ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలి
రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి:
సోమవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల దరఖాస్తులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను కూలం కషంగా పరిశీలించి, పెండింగ్ ఉంచకుండా, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాభవన్ హైదరాబాద్ నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మూడు రోజులలో పరిష్కారం చూపాలని, తదుపరి నివేదికలు అందచేయాలని ఆదేశించారు. ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులు సంబంధిత శాఖల అధికారులకు తగు చర్యలు నిమిత్తం ఎండార్స్ చేసినట్లు తెలిపారు. ప్రజావాణిలో 53 దరఖాస్తులు వచ్చాయని వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజావాణి ప్రధాన ఉద్దేశం ప్రజల ఫిర్యాదులను స్వీకరించి త్వరితగతిన పరిష్కారం చేయడమేనని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మీ, ఆర్డిఓ రవి, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.