124 మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత..
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతోన్నాయి. ఇప్పటి వరకు 124 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందచేశారు.
అహ్మదాబాద్, జూన్ 18: అహ్మదాబాద్లో విమాన ప్రమాదంలో మరణించిన మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షల నిర్వహణ ప్రక్రియ దాదాపుగా పూర్తి కావస్తోంది. ఇప్పటి వరకు 163 మృతదేహాలను గుర్తించారు. వాటిలో 124 మృతదేహాలను అంత్యక్రియల కోసం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. మరికొన్ని మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా కాలిపోయాయి.
అవి గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో మృతదేహానికి ఈ పరీక్ష నిర్వహించేందుకు దాదాపు 75 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ మృతదేహాలను గుర్తించి.. వారి కుటుంబ సభ్యులకు అందించే ప్రక్రియ చాలా ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. డీఎన్ఏ గుర్తించే క్రమంలో ఫోరెన్సిక్ బృందాలు నిరంతరాయంగా తమ పనిని కొనసాగిస్తున్నాయి.
ఇక ఈ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహాంతోపాటు ఈ విమానం కెప్టెన్ సుమీత్ సబర్వాల్ మృతదేహాన్ని సైతం వారి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మృతదేహాలను అంత్యక్రియలు సైతం పూర్తయ్యాయి.
మరోవైపు ఈ ప్రమాద ఘటన అనంతరం గాయపడిన 71 మంది ఆసుపత్రిలో చికిత్స పొందారని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ జోషి వెల్లడించారు. వారిలో ఇద్దరు మరణించారని.. మిగిలిన తొమ్మిది మందికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని వివరించారు.
జూన్ 12వ తేదీ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం లండన్కు టేకాఫ్ అయింది. ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకు మేఘానీనగర్లో కుప్పకూలి దగ్ధమైంది. ఈ విమానంలో 230 మంది ప్రయాణికుల్లో ఒక్కరు మినహా అందరూ మరణించారు. అలాగే ఈ విమానంలో 12 మంది సిబ్బంది సైతం మృతి చెందారు. ఈ విమానం బీజే హాస్టల్పై పడడంతో.. ఆ సమయంలో భోజనం చేస్తున్న 29 మంది మెడికోలు సైతం మరణించారు. పలువురు మెడికోలు సైతం ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.