా? గల్లంతైందా? ఎందుకైంది? అని కూడా చూసుకునే తీరిక లేదు. ఇది ప్రజాస్వామ్య మనుగడకు గొడ్డలిపెట్టు. ఓటును అందరూ పొందాలి. అందరూ ఓటు వేయాలి. అప్పుడే ప్రజాస్వామ్యం మరింత ఫరిడమిల్లుతుంది. ప్రపంచంలోనే మనది అత్యంత పెద్ద రాజ్యాంగం. అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశం. 

 అందరికీ ఓటు కొట్లాడి సాధించుకున్నది

మనం ఈ తరంలో తెలంగాణ ఎలాగైతే కొట్లాడి సాధించుకున్నామో…అలాగే రాజ్యాంగ రచన కాలంలో, మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో బాబా సాహెబ్‌ అంబెద్కర్‌ కొట్లాడి మరీ సాధించిందే ఓటు. ఓటు ఎలా ఉండాలన్నదానిపై నాడు పెద్దఎత్తున చర్చ జరిగింది. చాలా వరకు సంపన్నులకు ఓటు ఉంటే చాలన్నారు. పురుషుల కు ఓటు ఉండాలన్నారు. కాని ఒక్క బాబాసాహెబ్‌ అంబెద్కర్‌ మాత్రమే అందరికీ ఓటు హక్కు వుండాలన్నారు. ధనిక, పేద, కులం, మతం, మగ, ఆడ అన్న తేడా లేకుండా యుక్త వయసు వచ్చిన ప్రతి ఒక్కరికీ, మన దేశంలో నివసిస్తున్న వారందరకీ ఓటుహక్కు ఉండాలని పట్టుపట్టి ఓటు హక్కు కల్పించారు. స్వేచ్ఛాయుత సమాజ నిర్మాణం గావించారు. సమాజంలో పాలన అందరి సొందరి సొత్తన్నాడు. అందరూ పాలనలో పాలు పంచుకోవాలన్నారు. బలహీన వర్గాలు పాలనలో పాలు పంచుకోవాలన్నారు. సమాజానికి దగ్గరగా వున్నా, మను షులకు, వారి మనసులకు దూరంగా వున్న వారు కూడా పాలనలో భాగస్వామ్యం కావాలని రిజర్వుడు స్ధానాలు కల్పించాడు. ఎస్సీ, ఎస్టీలను చట్టసభలకు పంపేందుకు మార్గం వేశాడు. సమజాంలో అధికంగా వున్న బలహీన వర్గాల ప్రాతినిధ్యం, ప్రాదాన్యం వుండాలని బలంగా కోరుకున్నాడు. నిండైన రాజ్యాంగాన్ని నిర్మించాడు. మనకు వరంగా ప్రసాదించాడు. ఆ రాజ్యంగఫలాలు అందరూ అందుకోవాలి. రాజకీయ పాలనా పరమైన ప్రజాస్వామ్య విధానంలో అందరూ భాగస్వామ్యం కావాలి.

టీయూడబ్ల్యూజే సభ్యత్వ నమోదు ప్రారంభం

– నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా డ్రైవ్

– రెండో వారంలో కమిటీల ఎన్నిక

– నగర సమావేశంలో నేతల వెల్లడి

ఖమ్మం, నవంబర్, 2:

జర్నలిస్టుల సంఘం.. టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టింది. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఆకుతోట ఆదినారాయణ అద్యక్షతన బుధవారం జరిగిన ఖమ్మం నగర యూనియన్ విస్త్రత స్థాయి సమావేశంలో కొత్త సభ్యత్వాలను చేర్పించు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా

ఆదినారాయణ మాట్లాడుతూ.. నేటి నుంచి ఖమ్మం జిల్లాలో సభ్యత్వ నమోదుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని అన్నారు. నియోజకవర్గాల వారీగా ఆయా కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయని ప్రకటించారు. జిల్లా యూనియన్ బాధ్యుల సమక్షంలో జరిగే కార్యక్రమంలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున యూనియన్ సభ్యత్వాలను స్వీకరించాలని కోరారు. ప్రతి సభ్యుడు రూ. 200 లు చెల్లించాలని సూచించారు. సభ్యత్వ నమోదుకు పూర్తయిన తర్వాత నవంబర్ రెండో వారం నుంచి నియోజకవర్గాల వారీగా కమిటీలు ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలు, హక్కులు, సౌకర్యాల కోసం పాటుపడే యూనియన్ ఒక్క టీయూడబ్ల్యూజే మాత్రమే అని ఆయన పునరుద్ఘాటించారు. భవిష్యత్తులో జర్నలిస్టులకు మరింత మేలు జరగాలంటే టీయూడబ్ల్యూజే యూనియన్ ను బలోపేతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు నాయకుల చేతుల మీదుగా సభ్యత్వాలు స్వీకరించారు. 

 

సమావేశంలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇస్మాయిల్, నాయకులు బొల్లం శ్రీనివాస్, వి. సాంబశివరావు, రామకృష్ణ, చిర్ర రవి, కోటేశ్వరరావు, రజనీకాంత్, రామిశెట్టి విజేత, బాలబత్తుల రాఘవా, మందాటి వెంకటరమణ, కొత్త యాకేష్, ఆడెపు ఉపేందర్, బెల్లంకొండ రాజేంద్ర ప్రసాద్, కేవీ, జగదీష్, వీడియో జర్నలిస్ట్ యూనియన్ అద్యక్షుడు చెరుకూరి నాగరాజు, ఫొటో జర్నలిస్ట్ యూనియన్ అద్యక్షుడు రాధారపు రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ రవిచంద్ర ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ నాయకత్వాన రోడ్డు షోకు తరలి వచ్చిన మున్నూరు కాపులు

నారాయణ పురం కేటీఆర్ రోడ్డు షోలో జనమే జనం

కేటీఆర్ ప్రసంగానికి విశేష స్పందన

మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చివరి రోజు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కే.టీ.రామారావు నారాయణ పురంలో నిర్వహించిన

రోడ్డు షోకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.మండల కేంద్రంలోని చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ రోడ్డు షోలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్

నాయకత్వాన మున్నూరుకాపులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.రోడ్డు షో ప్రారంభానికి ముందు నారాయణ పురం శివార్లలో గులాబీ శ్రేణులు,యువత బాణాసంచా పేల్చుతూ,పూలు చల్లుతూ కేటీఆర్ కు దారి పొడవునా అపూర్వ

స్వాగతం పలికారు.ఆ తర్వాత చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు.ఫ్లోరోసిస్ రక్కసిని పాతరబెట్టి పరిశుద్ధమైన తాగునీళ్లను అందిస్తున్న, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు గాను టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని ఓటేసి గెలిపించాల్సిందిగా కోరారు.కేటీఆర్ ప్రసంగానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.”జై తెలంగాణ జై జై తెలంగాణ”, “జై కేసీఆర్ జై జై కేసీఆర్”, “జిందాబాద్ జిందాబాద్ టీఆర్ఎస్ జిందాబాద్”,”కారు గుర్తుకే మన ఓటు”అనే నినాదాలు హోరెత్తాయి.కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్,సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యే కిశోర్,మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్, మున్నూరు కాపు ప్రముఖులు చల్లా హరిశంకర్,వాసుదేవుల వెంకటనర్సయ్య,ఆర్వీ మహేందర్,వాసాల వెంకటేష్,గుండ్లపల్లి శేషగిరిరావు,విజయ్ భాస్కర్, సీపీఐ,సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

ప్రచారం స్వస్తి- ప్రలోభం జాస్తి! మూగబోయిన మైకులు.

రాజగోపాల్‌ రెడ్డి బిజేపిలో చేరడంతో వచ్చిన ఉప ఎన్నిక. 

నాలుగు నెలలుగా మునుగోడు వార్తల్లో నిలిచింది.

ఎంతో ఆసక్తిని తేలుతున్న ఉప ఎన్నిక.

ఎన్నికల షెడ్యూల్‌ రాక ముందు నుంచే మునుగోడులో అన్ని పార్టీల ప్రచారం.

రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా తర్వాత వరుసగా బహిరంగ సభలు.

ఆ తర్వాత అక్కడే మకాం వేసిన రాజకీయ పార్టీలు.

మూడు నెలలుగా హోరెత్తిన ప్రచారం.

ప్రజలు ఎవరిని కనికరిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి…

ఎవరికి వారే వేసుకుంటున్న లెక్కలు!

గెలుపు, బలాబలాలపై ఆరాలు…

మునుగోడు పోలింగ్‌ పై ఎన్నికల కమీషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

మూడు నెలలుగా సాగుతున్న మునుగోడు ప్రచారం మంగళవారం సాయంత్రం 5గంటలతో ముగిసింది. గ్రామాల్లో మైకుల మోత ఆగిపోయింది. ఒక్కసారిగా తుఫాను వెలిసినట్టు వాతావరణం చల్లబడ్డది. కాని లోపల ఈ గరం కనిపిస్తూనే వుంది. ప్రచారానికైతే స్వస్తి జరిగింది. కాని అసలు కథ ఈ రోజే మొదలౌతుంది. ప్రలోభాల పరిఘట్టం ఈ రోజే శ్రీకారం జరుగుతుంది. ఉప ఎన్నిక రోజు సాయంత్రం దాకా గుట్టు చప్పుడు కాకుండా సాగుతుంది. ఎన్నికల సంఘం మునుగోడు ఉప ఎన్నిక కోసం సర్వం సిద్దం చేసింది. యంత్రాంగం సిద్ధమైంది. పూర్తి బందోబస్తు మధ్య మునుగోడు ఉప ఎన్నిక జరగనున్నది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి, బలగాలను మోహరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

మూడు నెలల క్రితం రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. 

బిజేపి తీర్ధం పుచ్చుకున్నారు. నిజానికి రాజగోపాల్‌రెడ్డి రెండేళ్ల కిందనుంచే బిజేపిలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయనే చెప్పుకున్నాడు. ఇదిలా వుంటే బిజేపికి వెళ్లడానికి ముందు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్ధితి అంతకంతకూ దిగజారుతోందని టిఆర్‌ఎస్‌లో చేరాలని పలు ప్రయత్నాలు చేశాడని తెలుస్తోంది. ఈ విషయం సాక్ష్యాత్తు టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పడం జరిగింది. గత మూడు సంవత్సరాలుగా టిఆర్‌ఎస్‌ గాని, బిజేపిలోకి గాని వెళ్లాలన్న నిర్ణయం తీసుకున్నాడు. అయితే టిఆర్‌ఎస్‌లోకి ఆయన ఆహ్వానించేందుకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్‌ సుముఖత వ్యక్తం చేయలేదు. కోమటిరెడ్డి సోదరులు ఒక్క మాట మీద నిలబడే వ్యక్తిత్వం వారిలో లేదని కేసిఆర్‌ చెప్పినట్లు కూడా కేటిఆర్‌ వివరించడం జరిగింది. ఆయను నమ్మిన రాజశేఖరరెడ్డిని, జగన్‌ను మోసం చేశారని, అలాంటి వారు అవకాశవాదులని చెప్పడం జరిగిందన్నది కేటిఆర్‌ చెప్పడం జగింది.  

 రాజగోపాల్‌రెడ్డి స్వయంగా కేటిఆర్‌ను కలిసి తాను టిఆర్‌ఎస్‌లో జాయినౌతానని కూడాచెప్పినట్లు వెల్లడిరచారు. 

అంతే కాకుండా చాల మంది నేతలతో కూడా రాయబారాలు పంపినా మా పార్టీ రాజగోపాల్‌ను దరి చేరనీయలేదు. దాంతో ఆయన బిజేపి వైపు చూసినట్లు తెలుస్తోంది. పనిలో పనిగా తన కొడుకు వ్యాపారమైన సుషి ఇన్‌ఫ్రా కోసం రూ.18వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు కూడా వచ్చేందుకు బిజేపి సహకరించడంతో ఆ పార్టీలో చేరినట్లు రాజకీయ ఆరోపణలున్నాయి. కాకపోతే కాంట్రాక్టుకు సంబంధించిన విషయం రాజగోపాల్‌రెడ్డే చెప్పడంతో రాజకీయ పార్టీ ఆరోపణలకు బలం చేకూర్చినట్లైంది. ఎప్పుడైతే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశాడో అప్పటినుంచి రాజకీయ పార్టీలన్నీ మునుగోడులో మకాం వేశాయి. 

 రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన రెండో రోజే కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చండూరులో పెద్ద ఎత్తున సభ జరిగింది.

 ఆ సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డినుద్దేశించి ఆ పార్టీ నాయకుడు అద్దంకి దయాకర్‌ ఆగట్టునుంటావా? ఈ గట్టునుంటావా? అంటూనే ఓ వ్యాఖ్య చేశాడు. అది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. వెంకటరెడ్డి ఆ ఒక్క మాటను అడ్డం పెట్టుకొని పార్టీకి దూరంగా వుంటూ వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ కాంపెయినర్‌ గా వుంటూ కూడా ప్రచారం చేయలేదు. చేయనని కూడా తేల్చి చెప్పారు. వారం రోజుల క్రితమే ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. అక్కడి నుంచి తమ్ముడు రాజగోపాల్‌ గెలుపు ప్రచారం మొదలుపెట్టారు. గ్రామ స్ధాయి నాయకులకు, అనుచరులకు ఫోన్లు చేశారు. ఇదిలా వుంటే బిజేపి కూడా మునుగోడు ఉప ఎన్నిక మీద పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నది. ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ పరమైన విజయాలు కాకపోయినా, వాటిని ఖాతాలో వేసుకొని దూకుడు కనిపించేలా ప్రచారం సాగించింది. ఒక దశలో తెలంగాణ రాజకీయాల్లో కల్లోలం సృష్టించేందుకు కూడా ప్రయత్నం జరిగిందనేది తెలుస్తోంది.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మునుగోడు ఉప ఎన్నికకు మరింత హీట్‌ పెంచింది. హోరా హోరీగా మార్చింది. 

    మునుగోడు ఉప ఎన్నికను అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.

 రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన తర్వాత కొంత కాలానికి ముఖ్యమంత్రి కేసిఆర్‌ సభ నిర్వహించారు. ఎన్నికల నాటికి మళ్లీ వస్తానని చెప్పి అక్టోబర్‌ 30న మరోసారి సభ నిర్వహించారు. తెలంగాణలోని 80 మంది ఎమ్మెల్యేలను కూడా పార్టీ మోహరించింది. ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు మొత్తం టిఆర్‌ఎస్‌ శ్రేణులన్నీ మునుగోడు ప్రచారం సాగించాయి. అదే విధంగా బిజేపి కూడా కేంద్రమంత్రులు, సీనియర్‌ నాయకులు, ఇతర జిల్లాల బాధ్యులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున మునుగోడులో ప్రచారం సాగించాయి. పెద్దఎత్తున వలసలు ప్రోత్సహంచారు. ఎవరు ఏ పార్టీలో వున్నారో, ఎటు వైపు వెళ్తున్నారో కూడా తెలియని గందరగోళం సృష్టించారు.  

  ఇక కాంగ్రెస్‌ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి ఆఖరు నిమిషం దాకా టిక్కెట్టు కన్‌ఫర్మ్‌ చేయలేదు.

 ఆమె కూడా గట్టిపోటీ ఇస్తుందన్నది విశ్లేషకుల మాట. ఇలా మూడు నెలలుగా రకరకాల రాజకీయ విన్యాసాలతో ప్రచారం సాగింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారిన ఏకైక అంశం అభివృద్ధి. అందులో ప్రధానంగా ఫ్లోరైడ్‌ సమస్య. ఫ్లోరైడ్‌ సమస్య తీర్చి, మునుగోడు కష్టంతీర్చడంతో టిఆర్‌ఎస్‌ పాత్రను ఎవరూ కాదనలేనిది. దశాబ్ధాలుగా జరగని పనిని తెలంగాణ వచ్చిన వెంటనే జరిగింది. మునుగోడులో ఫ్లోరైడ్‌ నుంచి ప్రజలకు విముక్తి కలిగింది. ఈ విషయాన్ని బిజేపి సైతం ఓన్‌ చేసుకునేందుకు ప్రయత్నం చేసింది కాని సక్సెస్‌ అయినట్లు కనిపించలేదు. కాంగ్రెస్‌ మాత్రం ఆ విషయం ప్రస్తావించకుండా సైలెంటుగా ప్రచారం చేసుకుంటూ వెళ్లింది. 

 ఇక ప్రచార పర్వం పూర్తయ్యింది. ఇక ప్రలోభ పర్వం మొదలౌతుందంటున్నారు. 

ఏ ఎన్నికల్లో అయినా ఇది కామన్‌గా మారింది. ప్రచార సమయం ముగిసిన రోజు నుంచి పోలింగ్‌ రోజు వరకు ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు నియోజకవర్గంలో రకరకాల తాయిలాలు గుట్టు చప్పుడు కాకుండా అందిస్తుంటారు. రాత్రికి రాత్రి పంపకాలు జరుగుతుంటాయి. అయితే మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో దసరా పండుగ రోజు రాజీకీయ పార్టీలు జరిపిన పంపకాలు కూడా పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చాయి. ఇక దీపావళి పండుగను కూడా రాజకీయ పార్టీలు వదలలేదు. ఆ రోజు కూడా ప్రజలను మచ్చిక చేసుకునే ఎత్తుగడలు వేవారు. ఆ మధ్య జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సమయంలో తమకు అందాల్సినవి అందలేదని ప్రజలు ధర్నా చేసిన సందర్భం కూడా చూశాం. అంటే ప్రజలను ఆ విధంగా రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి చేసి పబ్బం గడుపుకుంటున్నాయి. ఓటర్‌ను అవినీతి పరుడిగా చిత్రీకరించే దుష్ట ప్రయత్నాలు కొన్నేళ్లుగా సాగుతూనే వున్నాయి. మునుగోడులోనూ అదే నడస్తోందన్న ప్రచారం ఊపందుకొన్నది. ప్రలోభాలు లేకుంటే ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఏ పార్టీకి లేదు. ఏది ఏమైనా ఓ వైపు ఎన్నిక టెన్షన్‌తోపాటు, లెక్కలు కూడా వేసుకోవడంలో పార్టీలు నిమగ్నమయ్యాయి. ఓటరు మహాశయుడు ఎవరిని కరునిస్తారో అన్న ఆసక్తి మాత్రం అందరిలోనూ కనిపిస్తోంది.

బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో విజిలెన్స్ అవగాహన సదస్సు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి 

భద్రాద్రి కొత్తగూడెం: బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో సోమవారం స్థానిక పోస్ట్ ఆఫీస్ సెంటర్ కొత్తగూడెం బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో కేంద్ర విజిలెన్స్ అధికారుల ఆదేశాల మేరకు విజిలెన్స్ వారాంతపు అవగాహన సదస్సును ప్రారంభించడం జరిగింది. ఈ విజిలెన్స్ వారాంతరపు అవగాహన సదస్సు అక్టోబర్ 31 సోమవారం నుండి నవంబర్ ఆరవ తారీకు వరకు వారం రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ కొత్తగూడెం సబ్ డివిజన్ ఆఫీసర్ బానోత్ సక్రు నాయక్ తమ తోటి ఉద్యోగుల చేత సమగ్రత ప్రతిజ్ఞను చేయించడం జరిగింది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి ఎటువంటి ప్రలోభాలకు అవినీతికి పాల్పడకుండా సోదర భావంతో తమ వృత్తిని నిర్వర్తించి ఈ దేశ సమగ్రతకు అభివృద్ధికి తోడ్పాటు చేయాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ డి ఈ .ఎండి. షకిల్, జే టి ఓ రామరాజు, ఆఫీస్ సూపర్డెంట్ శివరాంజి, జె ఈ నూర్ అహ్మద్, జేఈ సందీప్, నారాయణ లక్ష్మి స్వరూప సుజాత తదితరులు పాల్గొన్నారు.

సెయింట్ జోసెఫ్ స్కూల్లో సీట్ల కొరకై కలెక్టర్ కు వినతి పత్రం కోట శివశంకర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి 

చుంచుపల్లి మండలం రుద్రంపూర్ : సెయింట్ జోసెఫ్ స్కూల్ బెస్ట్ అవైలబుల్ స్కూల్లో బి ఏ ఎస్ స్కీం కింద వివిధ కారణాలతో టీసీలు తీసుకొని వెళ్ళిపోయిన ఐదుగురు విద్యార్థుల ప్లేస్ లో కొత్త సీట్లను ఒకటో తరగతిలో నింపాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటా శివశంకర్ కలెక్టర్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ విద్యా సంవత్సరం కచ్చితంగా మిగిలిన ఐదు సీట్లను కొత్తవారితో నింపి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు వారికి ఉచిత విద్యను అందించాలని కలెక్టర్ ని కోరడం జరిగింది వెంటనే కలెక్టర్ అనుమతి ఇవ్వడం జరిగింది హైదరాబాదుకి లెటర్ రాసి కలెక్టర్ కొత్త సీట్లు పర్మిషన్ రాగానే నింపుతానని హామీ ఇవ్వడం జరిగింది .

ఉత్పత్తి మరియు పని తీరు పై  పత్రికా ప్రకటన

ఉత్పత్తి మరియు పని తీరు పై 

పత్రికా ప్రకటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి 

కొత్తగూడెం జి.ఎం. ఆఫీసు నందు గల కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రెస్ మీట్ జరిగినది. దీనికి కొత్తగూడెం ఏరియా ఇంచార్జ్ జి.ఎం. బూర రవీందర్ గారు మరియు కొత్తగూడెం ఏరియా పత్రికా ప్రతినిధులు హాజరు అయినారు.  

 

         ఇంచార్జ్ జి.ఎం. బూర రవీందర్ మాట్లాడుతూ , కొత్తగూడెం ఏరియా 2022-2023 ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నెల కొత్తగూడెం ఏరియా కు నిర్దేశించబడినది 12.00 లక్షల టన్నుల ఉత్పత్తి లక్షానికి గాను 08.66 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 72 % ఉత్పత్తి సాధించడం జరిగినది. 

 

 అలాగే కొత్తగూడెం ఏరియా 2022-23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు 71.47 లక్షల టన్నులకు గాను 62.34 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 87 శాతం ఉత్పత్తి సాదించామని తెలిపినారు. 

   

   మరియు రోడ్డు మరియు రైల్ ద్వారా అక్టోబర్ నెల 8.66 లక్షల టన్నులు మరియు ఏప్రిల్ నుండి అక్టోబర్ 31 వ తారీకు వరకు 66.26 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిగినధి అని కొత్తగూడెం ఏరియా ఇంచార్జ్ జి.ఎం. బూర రవీందర్ పత్రిక ప్రకటనలో భాగంగా తెలియజేసారు.

 ఈ విలేకరుల సమావేశంలో ఎస్‌ఓటు జి‌ఎం శ్రీ రమేశ్, ఏరియా ఇంజనీర్ రఘు రామ రెడ్డి, ఏజి‌ఎం సూర్యనారాయణ, డి.జి‌.ఏం.(పర్సనల్) సామూయెల్ సుధాకర్ , డి.జి‌.ఏం.(ఐ.ఈ) యోహాన్ , ఆర్.సి.హెచ్.పి. డి.జి‌.ఏం.(ఈ&ఎం) వెంకటేశ్వర్లు, సీనియర్ సెక్యూరిటి ఆఫీసర్ రమణ రెడ్డి, పర్చేస్ ఎస్.ఈ(ఈ&ఎం) బులి మాధవ్, ఏరియా స్టోర్స్ ఎస్.ఈ(ఈ&ఎం) ప్రకాష్, మరియు కొత్తగూడెం ఏరియా పత్రికా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎన్ సి డి ప్రోగ్రాం అధికారులతో నిర్వహించిన డి ఎం&హెచ్ ఓ దయానంద స్వామి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో డి ఎం హెచ్ డాక్టర్ కే దయానంద స్వామి ఆధ్వర్యంలో భద్రాచలం డిప్యూటీ ఆఫీస్ సిబ్బందికి ఎన్ సి డి ప్రోగ్రాం అధికారులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి ఈ సంజీవిని సేవల గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా జిల్లాలో అన్ని మారుమూల గ్రామలా గ్రామాల నుంచి ఆరోగ్య కార్యకర్తలు రోగస్థులకు ఎంపిక చేసి వారితో. టేలి కన్సల్టెన్సీ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైధ్యాదికారితో వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికతో సిద్ధం కావాలని అమలు చేయాలని తెలిపారు అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పేషంట్ల జాబితాలో సిద్ధం అయి జిల్లా ఆసుపత్రిలోని వైద్య నిపుణులతో టెలికాన్సల్టెన్సీ ద్వారా సేవలందించాలని కోరారు .ఈ యొక్క ఈ. సంజీవని ద్వారా మారుమూల ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు .ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో డాక్టర్ కే దయానంద స్వామి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రాజకుమార్ ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చేతన్ , ఏవో డాక్టర్ సంధ్యారాణి సిబ్బంది సి హెచ్ ఓ రామకృష్ణ ,హెచ్ ఈ ఓ కృష్ణయ్య ,రాంప్రసాద్ హెచ్ఈఓ, హెచ్ఈ బేబీ రాణి తదితరులు పాల్గొన్నారు

పదవీ విరమణ సన్మానం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి 

 

కొత్తగూడెం ఏరియా పర్సనల్ డిపార్ట్మెంట్ కార్యలయం లో తేదీ. 31-10-2022, న పర్సనల్ మేనేజర్ గా పని చేసి పదవి విరమణ పొందిన శ్రీ జి. బుచ్చయ్య ని.కొత్తగూడెం ఏరియా లోని అధికారులు మరియు సిబ్బంది పుష్పగుచ్చాన్నిచ్చి సన్మానించి శాలువా మరియు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. దీనికి ముఖ్య అతిదిగ కొత్తగూడెం ఏరియా ఇంచార్జ్ జి.ఎం. బూర రవీందర్. మరియు కొత్తగూడెం ఏరియా టి‌బి‌జి‌కే‌ఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎం‌డి.రజాక్ హాజరు అయినారు.  

 ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ… జి. బుచ్చయ్య దాదాపు 25 సంవత్సరాల సుధీర్గ సర్విసు పూర్తి చేసుకొని మంచి నడవడికతో, అంకిత భావంతో పని చేసి తేదీ 31-10-2022 న పదవీ విరమణ పొందుచున్నారని వారి శేష జీవితం సుఖ సంతోషాలతో వర్దీల్లాలని ఆకాంక్షించారు. 

 

 ఈ కార్యక్రమానికి ఏరియా ఇంజనీర్ రఘు రామి రెడ్డి, డి.జి‌.ఏం.(పర్సనల్) సామూయెల్ సుధాకర్ , డి.జి‌.ఏం.(ఐ.ఈ) యోహాన్ , ఎస్టేట్స్ మేనేజర్ మరియు సి ఎం ఓ ఏ ఐ.ప్రెసిడెంట్ రామకృష్ణ, సీనియర్ సెక్యూరిటి ఆఫీసర్ రమణ రెడ్డి, పర్చేస్ ఎస్.ఈ(ఈ&ఎం) బులి మాధవ్ గారు జి.ఎం. ఆఫీసు అధికారులు మరియు సిబ్బంధి పాల్గొన్నారు

దిగజారుడు, దివాళాకోరు రాజకీయం బిజేపిది: మంత్రి హరీష్‌రావు.

`నోరు తెరిస్తే అబద్దాలు తప్ప నిజాలు చెప్పలేని బిజేపినేతలు.

`చెప్పుకోవడానికి నిజాలు లేక, అబద్దాల మీద రాజకీయాలు చేస్తున్నారు. 

`పదే పదే అబద్దాలు ప్రచారం చేసి, నిజాలని నమ్మించాలని దిక్కుమాలిన రాజకీయాలు బిజేపివి.

`రాష్ట్రంలో అతి ఎక్కువ రైతు బంధు అందుతున్న నియోజకవర్గం మునుగోడు.

`మునుగోడులో 1,01279 మంది రైతులు రైతు బంధు పొందుతున్నారు. 

`వానాకాలంలోనే 131 కోట్ల, 82లక్షల రూపాయలు అందించడం జరిగింది. 

`40వేల ఆసరా పెంన్షన్లు అందుతున్నాయి. 

`1200 మంది రైతులకు రైతు భీమా అందింది.

`టిఆర్‌ఎస్‌ ఫ్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుంటే…బిజేపి కేంద్రం ధరలు పెంచుతోంది. 

  హైదరాబాద్‌,నేటిధాత్రి: 

అబద్దాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన బిజేపి నాయకులు తీరు దివాళాకోరు తనాన్ని చూపిస్తుందని, చిల్లర చేష్టలతో దిక్కుమాలిన రాజకీయం

చేస్తున్నారని రాష్ట్ర ఆర్ధిక, వైద్య శాఖ మంత్రి హరీష్‌రావు దుయ్యబట్టారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ బిజేపి నేతల తీరును తూర్పార పట్టారు. మునుగోడులో ముఖ్యమంత్రి కేసిఆర్‌ సభ సక్సెస్‌ కావడంలో బిజేపి నేతలకు మతి పోయినట్లైంది.

ప్రజలు చండూరు సభకు పెద్దఎత్తున స్వచ్ఛందంగా తరలిరావడం బిజేపి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి సభకు అంత పెద్దఎత్తున ప్రజలు హాజరుకావడంతో తమ ఉనికే ప్రమాదంలో పడిరదని బిజేపి గాయిగత్తర చేస్తోందన్నారు. చండూరు సభతో టిఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమైందన్నది బిజేపి నేతలకు పూర్తిగా స్పష్టమైంది. తెలంగాణ ప్రజల విశ్వాసానికి ప్రతిరూపమైన ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వానికి తాము అండా దండా అని ప్రజలు మరోసారి నిరూపించారని వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు అని హరీష్‌రావు అన్నారు. ఈ సభ విజయవంతం కావడంతో బిజేపి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి, బండి సంజయ్‌కి కంటిమీద కునుకు లేకుండాపోయిందని మంత్రి ఎద్దేవా చేశారు. మునుగోడులో ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమేసిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. బిజేపి వాళ్ల మాటలను గురించి దేశంలో ఎక్కడ అడిగినా వాళ్ల వెకిలి, మకిలి మాటలే కాదు, సర్వం అబద్దాల మయమని ఎద్దేవా చేశారు. వారి బతుక్కి ఒక్క నిజం కూడా చెప్పరని అన్నారు. అబద్దాలు ఆడడమే బిజేపి పార్టీ డిఎన్‌ఏ అని మంత్రి విమర్శించారు. రాజ్యాంగబద్దమైన పదవుల్లో వున్న కేంద్ర మంతులు పచ్చి అబద్దాలు ఆడడానికి కూడా వెనుకాడడం లేదని ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. 

 సీఎం సభ తర్వాత బిజేపి నేతలకు దిమ్మ తిరిగి ఏం మాట్లాడాలో కూడా అర్ధం కాక, వింత వింత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. 

డిల్లీ నుంచి వచ్చిన బిజేపి నాయకులు గల్లీ నాయకులకు తీసిపోని విధంగా మాట్లాడడం విడ్డూరమన్నాడు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రాష్ట్ర నాయకులను ఆ పార్టీ నేతలే విశ్వసించడం లేదన్నది తేలిపోయిందని, దాంతో వారి స్ధాయి ఏమిటో అర్ధమైందన్నారు. ప్రజాస్వామ్యంలో బిజేపి నేతల తీరు చాలా బాధాకరమన్నారు. వ్యవసాయానికి మీటర్ల మీదగాని, జిఎస్టీల మీద గాని నిజాలు మాట్లాడే శక్తి బిజేపి నేతలకు వుందా?అన్నారు. ఎనమిదేళ్లలో తెలంగాణలోఎంత అభివృద్ధి జరిగిందో బిజేపి నేతలు కళ్లుండి కూడా చూడలేకపోతే వారిపై జాలి పడడం తప్ప చేసేదేమీ లేదన్నారు. మునుగోడులో తిరుగుతూ మునుగోడులో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూడలేక పోతున్నారు. మునుగోడులో ఫ్లోరైడ్‌ గోస తీర్చిన ఘనత టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుంది. శుద్ధిచేసిన కృష్ణానది నీళ్లు ఇంటింటికీ చేరుతున్నారు. మంచినీళ్ల కోసం బిందె భుజం మీద పెట్టుకొని నాలుగేళ్లయిందని, ముఖ్యమంత్రి కేసిఆర్‌ వల్లనే మా కష్టం తీరిందని ఓ చెల్లె చెప్పిందని మంత్రి హరీష్‌రావు గుర్తుచేశారు. ఎల్బీనగర్‌ నుంచి నీళ్ల క్యాన్‌లు వస్తే మంచినీటి చుక్క దొరకని పరిస్దితి ఒకనాడు మునుగోడుది. అలాంటి మునుగోడులో ఇప్పుడు ఇంటింటికీ మంచినీరు అందుతుండడం నిజం కాదా? ఆయన ప్రశ్నించారు. అయినా అబద్దాలు ఆడే బిజేపి నేతలకు కర్రుకాల్చి వాతలు పెట్టాల్సిందేనన్నారు. 

 ప్రతి ఇంటికీ తాగునీరు, రైతు బందు, సాగుకు ఉచిత విద్యుత్‌,రైతు భీమా, కళ్యాణ లక్ష్మి,ఆసరా పెన్షన్‌,వంటి పధకాలు కూడా మునుగోడులో అందిన సంగతి బిజేపి నేతలకు కనిపించడం లేదా?

 డిల్లీలో, హైదరాబాద్‌లో కూర్చొని మాట్లాడడం కాదు…మునుగోడు వెళ్లి ప్రజలను అడిగితే చెబుతారు అని హరీష్‌రావు అన్నారు. తెలంగాణ వచ్చాక, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసిఆర్‌ వల్ల ప్రతి ఇంటికి మునుగోడులో ఏదో రకమైన సంక్షేమ పధకం అందింది. కాని బిజేపి వల్ల రూ.400 వున్న సిలిండర్‌ ధర రూ.1200 అయ్యింది. మేం సంక్షేమ పథకాలు పంచితే, బిజేపి ధరలుపెంచిండ్రని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోనే అతి ఎక్కువ రైతు బంధు పొందిన నియోజకవర్గం మునుగోడు. మా ఎమ్మెల్యేలకు వందల కోట్లు ఆశ చూపించినా, వాటిని గడ్డిపోచల్లా వదులుకొని ప్రజా స్వామ్యపరిరక్షణకు నిలబడ్డారని అదీ టిఆర్‌ఎస్‌కు వున్న నిబద్దత అని మంత్రి అన్నారు. 

 రాజ్యాంగ బద్దంగా నిబందనలకు అనుగుణంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేల టిఆర్‌ఎస్‌లో విలీనమయ్యారే గాని, బిజేపిలా ప్రభుత్వాలను కూలగొట్టలేదని హరీష్‌రావు అన్నారు.

 ఈడిలు, బోడీలు నిజాయితీకి ప్రతీరూపమైన టిఆర్‌ఎస్‌ నాయకులను ఏమీ చేయలేరన్నారు. అబద్దాన్ని పదే పదే వల్లిస్తూ నిజం చేయాలని బిజేపి చూస్తోందని ప్రజలు ఈ విషయాన్ని గమనించారన్నారు. బిజేపి చెప్పే మాటల్లో ఏ ఒక్కటీ నిజం లేదన్న విషయం రాష్ట్రంలోని 63 లక్షల మంది రైతులకు తెలియాల్సిన అసవరం వుందని మంత్రి అన్నారు. రైతుల ఉరితాడుకు వేళాడే పరిస్ధితి బిజేపి తెవాలని చూస్తుంటే, రూ.35వేల కోట్లు కాదని రైతులే తమకు ముఖ్యమనుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్‌ అని హరీష్‌రావు చెప్పారు. వ్యవసాయ మీటర్లు పెట్టమని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ అని వివరించారు. జిఎస్టీ మీద హరీష్‌రావు సంతకం చేశాడని పచ్చి అబద్దాలు చెప్పడం కిషన్‌రెడ్డి,సంజయ్‌లు మానుకోవాలని హితవు పలికారు. చిన్న పిల్లాడికి సైతం బిజేపి నేతలవి చిల్లర మాటలని తెలిసిపోతుందన్నారు. ఓట్ల కోసం ఇంత దిగజారి మాట్లాడతారా? అని హరీష్‌రావు ప్రశ్నించారు. గత జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఇలాగే పచ్చి అబద్దాలు ప్రచారం చేసి, ఆఖరకు ఏం చేప్పారో తెలిసిందే…మాట మీద నిలబడే తత్వం బిజేపిలో లేదన్నది ఎప్పుడో నిరూపించారు. ఇంకా ఆ పార్టీని ప్రజలు నమ్మడం అన్నది కలలో కూడా జరగదన్నారు. చేనేతపై జిఎస్టీ అమలు చేయొద్దన్నదానిపై అప్పటి ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్‌ బిజేపిలోనే వున్నారని, నిజం తెలుసుకొని మాట్లాడాలని హరీష్‌రావు అన్నారు. జిఎస్టీ విషయంలో తనపై అసత్య ఆరోపణలు చేసిన బిజేపి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారం కోసం రూ.800 కోట్లు ఇచ్చినట్లు కిషన్‌ రెడ్డి చెప్పడం అంతకన్నా పచ్చి అబద్దం ఏమైనా వుంటుందా? అని మంత్రి నిలదీశారు.

బిజేపిని విశ్వసించే వాళ్లే లేరు : ఎమ్మెల్సీ పళ్ళ రాజేశ్వర్‌ రెడ్డి

కట్టాతో మునుగోడు నుంచి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

రాజగోపాల్‌ రెడ్డికి ఓట్లసలే పడవు.

మునుగోడును ముంచి కాంట్రాక్టు తెచ్చుకొన్నాడు.

మూడేళ్ల నుంచి జనాన్ని గాలికొదిలేశాడు.

అదే టిఆర్‌ఎస్‌ గెలిస్తే మునుగోడు అద్దయ్యేది…ప్రగతి పరుగులు పెట్టేది.

మిషన్‌ భగీరథ నీళ్లు అందరికన్నా ముందు వచ్చినట్టు, అనేక అభివృద్ధి పనులు జరిగేవి.

కాంగ్రెస్‌ పరిస్థితి అందరూ చూస్తున్నదే….

సిఎం కేసిఆర్‌ సభ సూపర్‌ సక్సెస్‌…

పెద్ద ఎత్తున ప్రజలొచ్చారు…సిఎం చెప్పింది విన్నారు.

నిజానికి ప్రజలు ఎప్పుడో డిసైడ్‌ అయ్యారు.

సిఎం సభతో మరింత ఫిక్స్‌ అయ్యారు…

బిజేపి గెలిస్తే రాజగోపాల్‌ రెడ్డి ఒక్కడే బాగుపడతాడు.

టిఆర్‌ఎస్‌ పార్టీ గెలిస్తే నియోజకవర్గం మొత్తం బాగుపడుతుంది.

ఇది ప్రజలకు తెలుసు. అందుకే ఎక్కడికెళ్లినా ఇదే మాట వింటున్నాము.

1972 లోనే ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారానికి రూ.254 కోట్లు ప్రతిపాదించారు

 నాయకులకు చిత్తశుద్ధి లేక నిధులు వాడలేదు…ఫ్లోరైడ్‌ పోలేదు.

ప్రతి ఎన్నికలలో ఫ్లోరైడ్‌ సమస్య తీరుస్తామని చెప్పడం, ఓట్లేయించుకోవడం కాంగ్రెస్‌ కు అలవాటు.

ఫ్లోరైడ్‌ లేకుండా చేసి టిఆర్‌ఎస్‌ ఓట్లడుగుతోంది. ఇది మా అంకిత భావం.

మునుగోడులో ఓట్లడిగే నైతిక హక్కు బిజేపి, కాంగ్రెస్‌ కు లేదు.

జనాలు ఆ పార్టీలను అసహ్యించుకుంటున్నారు…

టిఆర్‌ఎస్‌ కే మా ఓటని ప్రజలే చెబుతున్నారు.           

  హైదరాబాద్‌,నేటిధాత్రి: 

మునుగోడు నియోజకవర్గంలో బిజేపియే లేదు. గ్రామీణ స్ధాయిలో ఆ పార్టీకి తెలంగాణలో చోటే లేదు. ఓటు బ్యాంకు అన్నది అసలే లేదు. కాని హైప్‌ క్రియేట్‌ చేసి, డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసి, ప్రచారం చేసుకున్నంత మాత్రాన ఓట్లు పడతాయా? బిజేపికి ఓట్లు వేయాల్సిన వాళ్లే మునుగోడులో లేరు. ఆ పార్టీకి సానుభూతి పరులు కూడా లేరు. గ్రామీణ జీవన వ్యవస్ధను చిద్రం చేస్తున్న బిజేపిని నమ్ముడం అంటూ జరిగే ప్రసక్తి లేదు. వ్యవసాయానికి కరంటు మోటార్ల దగ్గర నుంచి మొదలు పెడితే…ఎరువుల ధరలు పెంచి, పురుగు మందుల ధరలు విపరీతంగా పెంచి, గిట్టుబాటు ధరలు ప్రకటించడం మానేసి, మార్కెటింగ్‌ వ్యవస్ధను చిన్నాభిన్నం చేసిన పార్టీయే బిజేపి కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ రైతులు పండిరచిన బియ్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెట్టడమే కాదు, తెలంగాణ రైతులను నూకలు తినమని చెప్పిన అహాంకార పార్టీ బిజేపి. పైగా ప్రజలకు సంక్షేమ పధకాలు ఇవ్వడం వారిని సోమరిపోతులను చేయడం అన్న భావన వచ్చేలా, అభివృద్ధి కుంటుపడుతుందన్న సాకును చెబుతున్న బిజేపికి ఓట్లు పడతాయా? బిజేపి చేస్తున్న మోసాలను ప్రజలు ఇక సాగన్విరు. అది మునుగోడు నుంచే మొదలౌతుంది. బిజేపి పతనానికి మునుగోడే నాంది…వారి అబద్దాలకు ఇక్కడే పుల్‌స్టాప్‌ పడుతుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అంటున్నారు. ఆయన మాటాల్లోనే మునుగోడులో ప్రచారంపై కట్టాతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి. 

బిజేపి ఎన్నెన్ని మోసాలు చేస్తుందో…ఎన్నెన్ని అబద్దాలు చెబతుందో ప్రజలు చూస్తున్నారు. 

నిత్యాసర వస్తువులు పెరిగినా వాటిని కంట్రోల్‌ చేయడంలేదు. అంటే బిజేపి ప్రభుత్వం సామాన్యులపై మోయలేని భారాలను ఐచ్చికంగానే వేస్తోందన్నది తేటతెల్లమౌతోంది. ఇక రూపాయి విలువ తగ్గడం కాదు, డాలర్‌ విలువ పెరుగుతుందని దేశ ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పడం అంటేనే పరిపాలన పట్లు వారికి వున్న చిత్తశుద్ది ఏమిటో తేలిపోయింది. పెట్రోల్‌ ధరలు నిత్యంపెరిగేలా వ్యవస్ధను ప్రోత్సహించి, ప్రజల నెత్తిన బారం మోపి, ప్రెట్రోలియం కంపనీలకు లాభాలు తెచ్చిపెడుతున్న ఏకైక ప్రభుత్వం బిజేపినే… ఎవరైనా ప్రజలకవసరమైన వస్తువులు సరసరమైన ధరలకు, అందుబాటులో వుండాలని చూడాలి గాని, ప్రజల కొనుగోలు శక్తిని నిర్వీర్యం చేసేలా వుండకూడదు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో అంతిమంతా వాటి ప్రభావం సామాన్యుడు కొనుగోలు చేసే నిత్యావసర వస్తువుల మీద పడుతున్నాయి. ప్రజల నడ్డివిరిస్తున్నాయి. దీనికి తోడు జిఎస్టీ బండ తెచ్చి ప్రజల మీద రుద్దుతున్నారు. గ్యాస్‌ బండ ధర విపరీతంగా పెంచుకుతున్నారు. అంటే ప్రజలు పెట్రోల్‌ ధరల మూలంగా పని చేసుకోలేక, పెరుగుతున్న ధరల మూలంగా కొనుగోలు శక్తి లేక, పెరిగిన గ్యాస్‌ ధరలకు కొనుక్కొలేక, నిత్యావసర వస్తువులు తెచ్చుకోలేక, ఆఖరుకు వంట చేసుకొని నాలుగు మెతుకులు తినలేని స్ధితికి ప్రభుత్వమే నేట్టేడయం బాధాకరం. పైగా ఏడాదికి మూడు సిలిండర్లు సరిపోవా? అని కేంద్ర మంత్రే చెప్పడం అంటే ప్రజల జీవన స్ధితి మీద వారికి ఎంత అవగాహన వుందో అర్ధం చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే బిజేపి చేస్తున్న మోసాలు రాస్తే రామాయణమంతా, వినిపిస్తే బారతమంతా అవుతాయి. 

  వీటి ప్రభావం మునుగోడు మీద ఖచ్చితంగా పడుతుందని చెప్పడంలో సందేహం లేదు. 

మునుగోడు ఉప ఎన్నిక అన్నది ఎందుకొచ్చిందో ప్రజలకు తెలుసు. ఉప ఎన్నిక తెచ్చిన రాజగోపాల్‌రెడ్డిని, బిజేపి పార్టీని ప్రజల అసహ్యించుకుంటున్నారు. తన స్వార్ధం కోసం, తన కంపనీకి రూ.18 వేల కాంట్రాక్టుకోసం నియోజకవర్గాన్ని ముంచిన నాయకులు చరిత్రలో ఎక్కడా కనిపించరు. ఒక్క రాజగోపాల్‌రెడ్డి తప్ప…అలాంటి వ్యక్తిని నమ్మి గతంలో ఓట్లేసినందుకు ప్రజలు బాధపడుతున్నారు. ప్రజల ప్రయోజనాలు, నియోకవర్గ ప్రగతిని విస్మరించి, గెలిపించిన ప్రజలను మోసం చేసిన వ్యక్తిగా రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ప్రజలు ఎప్పుడూ అసహ్యించుకుంటూనే వుంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసి, వ్యాపారాలలో లబ్ధి పొందాలని చూడడం దుర్మార్గం. అందుకే మునుగోడులో రాజగోపాల్‌రెడ్డికి ఘోర ప్రభావం తప్పదు. మరోసారి మునుగోడు గురించి ప్రస్తావించే అర్హత కూడా కోల్పోయాడు. ఏ కేంద్ర ప్రభుత్వమైతే రైతులను మోసం చేస్తుందో ఆపార్టీలో చేరి రాజగోపాల్‌రెడ్డి ఎలాంటి సంకేతాలిస్తున్నట్లో గమనించలేనంత అమాయకులు కాదు ప్రజలు. ఈ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డికి తగిన బుద్ది చెప్పడానికి ఎదరుచూస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లోకి రాలేని పరిస్ధితి రాజగోపాల్‌రెడ్డిది. ఏ ఊరికెళ్లినా తరుముతున్నారు. మరో నాలుగు రోజులైతే మునుగోడులో ఒక్క బిజేపి కార్యకర్త కూడా కనిపించడు. మునుగోడులో ప్రచారానికి అద్దెకొచ్చిన వాళ్లు, మళ్లీ మునుగోడు ముఖం కూడా చూడరు. రాజగోపాల్‌రెడ్డి అసలే చూడడు. ఈ విషయం ప్రజలకు తెలుసు. ప్రజలను అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసే నాయకులకు రాజగోపాల్‌రెడ్డి ఓటమి ఓ గుణపాఠంగా మిగిలిపోతుంది. 

 నిజంగా ఉమ్మడి నల్లగొండను ఏలిన కాంగ్రెస్‌ నేతలకు ఏనాడు చిత్తశుద్ది లేదు. ఫ్లోరైడ్‌ సమస్య తీరిపోవద్దన్నట్లే యాభైఏళ్లపాటు వ్యవహరించారు.

 ఆఖరుకు దివంగత పి.వి. నర్సింహారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారం చేయాలని అనుకున్నాడు. కాని నల్లగొండ జిల్లానేతలే ఆయనకు సహకరించలేదు. ఫ్లోరైడ్‌ను రూపు మాపేందుకు ఆయనకు తోడు నిలవలేదు. ఉమ్మడి రాష్ట్రంలో భూసంస్కరణలు అమలు చేయాలని అనుకున్న పి.విని దించేశారు. ఫ్లోరైడ్‌నిధులు మురిపోయేలా చేశారు. ఆనాడు రాజకీయాల కోసం పి.వి. దించడానికి సహకరించిన నల్లగొండ కాంగ్రెస్‌ నాయకులు, ఫ్లోరైడ్‌ సమస్యను మాత్రం గాలికి వదిలేశారు. నాడు కేటాయించిన రూ.254 కోట్లు అక్కరకు రాకుండా చేశారు. ఫ్లోరైడ్‌ సమస్యను సజీవం చేశారు. ఎన్నికలొచ్చినప్పుడు ఫ్లోరైడ్‌ సమస్య తీర్చుతామని చెప్పడం, గెలవగానే ఫ్లోరైడ్‌ సమస్య మర్చిపోవడం. దశాబ్ధాలుగా కాంగ్రెస్‌ చేసింది ఇదే..అందులో కోమటి రెడ్డి బ్రదర్స్‌ కూడా భాగాస్వాములే… గత ముపై సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాల్లో వున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్లగొండ ఫ్లోరైడ్‌ సమస్యను పట్టించుకోలేదు. నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తేలేదు. కాని ఆయన వ్యక్తిగత సంపాదన కోసం మాత్రం పులిచింతల ప్రాజెక్టు తెచ్చుకున్నాడు. పోతిరెడ్డి పాడు పొక్క పెంచే కాంట్రాక్టు దక్కించుకున్నాడు. ఫ్లోరైడ్‌ సమస్య తీర్చలేదు. 

  ఫ్లోరైడ్‌ సమస్య తీరాలంటే తెలంగాణ రావాల్సిందే అని ఉద్యమ కాలంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఊరూరుకిచెప్పాడు.

 ఇప్పుడు ప్రతి ఊరికి సురక్షితమైన మంచినీళ్లు అందిస్తున్నాడు. దటీజ్‌ కేసిఆర్‌… తెలంగాణ రాగానే మునుగోడులో ఫ్లోరైడ్‌ సమస్య తీర్చుతానని చెప్పాడు. అన్నట్లుగానే ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు, మునుగోడులో ఫ్లోరైడ్‌ లేకుండా చేశాడు. మిషన్‌ భగీరధ పైలాన్‌ ఇక్కడే ఏర్పాటు చేసి, తొలి స్వచ్ఛమైన మిషన్‌ భగీరధ నీటిని మునుగోడుకే ఇచ్చిండు. ఇదీ నాయకులకు వుండాల్ని కమిట్‌ మెంటు. ప్రజలకు మాటిచ్చామంటే నెరవేర్చాలి. అందులో ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ఫ్లోరైడ్‌ మహామ్మారి అంతం చూడాలంటే ముందు అలాంటి పనులు మొదలుపెట్టాలి. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రత్యేక చొరవతో ముందుగా మునుగోడును శతాబ్ధాలుగా పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్‌ సమస్యను తీర్చాడు. అందువల్ల మునుగోడులో ఓట్లడిగే హక్కు ఒక్క టిఆర్‌ఎస్‌కే వుంది. బిజేపికి, కాంగ్రెస్‌లకు ఓట్లడిగే నైతికతే లేదు. మునుగోడు ప్రజల జీవన సంజీవని మంచినీళ్లు..ఆ గొంతును తడిపిన అమృతమటువంటి సురక్షిత మంచినీరిచ్చిన టిఆర్‌ఎస్‌కే మా ఓటని ప్రజలే నినదిస్తున్నారు. కూసుకుంట్లప్రభాకర్‌రెడ్డిని దీవిస్తున్నారు.

టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి కొండంత అండగా నిలిచిన కేటీఆర్,జగదీష్ రెడ్డి, రవిచంద్ర, బొంతు రాంమోహన్

రామంతాపూర్ కు చెందిన జగదీష్ ఇటీవల పుట్టపాకలో ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలిసిందే

 

జగదీష్ సతీమణి పద్మజకు 18లక్షలు అందజేసిన రవిచంద్ర, రాంమోహన్

జగదీష్ పెద్ద కుమారుడు సచిన్ కు అమెరికా విమాన టిక్కెట్లు ఏర్పాటు చేసిన రవిచంద్ర

చిన్న కుమారుడు తరుణ్ కు ఉద్యోగం ఇప్పిస్తానని కేటీఆర్ భరోసా

హైదరాబాద్: ప్రమాదవశాత్తు మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త తాడిశెట్టి జగదీష్ కుమార్ కుటుంబానికి మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రాంమోహన్ లు కొండంత అండగా నిలిచారు.మునుగోడు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన నారాయణ పురం మండలం పుట్టపాకలో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడి తీవ్ర గాయాలపాలై తుదిశ్వాస విడిచారు.విషయం తెలిసిన వెంటనే రవిచంద్ర హైదరాబాద్ హస్తినాపురంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి,కుటుంబాన్ని ఓదార్చిన విషయం తెలిసిందే.జగదీష్ అంత్యక్రియల ఖర్చులతో పాటు పెద్ద కుమారుడు సచిన్ అమెరికా నుంచి వచ్చి వెళ్లడానికి వద్దిరాజు విమాన టిక్కెట్లు సొంతంగా ఏర్పాటు చేశారు.అలాగే, సోమవారం రవిచంద్రతో పాటు రాంమోహన్ రామంతాపురంలోని నివాసానికి వెళ్లి జగదీష్ సతీమణి పద్మజ, కుమారులు సచిత్,తరుణ్ లను పరామర్శించి రూ.18 లక్షలు అందజేశారు.తరుణ్ కు త్వరలో ఉద్యోగం ఇప్పిస్తానన్న కేటీఆర్ భరోసా గురించి బొంతు రాంమోహన్ వారికి తెలిపారు.ఈ సందర్భంగా జగదీష్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు,కాలనీ ప్రముఖులు కూడా ఉన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ పోచంపల్లి

ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ పోచంపల్లి

మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా చండూరులో ఆదివారం టీఆర్ఎస్ ఏర్పాటు

చేసిన పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవడంతో వారిద్దరు గులాబీ శ్రేణులతో కలిసి సుమారు 2 కిలోమీటర్లు కాలినడకన సభాస్థలికి చేరుకున్నారు.పలువురు కార్యకర్తలు ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిలతో ఫోటోలు దిగారు, జై తెలంగాణ జై జై తెలంగాణ, జిందాబాద్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

అన్నా, తమ్ముడి మధ్య తేడా’0’ నే!?

`కూడిన సున్నాతో వేలకోట్లకు పెరిగిన సంపాదన?

`కట్టాతో మునుగోడు నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.

`కుటుంబంలో రేపటి తరం కోసం, మునుగోడుకు చేసిన మోసం!

`ఆనాడు అన్నకు పులిచింతల పేరు మీద 18వందల కోట్లు?

`ఈనాడు తమ్ముడికి కేంద్రం నుంచి 18వేల కోట్లు?

`కాంట్రాక్టులలో కూడా ఫ్యాన్సీ నెంబర్లు…

`పులిచింతల కడితే అందులో దూకేస్తా అన్నాడు అన్న.

`రాజశేఖరరెడ్డి హయాంలో కాంట్రాక్టు తీసుకొని కట్టిందే వెంకన్న.

`ఆనాడు నల్గొండ రాజకీయాలు అడ్డం పెట్టుకొని… అన్న కోట్లు కూడబెట్టుకున్నాడు.

`తమ్ముడు మునుగోడును ఆత్మ గౌరవం తాకట్టు పెట్టి 18 వేల కోట్లకు టెండర్‌ పెట్టాడు….

`ఇద్దరూ కలిసి తెలంగాణ కు అన్యాయం చేసే పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేశారు.

`పులిచింతలతో తెలంగాణ గ్రామాలు ముంచారు.

`పోతిరెడ్డిపాడు తో తెలంగాణకే అన్యాయం తలపెట్టారు.

`ఇప్పుడేమో నీతులు, త్యాగాలను వల్లిస్తున్నారు.

`కుడి చేత్తో చేసిన సాయం ఎడమచేతికి తెలియకుండా చేయాలంటారు….

`చేసిన సాయాలు చెప్పుకొని అన్నదమ్ములు ఓట్లడుకుంటున్నారు.

`ఆ ఓట్లే లేకపోతే జనాన్ని దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు.

`సాయం పేరుతో మెతుకులు విదిల్చి, రాజకీయం అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించుకొన్నారు.

`పూటకో మాట, గడియకో వేషం కడుతున్నారు…

`అబద్దాల రాజకీయంలో ఓనమాలు నేర్చి, మోసపు రాజకీయాలలో పిహెచ్‌డిలు చేశారు.

`దొందూ దొందే…మరో సారి మునుగోడును ముంచేందుకే!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాజకీయాలంటే ప్రజా సేవ అన్న అర్థాన్ని మార్చేసి, వ్యాపారానికి కేంద్రంగా చేసుకొని కాంట్రాక్టులు నిర్వహించుకున్నవారిలో కోమటిరెడ్డి సోదరులు ముందువరసులో వున్నారు. గతంలో కాంట్రాక్టర్లకు రాజకీయాలకు సంబంధాలుండేవి కాదు. కాని రాజకీయ నాయకులే కాంట్రాక్టు అవతారాలెత్తిన వారిలో కోమటి రెడ్డి సోదరులు ప్రజలను మోసం చేయడానికి కూడా వెనుకాడడం లేదని మరోసారి నిరూపించారు. గతంలో అన్న పులిచింతల పేరు చెప్పి రాజకీయం చేశాడు. ఓట్లు దండుకున్నాడు. ప్రజలను మోసం చేశాడు. వారి నెత్తిన శఠగోపం పెట్టాడు. ఇప్పుడు తమ్ముడు అదే దారిలో నడుస్తున్నాడు. మాది చిన్న కంపనీ అని ఒకనాడు చెప్పాడు. ఇప్పుడేమో! మా రేంజ్‌కు కార్లలో కూడా కాదు, హెలీకాప్టర్లలో తిరగాలంటున్నాడు. పూటకో మాట…గడికో వేషం అన్నట్లు ప్రజలు బురిడీ కొట్టించి, రాజకీయాలను అడ్డం పెట్టుకొని కాంట్రాక్టుల పేరుతో అడ్డదిడ్డంగా సంపాదించి, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టి, ఓట్లు కొని మళ్లీ గెలువొచ్చని చూస్తున్నారు. అన్నా దమ్ములు కుయుక్తులు మునుగోడు ప్రజలకు ఏనాడో తెలిసిపోయింది. రాజగోపాల్‌ రెడ్డి ఇప్పుడు తల కిందికి పెట్టి తపస్సు చేసినా, కోట్లు కుమ్మరించి ఓట్లు కొనుక్కొవాలని చూసినా ప్రజలు నమ్మే పరిస్ధితి లేదు. ఓట్లే పడే పరిస్థితి అసలే లేదు. వారికి ఈసారి మునుగోడులో ఓటమి తప్పదు. ప్రజల చేతిలో గుణపాటం తప్పదు అంటున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి మునుగోడు నుంచి కట్టాతో…!ఒకనాడు మాది చిన్న వ్యాపారం అన్న నోటితోనే, కార్లలో కాదు, హెలీకాప్టర్లతో తిరిగేంత రేంజ్‌ అంటున్నారు.

అంటే ఆ సంపాదన పెరగడానికి కారణం రాజకీయాలు. నల్లగొండ ప్రజలు. భువనగిరి నియోజక వర్గ ప్రజలు, మునుగోడు ఆశీస్సులు. రాజకీయాలు చేసేవారు వ్యాపారాలు చేయొద్దని కాదు..కాకపోతే ప్రజలను అడ్డం పెట్టుకొని కాంట్రాక్టులు సంపాదించడం ప్రజలను మోసం చేయడమే. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు, ప్రజా సేవ మర్చిపోయి, వ్యాపారాలను పెంచుకుంటూ పోయి, ఎన్ను కున్న ప్రజలను మర్చిపోయి, సాయం పేరుతో పది మెతుకులు విదిల్చి, మేం సాయం చేస్తున్నాం…ప్రజలను ఆదుకుంటున్నామంటూ ప్రచారం చేసుకోవడం తప్పు. సాయం చేయడం అన్నది రాజకీయం కోసమే అని నిరూపించుకుంటున్నారు. కుడిచేత్తే చేసిన సాయం ఎడమ చేతికి తెలియకుండా చేయాలంటారు. కాని కోమటి రెడ్డి సోదరుల ప్రచార పర్వంలో సాయమే ప్రధాన నినాదం చేసుకుంటారు. ప్రజలు ఒక రకంగా బ్లాక్‌ మొయిల్‌ చేస్తుంటారు. మేం మీకు సాయం చేయలేదా? అని ఓటర్లను భయపెడుతుంటారు. ఇవేనా రాజకీయాల్లో నైతికత. ఉమ్మడి రాష్ట్రంలో పులిచింతల నిర్మాణం అన్నది తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు, ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు వ్యతిరేకించారు. పులిచింతల నిర్మాణం వల్ల తెలంగాణలోని గ్రామాలు మునిగిపోయాయి. ఒకనాడు పులిచింతల నిర్మాణం చేపడితే అందులో దూకి ఆత్మహత్య చేసుకుంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. అవి నిజమని నల్లగొండ జిల్లా ప్రజలు నమ్మారు. కాని ఆ ప్రకటన వెనుక ఎంతో మోసం దాగి వుందని గ్రహించలేకపోయారు. ఏ నోటితో అయితే వెంకటరెడ్డి పులిచింతల అడ్డుకుంటానన్నాడో, అదే చేతితో పులిచింతల నిర్మాణంలో భాగం పంచుకున్నారు. కాంట్రాక్టు దక్కించుకొన్నాడు. ఏడు వందల కోట్లతో పూర్తి చేయాల్సిన పులిచింతలను రూ.18 వందల కోట్లదాకా తీసుకెళ్లి లాభాల పంట పండిరచుకున్నాడు.

రాజకీయాన్ని వ్యాపారాన్ని ముడిపెట్టి సంపాదనలో కింగ్‌గా మారి, అదే బ్రాండ్‌ అని ప్రచారం చేసుకున్నాడు. ఓ వైపు పులిచింతలతో తెలంగాణ గ్రామాలకు అన్యాయం చేసి, ప్రతిగా కాంట్రాక్టు సంపాదించి, కృతజ్ఞతగా నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరెడ్డికి తోడుగా నిలిచి, పోతిరెడ్డి పాడు పొక్కను పెద్దది చేయడానికి కోమటిరెడ్డి సోదరులు కారణమయ్యారు. పులిచింతలతో నల్లగొండకు అన్యాయం చేసి, పోతిరెడ్డిపాడుతో మొత్తం తెలంగాణకే అన్యాయం చేశారు. దక్షిణ తెలంగాణను ఎండబెట్టారు. కృష్ణానది పరీవాహక ప్రాంతమైన మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు అందాల్సిన నీటిని రాయలసీమకు, ఆఖరుకు మద్రాసుకు తరలించేందుకు సహకరించారు. తెలంగాణలోనే కరువు జిల్లాగా, వలసల జిల్లాగా పేరున్న మహబూబ్‌నగర్‌కు నీళ్లిచ్చే మనసు రాలేదు గాని, ఎక్కడో వున్న మద్రాసుకు మరిన్ని నీళ్లు తరలించేందకు కోమటిరెడ్డి సోదరులు దోహదపడ్డారు. తెలంగాణను ఎండబెట్టారు. వ్యాపారం ముసుగులో మేమూ తెలంగాణ వాదులమే అని ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే మోసం చేశారు. మంత్రిపదవిని అడ్డం పెట్టుకొని పులిచింతల, పోతిరెడ్డిపాడు కాంట్రాక్టులు చేసి, తెలంగాణ కోసం రాజీనామా చేశానని ప్రజలను నమ్మించారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఎప్పటికప్పుడు ఎత్తులు వేస్తూనే వున్నారు. ఎన్నికల్లో గెలుస్తూ, కాంట్రాక్టులు కొట్టేస్తున్నారు. అవకాశాలిచ్చిన పార్టీలకు సున్నం పెట్టి, స్వార్ధం చూసుకుంటున్నారు. ప్రజలు మోసం చేస్తున్నారు. వేల కోట్లు సంపాదిస్తున్నారు. అన్న దోరణి అలా వుంటే, తమ్ముడు తక్కువేం కాదని నిరూపిస్తున్నాడు. అన్న 18 వందల కోట్లతో పులిచింతల నిర్మాణం చేస్తే,తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి ఏకంగా రూ.18వేల కోట్ల ప్రాజెక్టు సొంతం చేసుకొని తమకు తామే సాటి అని నిరూపిస్తున్నారు. ప్రజలు మోసం చేయడంలో పోటీ పడుతున్నారు. ఒకనాడు అన్న, ఇప్పుడు తమ్ముడు కుటంబంలోని రేపటి తరం కోసం ఆస్ధులు కూడబెట్టుకునేందుకు రాజకీయాలను వాడుకుంటున్నారు.

ప్రజలకు సేవ చేయడం గాలికొదిలేశారు. ఇలా ప్రజలు ప్రతీసారి మభ్యపెట్టి, మాయ చేసి, మోసం చేస్తూ వస్తున్నారు. అదే వరుసలో మరోసారి మునగోడు ప్రజలు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి, మూడేళ్లుగా బిజేపి పాట పాడి, ఆఖరుకు రూ.18వేల కోట్ల ప్రాజెక్టు కొట్టేసి, మునుగోడు ప్రజలకు పంగనామాలు పెట్టేశారు… అభివృద్ధి విస్మరించారు. ఇప్పుడు కొత్త సుద్దులు వల్లిస్తున్నారు…మళ్లీ ఓట్లేస్తే కేంద్రం నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. అన్న ఆస్ట్రేలియా నుంచి ప్రచారం చేస్తుంటే…తమ్ముడు నోట్లతో ఓట్లు కొనుక్కునేందుకు కుయుక్తులు పన్నుతున్నాడు. మునుగోడుతో తెలంగాణ అస్ధిత్వాన్ని కూడా ఆగం చేసేందుకు తెరలేపుతున్నాడు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కల్లోలం రేపుందుకు కారణమౌతున్నారు. మునుగోడు ప్రాంతానికి ఇన్నేళ్ల రాజకీయంలో కోమటిరెడ్డి సోదరులు మంచినీళ్లు ఇవ్వలేకపోయారు…కాని ఇప్పుడేదో ఉద్దరిస్తామని చెప్పుకుంటున్నారు. ప్రజలకు కోమటిరెడ్డి సోదరుల అసలు స్వరూపం తెలిసిపోయింది. వారి నిజస్వరూపాలు బైటపడిపోయాయి. రాజగోపాల్‌రెడ్డిని మరోసారి నమ్మేందుకు మునుగోడు ప్రజలు సిద్దంగా లేదు…ఓట్లేసేందుకు ససేమిరా? అంటున్నారు..గ్రామాల్లోకే రానివ్వడంలేదు. ఈసారి రాజగోపాల్‌ రెడ్డిని ఓడిరచి తగిన బుద్ది చెబుదామని మునుగోడు ప్రజలు చూస్తున్నారు. మరోసారి ప్రజలను మోసం చేయకుండా రాజగోపాల్‌ రెడ్డి రాజకీయ జీవితాన్ని ఇక్కడే పుల్‌స్టాప్‌పడేలా చేసుందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారు. ఈసారి రాజగోపాల్‌రెడ్డి చెప్పే మాయ మాటలు నమ్మమని బహిరంగంగానే చెబుతున్నారు. ఇప్పటికే రాజగోపాల్‌కు ఓసారి అవకాశమిస్తే మునుగోడు అభివృద్ధి కాకుండా పోయింది. ఇప్పుడు మరోసారి మోసపోయేందుకు ప్రజలు సిద్దంగా లేమని చెబుతున్నారు. టిఆర్‌ఎస్‌ను గెలిపించి, అభివృద్ధి చేసుకుంటామంటున్నారు. కోమటిరెడ్డిసోదరులకు చుక్కలు చూపించేందుకు మునుగోడు ప్రజలు సిద్దంగా వున్నారు.

ఎంపీ రవిచంద్ర ఆధ్వర్యంలో మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం

మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా మర్రిగూడలో మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనం

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరు కాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం, చల్లా హరిశంకర్ విష్ణు జగతిలు

సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు,యువత

మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి అఖండ విజయం చేకూర్చడంలో

భాగంగా శనివారం మర్రిగూడ మండల మున్నూరుకాపుల సమ్మేళనం జరిగింది.

మండలంలోని రాంరెడ్డి పల్లి శివార్లలో ఏర్పాటైన ఈ సమ్మేళనానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,

మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్,మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దండు జగన్, మున్నూరుకాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం, చల్లా హరిశంకర్,బండి సంజీవ్,విష్ణు జగతిలు ముఖ్య అతిథులుగా

హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఇబ్రహీం పట్నం మునిసిపల్ వైస్ ఛైర్మన్ యాదగిరి,మున్నూరుకాపు ప్రముఖులు వాసుదేవుల వెంకటనర్సయ్య, రామస్వామి వెంకటేశ్వర్లు, వనమాల

ప్రవీణ్,గుండ్లపల్లి శేషగిరిరావు, ఉప్పు సత్యనారాయణ,పర్వతం సతీష్,వాసాల వెంకటేష్,కోట్ల వినోద్ తదితరులు పాల్గొన్నారు.సమ్మేళనానికి కుల బంధువులు,మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version